సాక్షి, మదనపల్లె: పేదలకు వైద్య సహకారం అందించడంలో, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం మంజూరు చేయించడంలో మానవత్వంతో వ్యవహరించే రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డి ఇద్దరు చిన్నారుల వైద్యం కోసం ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున 6 లక్షల రూపాయలు మంజూరు చేయించారు. తంబళ్లపల్లె మండలం గోపిదిన్నెకు చెందిన వెంకటేశ్వర కుమారుడు శ్రీదర్శన్ తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. అలాగే పుంగనూరు పట్టణంలోని రహమత్నగర్కు చెందిన ఎస్.బావాజాన్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వీరి కుటుంబ పరిస్థితులను స్థానిక నేతల ద్వారా తెలుసుకున్న ఎంపీ మిథున్ రెడ్డి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి ద్వారా నిధుల మంజూరు కోసం ప్రధానమంత్రి కార్యాలయానికి నివేదించారు. అక్కడినుంచి వైద్యానికి అయ్యే ఖర్చు ఒక్కొక్కరికి రూ.3 లక్షలు మంజూరు చేయిస్తూ ఉత్తర్వులు జారీ చేయించారు. ఆస్పత్రి వైద్య ఖర్చుల కోసం ఇబ్బంది పడుతున్న పేద కుటుంబానికి ఈ నిధుల మంజూరు ఊరట కలిగించింది. తమకు ఆర్థిక సహాయం మంజూరు చేయించిన మిథున్ రెడ్డికి చిన్నారుల కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
కరాటే పోటీలకు ఎంపిక
పుంగనూరు: జపాన్ దేశంలో సెఫ్టెంబర్లో జరిగే అంతర్జాతీయ కరాటే పోటీలకు పుంగనూరు నుంచి క్రీడాకారులు ఎంపికయ్యారని కరాటే మాస్టర్ మహేష్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 25, 26 తేదీల్లో మైసూర్లో జరిగిన ఆల్ఇండియా షిటోర్యూ కరాటే చాంపియన్ పోటీల్లో పట్టణానికి చెందిన తాన్వేశ్వర్కుమార్రెడ్డి, శశాంత్, త్రివిక్రమ్, జుహాఫాతిమా, ఎం.రెడ్డిమహేష్ ప్రతిభ చూపి అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు.


