● ప్రతి సోమవారం అదే గోడు.. పరిష్కారం కాక వేదన
● భూ సమస్యల పరిష్కారంలో
అలసత్వం
● సుదీర్ఘ కాలంగా
కొత్త ఫించన్లు పెండింగ్
● ప్రజల్లో సడులుతున్న నమ్మకం
మదనపల్లి (కురబలకోట) : మదనపల్లి కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సోమవారం వివిధ సమస్యలతో వచ్చిన అర్జీదారులతో కిక్కిరిసింది. అదేతీరు..అదే వరుస అన్నట్లుగా ప్రహసనంగా సాగింది. భూ సమస్యల పరిష్కారంలో తీవ్ర అలక్ష్యం ప్రదర్శించడం, కొత్త ఫించన్లు రాకపోవడం, వివిధ సమస్యలు సకాలంలో పరిష్కారం కాకపోవడంతో వచ్చిన అర్జీలే మళ్లీ ఇవ్వాల్సి రావడంతో అర్జీదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పీజీఆర్ఎస్ అంటే క్రమంగా ప్రజల్లో నమ్మకం సడలుతోందా అనే సందేహం కలుగుతోంది. జిల్లా నలుమూలల నుంచి వ్యయ ప్రయాసలకు ఓర్చి అర్జీదారులు తమ సమస్యలపై ఏకరువు పెడుతున్నా ఆశించిన స్థాయిలో సమస్యలు పరిష్కారం కావడం లేదనే నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువగా రెవెన్యూ, భూ వివాదాలు, ఫించన్లు, ఇతర సామాజిక సమస్యలపై అర్జీలు నమోదయ్యాయి. ఒక్కొక్కరు ఐదారు సార్లు అర్జీ ఇచ్చినా పరిష్కారం కాలేదని వాపోతున్నారు. అయినా ఏదో ఒక రోజు సమస్య తీరుతుందన్న చిన్న ఆశతో మళ్లీ మళ్లీ అర్జీలు ఇస్తున్నట్లు చెబుతున్నారు. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి ఇతర ఉన్నతరాధికారులు ప్రజల నుంచి వివిధ సమస్యలపై 310 అర్జీలను స్వీకరించారు. క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
20 ఏళ్లుగా సేవలు అందిస్తున్నా
కనికరం లేదు
20 ఏళ్లుగా కాంట్రాక్టు ఉద్యోగులుగా ఉద్యోగ భద్రత కల్పించడం లేదు. వివిధ కేటగిరిలలో ఆరోగ్యశాఖలో సేవలు అందిస్తున్న తమను రెగ్యులర్ చేయాలని నూరు శాతం గ్రాస్ వేతనం చెల్లించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని పీజీఆర్ఎస్లో వారు అర్జీ ఇచ్చారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరారు
అంకాలమ్మ చెరువును కాపాడాలి
హైవేకి ఆనుకుని ఉన్న కలకడ గ్రామ అంకాలమ్మ చెరువును కబ్జా చేస్తున్నారని వారి నుంచి సంరక్షించాలని ఆయకట్టుదారులు పీజీఆర్ఎస్లో నిరసన తెలిపారు. ఇదివరలో అర్జీ ఇవ్వగా సదరు స్థలంలో రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసినా మళ్లీ కబ్బాదారు పది రోజులుగా చెరువులోకి ప్రవేశించి మట్టి తోలి చదును చేస్తున్నారన్నారు. దీనిని అడ్డుకోవాలని కోరారు. వెంటనే చెరువు దురాక్రమణను అడ్డుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
దివ్యాంగుడి భూమి ఆక్రమణ
కలకడ మండలం ముడివారిపల్లిలో 40 ఏళ్లుగా సాగుచేసుకుంటూ వారసత్వంగా సోదరులతో పాటు దివ్వాంగుడుకి వచ్చిన ఎకరా 91 సెంట్లు డికేటీ భూమిని అదే ఊరికి చెందిన ఒకరు ఇటీవల ఆక్రమించుకుని కంచె వేశారని భూమిలోకి రానియ్యకుండా దౌర్జన్యం చేస్తున్నారని పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. రెవెన్యూ అధికారులు కూడా ఈ భూమి తమదేనని చెప్పినా దురాక్రమణదారు భూమిని వదలడం లేదని తగు చర్యలు తీసుకోవాలని కోరారు. విచారించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు.


