మద్యం తాగి వ్యక్తి మృతి
కొల్లూరు: మద్యం తాగి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కొల్లూరులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. బాపట్ల జిల్లా ఆవులవారిపాలేనికి చెందిన సనక రామకృష్ణ(40) కుటుంబం కొన్నేళ్ల క్రితం కొల్లూరు బోస్నగర్ సమీపంలోని అయ్యప్పస్వామి ఆలయం వద్ద స్థిర పడింది. ఇటుకరాయి లోడింగ్ వంటి కూలి పనులు చేస్తున్న రామకృష్ణకు మద్యపానం అలవాటుంది. ఆదివారం కొల్లూరు లాక్ సెంటర్ ప్రాంతంలో మద్యం తాగి వినాయకుడి ఆలయం పక్క వీధిలోని సిమెంట్ రోడ్డుపై మత్తులో పడుకున్నాడు. గమనించిన స్థానికులు పక్కనే ఉన్న అరుగుపై పడుకోపెట్టారు. సోమవారం ఉదయం అతడిని లేపాలని ప్రయత్నించగా పరిశీలించి మృతి చెందినట్లు గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో మృతుడి తల్లి, భార్య మృతదేహాన్ని ట్రాలీ ఆటోలో తమ గృహానికి తరలించారు. ఇటీవల ఇటుక బట్టీలలో పనిచేసేందుకు వచ్చిన అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన వలసకూలీ మద్యం తాగి అపస్మారక స్థితిలో వంతెన పై నుంచి పడి మృతి చెందడం, తాజాగా సనక రామకృష్ణ మృతితో మందుబాబులలో ఆందోళన నెలకొంది.


