వ్యాధి నిర్ధారణలో ల్యాబ్ టెక్నీషియన్ల పాత్ర కీలకం
డీఎంహెచ్ఓ డాక్టర్ విజయమ్మ
బాపట్ల: ప్రభుత్వ వైద్యశాలల్లో రోగులకు వ్యాధి నిర్ధారణ చేయడంలో ల్యాబ్ టెక్నీషియన్లది అత్యంత కీలకమైన పాత్ర అని డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ విజయమ్మ అన్నారు. స్థానిక బాపట్ల ఎన్జీవో హోమ్లో మంగళవారం బాపట్ల జిల్లా ల్యాబ్ టెక్నీషియన్లు, సబ్ యూనిట్ అధికారుల నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించారు. డాక్టర్ విజయమ్మ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్లు కచ్చితంగా సమయపాలన పాటిస్తూ రోగులకు ఉన్నత ప్రమాణాలకు అనుగుణంగా వ్యాధి నిర్ధారణ చేసినప్పుడే రోగులకు సరైన న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ల్యాబ్లలో ఏమైనా పరికరాలు అవసరం ఉంటే వెంటనే తెలియజేయాలని చెప్పారు. కార్యక్రమంలో బాపట్ల జిల్లా మలేరియా అధికారి వి నాగార్జునరావు మాట్లాడుతూ కీటక జనత వ్యాధులైన మలేరియా, బోదకాలు, డెంగీ, చికెన్ గున్యా లాంటి వ్యాధులను త్వరితగతిన గుర్తించాలని దీనికి సంబంధించి వైద్యాధికారులతో ఎప్పటికప్పుడు ల్యాబ్ టెక్నీషియన్ మమేకమై తగు సమాచారాన్ని ఇవ్వాలని సూచించారు. క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా వచ్చిన జ్వర అనుమానిత రక్తపూతలను ఎప్పటికప్పుడు పెండింగ్ లేకుండా పరీక్షించాలని, వెంటనే ఐహెచ్ఐపి యాప్లో పొందుపరచాలని ఆదేశించారు. సమావేశంలో మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.


