
కదం తొక్కిన దివ్యాంగులు
ప్రభుత్వం తీరుమార్చుకోవాలి
పింఛన్ల తొలగింపుపై ఆగ్రహం
టవర్ ఎక్కి నిరసన తెలిపిన దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చల్లా రామయ్య
మద్దతుగా నిరసనకు దిగిన దివ్యాంగులు
ఆందోళనలో పాల్గొన్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున
నాలుగు గంటలకు పైగా కొనసాగిన ఆందోళన
బాధితులకు న్యాయం చేస్తామని ఆర్డీఓ హామీ
ఆందోళన విరమించిన దివ్యాంగులు
పలువురిపై కేసు నమోదు చేసిన పోలీసు
బాపట్ల: పింఛన్లు తొలగించటంతో ఆగ్రహించిన దివ్యాంగులు కదం తొక్కారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చి నిరసననలో పాల్గొన్నారు. రాష్ట్రప్రభుత్వం దివ్యాంగుల జోలికి వస్తే సహించేదిలేదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు. చల్లా రామయ్యకు మద్దతుగా మేరుగ నాగార్జునతోపాటు పార్టీ నాయకులు నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగుల పెన్షన్లు తొలగింపును నిరసిస్తూ వైఎస్సార్సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర సంచార జాతుల సంక్షేమ సంఘం నాయకుడు చల్లా రామయ్య గురువారం ఉదయం తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న సెల్ టవర్ ఎక్కారు. జిల్లాలో తొలగించిన 3824 దివ్యాంగుల పెన్షన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చేంతవరకు టవర్ దిగేది లేదని రామయ్య భీష్మించుకుని కూర్చున్నాడు. పింఛన్లు తొలగించిన కొందరు దివ్యాంగులు అక్కడకు చేరుకుని రామయ్యకు మద్దతు తెలిపారు. నూటికి నూరు శాతం కాళ్లు చచ్చుబడిపోయిన వికలాంగుడికి పెన్షన్ తొలగించడంపై ప్రజా సంఘాల నాయకుడు కే శరత్తోపాటు పలువురు వికలాంగులు అధికారులను నిలదీశారు. మండుటెండలో వికలాంగ బాలుడిని రోడ్డుపై పడుకోబెట్టి నిరసన తెలిపారు. పోలీసులు బాలుడిని బలవంతంగా అంబులెనన్స్లో ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్ను అడ్డుకునేందుకు యత్నించిన శరత్ను అరెస్టు చేసి వెదుళ్లపల్లి పోలీస్స్టేషన్కు తరలించారు. దీంతో ఆగ్రహించిన వికలాంగులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శరత్పై కేసు నమోదు చేసిన పోలీసులు వ్యక్తిగత పూచీకత్తుపై విడిచిపెట్టారు.
పోలీసులతో వాగ్వాదం
చల్లా రామయ్యకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వైఎస్సార్ సీపీ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సెల్ టవర్ వద్ద నుంచి వైఎస్సార్ సీపీ నాయకులను పోలీసులు తరిమికొట్టారు. ఎదురు తిరిగిన నలుగురిని బలవంతంగా పోలీస్స్టేషన్లకు తరలించారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున నిరసన జరుగుతున్న ప్రదేశానికి చేరుకున్నారు. సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేద్దాం దిగి రమ్మని రామయ్యను కోరారు. ఎట్టకేలకు రామయ్య సెల్ టవర్ దిగారు. సెల్ టవర్ దిగిన వెంటనే చల్లా రామయ్యను అంబులెనన్స్లో ఆసుపత్రికి తరలించేందుకు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఆ సమయంలో మేరుగ నాగార్జునకు బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగింది. ఎట్టకేలకు మేరుగ నాగార్జునతో కలిసి చల్లా రామయ్య ఆర్డీఓ గ్లోరియాకు వినతిపత్రం అందజేశారు. వికలాంగుల నాయకులతో చర్చలు జరిపిన వారిలో మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, తహసీల్దార్ సలీమా, వికలాంగుల సంక్షేమ శాఖ పీడీ ఉన్నారు. అనంతరం రామయ్యను ఆసుపత్రికి తరలించారు. చల్లా రామయ్యపై కేసు నమోదు చేసినట్లు సీఐ రాంబాబు తెలిపారు. అంతముందు శాంతిభద్రతను విఘాతం కలిగిస్తున్నారన్న కారణంతో పలువురు వైఎస్సార్సీపీ నాయకులను పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ ఆధ్వర్యంలో పట్టణ ఎస్సైలు విజయ్కుమార్, చంద్రావతి, పోలీసు సిబ్బంది అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. చల్లా రామయ్యకు సంఘీభావం తెలిపిన వారిలో వైఎస్సార్ సీపీ రాష్ట్రకార్యదర్శి చేజర్ల నారాయణరెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షులు కాగిత సుధీర్బాబు, మండల అధ్యక్షులు మరుప్రోలు ఏడుకొండలురెడ్డి, నాయకులు కోకి రాఘవరెడ్డి, కొక్కిలిగడ్డ చెంచయ్య, ఇనగలూరి మాల్యాద్రి, జోగి రాజా, తన్నీరు అంకమ్మరావు, శాయిల మురళి తదితరులు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని పక్కన బెట్టి దివ్యాంగులు, వృద్ధుల పెన్షన్లు తొలగింపులే ప్రధాన అజెండాగా ముందుకెళుతుందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున పేర్కొన్నారు. చేతులు, కాళ్లు సక్రమంగాలేని వారిపై ప్రభుత్వం ప్రతాపం చూపటం బాధాకరమన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అర్హలైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు ఇస్తే కూటమి ప్రభుత్వం వాటిని తొలగించేందుకే కంకణం కట్టుకుందన్నారు. దివ్యాంగులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందనే విషయాన్ని మరిచిపోవద్దన్నారు.

కదం తొక్కిన దివ్యాంగులు

కదం తొక్కిన దివ్యాంగులు