పీలేరు : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రవేశానికి మిగిలి ఉన్న సీట్ల భర్తీకి నాలుగో విడత దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కన్వీనర్, పీలేరు ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ పెళ్లూరు నారాయణ పేర్కొన్నారు. శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 31వ తేదీ లోపు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ నెల 31న ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలకు సంబంధించి అభ్యర్థులకు కౌన్సెలింగ్ ఉంటుందని, ఉదయం 10 గంటలకు అభ్యర్థులు ఒరిజినల్ ఎస్ఎస్సీ మార్కుల మెమో, టీసీ, స్టడీ సర్టిఫికెట్లు, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలతోపాటు జిరాక్స్ ప్రతులు తీసుకురావాలని పేర్కొన్నారు.
జేఎన్వీలో
వాన్ఇన్ ఇంటర్వ్యూలు
మదనపల్లె సిటీ: మదనపల్లె సమీపంలోని వలసపల్లెవద్దనున్న జవహర్ నవోదయ విద్యాలయంలో(జేఎన్వీ) ఖాళీగా ఉన్న రెండు అధ్యాపక పోస్టులకు వాన్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు విద్యాలయ ప్రిన్సిపాల్ ఎం.గీత తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరానికి పీజీటీ–బయాలజీ, టీజీటీ ఆర్ట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 8న ఉదయం 11 గంటలకు విద్యాలయంలో జరిగే ఇంటర్యూలకు హాజరు కావాలన్నారు. అభ్యర్థులు ఒరిజనల్ ధృవీకరణపత్రాలతో పాటు జిరాక్స్ప్రతులు, రెండు పాస్పోర్టు సైజు ఫోటోలు తీసుకురావాలని తెలిపారు.
30న నీట్–పీజీ పరీక్ష
మదనపల్లె టౌన్: ఈ నెల 30న అన్నమయ్య జిల్లాలో నిర్వహించనున్న నీట్–పీజీ పరీక్షకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ తెలిపారు. మదనపల్లె లోని మిట్స్, ఆదిత్య, రాయచోటిలోని శ్రీ సాయి, భాస్కర్ ఇంజనీరింగ్ కళాశాల కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. అభ్యర్థులను ఉదయం 8.30 గంటల తర్వాత కేంద్రాల్లోకి అనుమతించరన్నారు. పరీక్షా కేంద్రం సమీపంలోని జిరాక్స్ సెంటర్లను తప్పని సరిగా మూసివేయాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధమన్నారు. పేపర్ లీక్ వదంతులు సష్టించినా, అక్రమాలకు పాల్పడినా కఠిన క్రిమినల్ చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
మదనపల్లె సిటీ: సర్–2026 ప్రక్రియ పూర్తయ్యే వరకు జిల్లాలో నియోజకవర్గ వారీగా హెల్ప్డెస్క్, కాల్ సెంటర్లు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాయచోటి 9949369891, తంబళ్లపల్లె 8106078313, పీలేరు 6302066403, మదనపల్లె 08571–231181, పుంగనూరు 6305512318 నంబర్లు కేటాయించినట్లు తెలిపారు. కలెక్టరేట్ సర్–26 కాల్ సెంటర్ నంబర్ 08571–293001 కేటాయించినట్లు తెలిపారు. హెల్ప్డెస్క్, కాల్సెంటర్ ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పని చేస్తుందని చెప్పారు.
భూ సమస్యల
పరిష్కారానికే రీ సర్వే
గాలివీడు : భూ సమస్యల పరిష్కారానికి సర్వే కార్యక్రమం జరుగుతోందని జిల్లా సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ శాంతారావు పేర్కొన్నారు. శనివారం ఆయన తలముడిపి గ్రామం మహంకాళి ఆలయ ప్రాంగణం నుంచి భూ రీ సర్వే ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని మిగులు భూములు, భూ సరిహద్దులు, రైతుల భూముల్లో హెచ్చుతగ్గులు తదితర అంశాలపై రైతులకు సర్వేలో న్యాయం జరుగుతుందన్నారు. అనంతరం కొర్లకుంట సరిహద్దులోని ఫారెస్ట్ రెవెన్యూ శాఖల మధ్య ఉన్న వివాదాస్పద భూములను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్వే డిప్యూటీ ఇన్స్పెక్టర్ సోమశేఖర్, మండల సర్వేయర్ సుబ్రహ్మణ్యం, విలేజ్ సర్వేయర్ వినోద్ కుమార్, వీఆర్ఓ వెంకటయ్య, సింగిల్ విండో అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, రైతులు రెడ్డప్పరెడ్డి, మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గడువు పొడిగింపు
కడప ఎడ్యుకేషన్: వైవీయూ పీజీ డిప్లమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ (పీజీడీటీఏ), కూచిపూడి నత్యం ,కర్ణాటక సంగీతం ,కీబోర్డ్ సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును సెప్టెంబర్ నెల 11వ తేదీ వరకు పొడిగించారు. ఈ విషయాన్ని విశ్వవిద్యాలయ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ సంచాలకులు ఆచార్య వి రామకృష్ణ తెలిపారు. మరిన్ని వివరాలకు 90325 95101 నంబర్లో సంప్రదించాలని సూచించారు.


