బాగ్దాద్‌ నుంచి భారత్‌కు వచ్చిన ఫకీరు, ఒక్క రూపాయికే అత్తరు

Do You Know The Place Is Called As Golconda In Andhra Pradesh - Sakshi

యడ్లపాడు(గుంటూరు): కొండవీడు అంటే రెడ్డిరాజుల సుదీర్ఘ పాలన గుర్తొస్తుంది. కాని శత్రుదుర్భద్యమైన ఈ రాజ్యాన్ని మరెందరో రాజులు, రారాజులు పరిపాలించారు. అందుకే ఇక్కడ గుట్టను తాకినా, ఏ కొండరాయిని కదిలించిన గత చరిత్ర వైభవాలను ఆనావాళ్లుగా చూపించి ఆకట్టుకుంటాయి. గుంటూరు జిల్లా కేంద్రానికి అత్యంత సమీపాన ఉన్న ఈ కొండవీడును పర్యాటక ప్రేమికులు ఆంధ్ర గోల్కొండగా పిలుచుకుంటారు. బాగ్దాద్‌ నుంచి భారతదేశానికి ఆధ్యాత్మిక పరిమళాలను పంచేందుకు వచ్చిన ఓ మహనీయుని చరిత్ర ఇది. 

కొండవీడులోని దాదాపీర్‌ దర్గా

దాదాపీర్‌ అసలు పేరు...
ఫిరంగిపురం నుంచి వస్తుండగా గ్రామ ప్రారంభంలో కొండవీడు కొండల పక్కనే కనిపించే దర్గా ఇది. ‘హజ్రత్‌ సయ్యద్‌ ఖుదాదే ఫకీర్‌షా ఔలియా’ అన్నది దర్గా అసలు పేరు. స్థానికులు వాడుకలో పిలుచుకునే పదం ‘దాదాపీర్‌’ దర్గా. సృష్టికర్త అల్లాహ్‌ గొప్పతనాన్ని, ఆయన్నూ ఆరాధించే విధానాన్ని చైతన్యం చేయాలని ఆధ్యాత్మిక గురువులకు గురువైన మహబూబ్‌ సుభాని సంకల్పించారట. దీంతో బాగ్దాద్‌కు చెందిన బీబీహాజీర దంపతులు సుమారు నాలుగు శతాబ్ధాల క్రితం భారతదేశానికి వచ్చారట. 
(చదవండి: పోణంగిలో అశ్లీల నృత్యాలు )

చివరి మజీలి కొండవీడు..
తొలుత ఉత్తరభారత్‌లో ప్రారంభమైన బాబావారి ఆధ్యాత్మిక బోధనలు.. క్రమేణ దక్షిణప్రాంతాలకు విస్తరించాయి. దాదాపీర్‌ వారి చివరి మజీలిగా కొండవీడును ఎంచుకున్నట్లు ఇక్కడి పెద్దలు చెబుతారు. అనంత కరుణామయుడు అల్లాహ్‌ ఆజ్ఞలను అందరికీ తెలపడం కోసమే దాదాపీర్‌ జీవితాన్ని గడిపారు. ఖురాన్‌లో సందేశాలను పాటిస్తూ అందరిని అదేమార్గంలో నడిపించడంతో ఆయన్నూ దైవదూతగా భావించారు.

కొండవీడులోని దాదాపీర్‌ దర్గా

అత్తరు విక్రయాలతో జీవనం..
కొండవీడు పరిపర ప్రాంతాల్లో లభించే పుష్పాలు, మూలికలతో వివిధ రకాల అత్తరు పరిమళాలను దాదాపీర్‌ దంపతులు తయారు చేసేవారు. దాదాపీర్‌ వద్ద నిత్యం అత్తరు సువాసనలు గుభాళిస్తాయట. తాము తయారు చేసిన పరిమళాలను సమీప గ్రామాల్లో విక్రయిస్తూ జీవనాన్ని కొనసాగించారట. కేవలం ఒక్కరూపాయికే అత్తరును ఇచ్చేవారట? ప్రకృతి అంటే బాబావారికి ఎంతో ప్రీతి. ఆయన చివరి మజీలిగా పచ్చగా పరిఢవిల్లే కొండవీడును ఎంచుకున్నరని ఇక్కడి ప్రజలు చెబుతుంటారు.

కొండవీడులోని దాదాపీర్‌ దర్గా

దాపరికంతో జరిగే అనర్థాలు..
పవిత్ర ఖురాన్, నమాజ్, దువా, బయాన్‌ తదితర అంశాల గురించి నిత్యం వివరించడంలోనే ఎక్కువ సమయాన్ని గడిపేవారట. రేపటికి (మరణం తర్వాత) మనిషికి అవసరమైంది పుణ్యమేగాని, సంపాదన కాదని చెప్పెవారట. దాచుకోవడం వల్ల దోచుకోవడం అలవరుతుందని, తద్వార స్వార్ధం, సోమరితనం ఏర్పడతాయని బోధించేవారు. మనిషి ఎక్కువగా సంపాదించుకోవాల్సింది దైవంపై విశ్వాసం మాత్రమే అంటూ వివరించేవారు. 

శతాబ్ధాల కిందటి మసీదులో నేటికీ నమాజులు...
ఈ ప్రాంతంలో ముస్లిం రాజుల కాలం నాటి అతి పురాతన రెండు మసీదులు ఉన్నాయి. శతాబ్ధాల క్రితం నిర్మించిన ఈ మసీదుల్లో ఒకటి కొండవీడు కొండలపై ఉండగా, రెండోది కొండ దిగువన కొండవీడు గ్రామంలో ఉంది. అయితే కొండపై ఉన్న మసీదును ముస్లింరాజు నిర్మించారు. అందులో గుప్తనిధుల కోసం దుండగుల మసీదును కొంతభాగం ధ్వంసం చేయగా, కొండకింద దర్గా ప్రాంగణంలో ఉన్న మసీదు నేటికీ చెక్కుచెదరలేదు. ఇప్పటికి దర్గాకు వచ్చిన వారంతా ఆ మసీదులోనే నమాజ్, ఖురాన్‌ పఠనం చేయడం విశేషం.
(చదవండి: ‘అమూల్‌’ ఒప్పందంతో మీకేంటి నష్టం?)

దర్గా ప్రాంగణంలో దాదాపీర్‌ నిర్మించిన చెక్కుచెదరని మసీదు

ముస్లిం రాజు నిర్మించిన దాదాపీర్‌ దర్గా
దాదాపీర్‌ నిర్మించిన ఆ మసీదును అంతా భారీ కొండబండరాళ్లతో నిర్మితమైంది. ఏనుగులు సైతం మోయలేని ఆ బండరాళ్లను సునాయాసంగా  తెచ్చి మసీదు నిర్మాణం చేస్తున్న దాదాపీర్‌ మహిమను కొండవీడును పాలించే అప్పటి రాజు పఠాన్‌మథాన్‌ఖాన్‌ కళ్లారా చూశాడట. ఎవరి సాయం లేకుండా స్వయంగా ఆయనే మసీదు నిర్మించడాన్ని చూసి ఆనందపరవశుడై నాటి నుంచి   ఆయన భక్తునిగా మారిపోయాడు.  

అంతేకాదు కొన్నాళ్లకు స్వర్గస్తులైన  ఆ దంపతుల సమాధులకు 4.5 ఎకరాల విస్తీర్ణంలో దర్గా నిర్మించారు. దర్గా ఉత్సవాలకు నిర్వహణకు మరో 91 ఎకరాల భూమిని వంశీయులకు ఈనాంగా ఇచ్చినట్లు చరిత్ర చెబుతుంది.  

బక్రీద్‌ పండుగ నాడు ఉరుసు ఉత్సవాలు..
ప్రతియేటా బక్రీద్‌ పండుగనాడు ఈ దర్గా ఉరుసు మహోత్సవ వేడుకలను వస్తాయి. నాలుగు శతాబ్ధాల కాలం నుంచి బాబావారి వంశీయులు, గ్రామ ముజావర్ల ఆధ్వర్యంలో ఈ వేడుకలను మూడు రోజులపాటు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు సుదూర ప్రాంతాలకు చెందిన వేలాది మంది భక్తులు ఇక్కడకు వచ్చి దాదాపీర్‌ దర్గాను సందర్శిస్తారు. ప్రస్తుతం దాదాపీర్‌ వంశీయులైన నౌషద్‌ నేతృత్వంలో ఉరుసు ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.
(చదవండి: కర్నూల్‌లో సింగర్‌ సునీత సందడి)

Read latest AP Special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top