అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలంటూ ఆందోళన
బాపట్లటౌన్:చీరాల పట్టణంలో రూ.కోట్ల విలువైన ఐఎల్టీడీ సొసైటీ భూములను యథేచ్ఛగా అక్రమించుకొని అక్రమ రిజిస్ట్రేష న్లు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. జనవరి 13 నుంచి 23వ తేదీలోగా రూ.10 కోట్ల విలువైన 90 శెంట్ల భూమిని 22 మంది పేరుతో సొసైటీ పెద్దలు అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారు. విషయం తెలుసుకున్న ఐఎల్టీడీ సొసైటీ సభ్యులు అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. సొసైటీ సభ్యులు మాట్లాడుతూ 2021 ఫిబ్రవరిలో జరిగిన ఐఎల్టీడీ సొసైటీ ఎన్నికల ప్రచారంలో తక్కెళ్లపాటి చిన్న వెంకటేశ్వర్లు సొసైటీ భూమిని విక్రయించి వచ్చిన సొమ్ముతో బయట మూడు ఎకరాలు కొనుగోలు చేసి సొసైటీ సభ్యులందరికీ 2 సెంట్లు చొప్పున పంచుతానని నమ్మబలికి చైర్మన్గా ఎన్నికయ్యారన్నారు. దీంతోపాటు ఏడాదికి ఒకసారి జరిగే జనరల్ బాడీ మీటింగ్లో కూడా ప్రతి ఒక్కరికి రెండు సెంట్ల భూమిని తప్పనిసరిగా అందిస్తానంటూ చెప్పుకొచ్చిన వెంకటేశ్వర్లు జనవరి 13 నుంచి 23వ తేదీలోపు వారం రోజుల వ్యవధిలో చీరాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కొంతమందికి, ఇంకొల్లు రిజిస్ట్రార్ కార్యాలయంలో మరికొందరికి మొత్తం 22 మందికి 90 సెంట్ల భూమిని విక్రయించి రూ.10 కోట్లకు పైగా సొమ్ము చేసుకున్నారన్నారు. అధికారులు, పాలకుల అండతోనే సొసైటీ భూములు కబ్జాకు గురౌతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలాన్ని అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు. జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందించిన వారిలో సొసైటీ సభ్యులు కోటి సుధా, చింతా శ్రీనివాసరావు, నూనె చంద్ర, ఎం.శ్రీకాంత్, కె.అంటోని, ఎం.రవి, కె.ప్రసాద్, సుధీర్, సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.


