ప్రేమ వ్యవహారంలో యువకుడు బలి
చీరాల: ప్రేమ వ్యవహారంలో ఓ యువకుడిని అతి కిరాతకంగా హత్య చేసిన కేసులో నిందితులను చీరాల వన్టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం రాత్రి స్థానిక వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ ఎండీ మొయిన్ వివరాలను వెల్లడించారు. ఆయన కథనం.. జనవరి 27న చీరాల హరిప్రసాద్నగర్ గేటు సమీపంలో యువకుడు హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ సంఘటనలో జీఆర్పీ పరిధిలోకి రాకపోవడంతో చీరాల వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి ఫొటోలు సోషల్ మీడియాలో రావడంతో వివరాల లభించాయి. మృతుడిని కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన కొండే త్రినాఽథ్ (19)గా గుర్తించారు. మృతుడి సోదరుడు కొండే హేమంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. త్రినాథ్ రోజూ చీరాలకు వచ్చి కరెంటు మేసీ్త్ర వద్ద పనిచేస్తుండేవాడు. త్రినాథ్, ఓ యువతి నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. కొంత కాలం తర్వాత మనస్పర్థలు రావడంతో మాట్లాడుకోవడం లేదు. షేక్ గౌస్ ఈసుబ్ నాలుగు నెలలుగా సదరు యువతితో పరిచయం పెంచుకొని తరచూ ఫోన్లో మాట్లాడుతున్నాడు. త్రినాథ్తో కలిసి యువతి లాడ్జిలో నుంచి బయటకు రావడాన్ని ఏ1 షేక్ గౌస్ ఈసుబ్, ఏ2 దేవహర్ష చూసి వీడియో తీశారు. ఈ వీడియోను తొలగించాలని త్రినాథ్ చెప్పినా పట్టించుకోకపోవడంతో అప్పుడప్పుడు గొడవలు పడుతుండేవారు. త్రినాఽథ్ను అడ్డు తప్పించి యువతికి దగ్గర కావాలని షేక్ గౌస్ ఈసుబ్ నిర్ణయించుకున్నాడు. జనవరి 27న త్రినాథ్కు ఫోన్ చేసి మద్యం తాగుదామని పిలిచాడు. ఇద్దరు కలిసి హరిప్రసాద్నగర్లో రైల్వే గేటు సమీపంలో ఆర్వోబీ కింద కూర్చొని మద్యం తాగారు. ఈ క్రమంలో షేక్ గౌస్ ఈసుబ్ తన స్నేహితుడు దేవహర్షకు ఫోన్ చేసి రప్పించాడు. అతడితోపాటు శీలం భగవంతుడు కూడా వచ్చాడు. అందరూ కలిసి మద్యం తాగారు. అందరూ కలిసి పథకం ప్రకారం హత్య చేసి పరారయ్యారు. విఠల్నగర్లోని చంద్రప్రకాష్, వల్లెపు వాసును కలిసి జరిగిన విషయం చెప్పారు. ఓ ఇంటి వెనుక శ్మశానంలో రక్తం అంటిన దుస్తులు తగలబెట్టి పరారయ్యారు. ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులందరూ 19–21 సంవత్సరాల్లోపు వారే కావడం గమనార్హం. కేసును ఛేదించిన వన్టౌన్ సీఐ ఎస్.సుబ్బారావు, ఎస్ఐ జి.రాజ్యలక్ష్మి, పీఎస్ఐ వెంకటేశ్వరరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ పి.రామారావు, పి.వెంకటేశ్వర్లు, పీసీలు పి.రాజు, ఎన్.భాస్కర్, ఎం.నాగరాజు, జి.బ్రహ్మయ్య, డి.రవి, హోంగార్డు అంకమ్మలను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి, రివార్డులు ప్రకటించారు.


