మంగళగిరి టౌన్: మహిళల హక్కులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా వారి రక్షణకు సంఘటితమై పోరాటాలకు సిద్ధం కావాలని ఐద్వా గుంటూరు జిల్లా కార్యదర్శి ఎల్.అరుణ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరి మండలం యర్రబాలెంలో గురువారం ఐద్వా, సీఐటీయూ ఆధ్వర్యంలో మహిళలు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ మద్యం, మాదక ద్రవ్యాలే నేరాలకు మూలమని పేర్కొన్నారు. సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ అంతేస్థాయిలో వారిపై అణచివేత, హింస, వివక్ష పెరుగుతుండడం ఆందోళనకరమన్నారు. మహిళలపై జరిగే నేరాల్లో ఎక్కువ శాతం మద్యం, గంజాయి వంటి మాదక ద్రవ్యాల మత్తులోనే జరుగుతున్నాయని విమర్శించారు. మార్చి 8న గుంటూరులో భారీ ర్యాలీ సదస్సు జరుగనున్నట్లు పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా జరిగే ఈ సదస్సుకు ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రమాదేవి, యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షురాలు కుసుమకుమారి తదితరులు హాజరుకానున్నారని, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఐటీయూ రాజధాని డివిజన్ అధ్యక్షుడు రవి మాట్లాడుతూ గతంలో కార్మికులు ఎన్నో పోరాటాలు చేసి 8 గంటల పనివిధానాన్ని సాధించుకున్నారని, నేటి పాలకులు పని గంటలు పెంచుతూ కార్మిక హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. సీఐటీయూ నాయకులు ఆదిలక్ష్మి, పార్వతి, మేరి, రమాదేవి, అంజలి, తిరుతమ్మ, రామారావు తదితరులు పాల్గొన్నారు.
ఐద్వా జిల్లా కార్యదర్శి అరుణ


