పుంగనూరు : ప్రభుత్వం విద్యాహక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం విద్యార్థులు కదం తొక్కారు. ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తొలుత జ్యోతిరావుపూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీ ఇందిరా సర్కిల్ నుంచి ఎంబీటీ రోడ్డు, బస్టాండ్, గోకుల్ సర్కిల్ మీదుగా సాగింది. ఈ సందర్భంగా సంఘ జాతీయ అధ్యక్షుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. దేశభవిష్యత్తు విద్యార్థుల చేతుల్లో ఉందని, ప్రతి చిన్నారి నాణ్యమైన విద్య పొందడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని తెలిపారు. ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల్లో విద్యార్థులకు కల్పించాల్సిన హక్కులను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు భార్గవ్సాయి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రతినిధులు కోటేశ్వరరావు, వెంకట్రమణారెడ్డి, రామమూర్తి, మున్న, ఓబీసీ విద్యార్థి సంఘ జిల్లా అధ్యక్షుడు వెంకటయాదవ్, సురేష్, పవన్, మునిసాయి తదితర నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


