సాక్షి, మదనపల్లె : కార్యకర్తలను పట్టించుకోకుండా, ప్రజ లు కోరుతున్న పింఛన్లు, హౌసింగ్ బిల్లులు ఇవ్వకుండా టీడీపీకి ఓట్లు పడతాయి అనుకోవడం తప్పవుతుందని టీడీపీ రాజంపేట పార్లమెంటు మాజీ అధికార ప్రతినిధి ఆర్జే. వెంకటేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో ఆయన మదనపల్లెలో టీడీపీ పరిస్థితిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్యే కోటరీకి చెందిన వారికే నామినేటెడ్ పోస్టులు వస్తున్నాయని, కష్టపడి పనిచేసిన వాళ్లకు ఇవ్వడంలేదని అన్నారు. అధికారం లేనప్పుడు కష్టపడి పని చేసిన కార్యకర్తలకు గౌరవం ఇవ్వడం లేదని నిలదీశారు. జిల్లా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మదనపల్లె నియోజకవర్గంలో అభివద్ధి పనుల శిలాఫలకం ఒక్కటి కూడా వేయలేదని మండిపడ్డారు. కార్యకర్తలకు అందుబాటులో ఉండడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం అర్హులైన వారికి పెన్షన్లు ఇవ్వలేదని, 2014–19 మధ్యలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన పేదలకు ఇంతవరకు బిల్లులు ఇవ్వలేదని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహిస్తుంటే ప్రజల నుంచి స్పందన లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.


