నరసరావుపేట టౌన్: రైల్లో నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం సాతులూరు రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు నుంచి నరసరావుపేటకు వస్తున్న రైలు నుంచి గుర్తుతెలియని వ్యక్తి జారిపడి మృతి చెందాడు.
సమాచారం అందుకున్న ఎస్ఐ ఎం.రాజామోహన్ సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం తీరును పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుడి ఆనవాళ్లు తెలిసిన వాళ్లు రైల్వే పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని ఎస్ఐ కోరారు.
రైల్వే స్టేషన్లో గుండెపోటుతో వృద్ధుడు
ఈపూరు మండలం గుండే పల్లి గ్రామానికి చెందిన పాతపోతుల మల్లయ్య(85) గురువారం నరసరావుపేట రైల్వే స్టేషన్ బుకింగ్ కౌంటర్ వద్ద కూర్చొని ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు.


