
నలుగురిపై చీటింగ్ కేసు నమోదు
కలికిరి(వాల్మీకిపురం) : మరణించిన వ్యక్తి వేలిముద్రలు ఫోర్జరీ చేసి శ్రీ శ్రీనివాసా చారిటబుల్ ట్రస్టుకు చెందిన భూమిని నలుగురు వ్యక్తులు ట్రస్టు భూమిని తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ట్రస్టు ట్రెజరర్ రమేష్బాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం మేరకు.. వాల్మీకిపురం పట్టణానికి చెందిన కె.శివప్రకాష్ తనకు చెందిన వాల్మీకిపురం రెవెన్యూ గ్రామం సర్వే నెం.335లో 1.411/2 ఎకరాల భూమిని 2020 సంవత్సరం నవంబర్ 16వ తేదీన వాల్మీకిపురం సబ్ రిజిస్ట్రారు కార్యాలయంలో దాన దస్తావేజు నెం.2395/2020 మేరకు శ్రీ శ్రీనివాసా ట్రస్టుకు రిజిస్ట్రేషన్ చేయించారు. తరువాత శివప్రకాష్ మరణించారు. దీంతో మృతుని సోదరి తులసమ్మ, ఆమె భర్త వెంకటస్వామి, పవన్, మదనపల్లికి చెందిన డాక్యుమెంట్ రైటర్ రాజేంద్ర మృతుని వేలిముద్రలు ఫోర్జరీ చేసి మదనపల్లి సబ్ రిజిస్ట్రారు కార్యాలయంలో తప్పుడు రిజిస్ట్రేషన్ చేశారని బాధితుడు ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. ఈ మేరకు నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
ఎలుగుబంటి దాడి
పోరుమామిళ్ల : మండలంలోని ఎరసాలకు చెందిన బాయకట్టు నాగరాజు ఆదివారం ఎలుగుబంటి దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. ఊరికి సమీపంలోని కొండలో గొర్రెలు మేపేందుకు వెళ్లాడు. కొండపొలంలో గొర్రెలు మేస్తుండగా పిల్లలున్న ఎలుగుబంటి నాగరాజుపై దాడి చేసింది. హఠాత్తుగా వచ్చిన ఎలుగుబంటిని చూసిన నాగరాజు పెద్దగా కేకలు వేస్తూ తనను కాపాడుకునేందుకు ప్రయత్నించాడు. ఇంతలో దగ్గరలో ఉన్న గొర్రెల కాపరులు కేకలు వేస్తూ అక్కడకు చేరుకోవడంతో ఎలుగుబంటి పిల్లలతో పారిపోయింది. ముఖానికి, చేతులకు బాగా గాయాలవడంతో నాగరాజును పోరుమామిళ్లలో ప్రథమ చికిత్స అనంతరం కడపకు తరలించారు.
కూలిన మట్టి మిద్దె
బద్వేలు అర్బన్ : మండల పరిధిలోని తిరువెంగళాపురం పంచాయతీలోని తిరువెంగళాపురం ఎస్సీ కాలనీలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఓ మట్టి మిద్దె కూలిపోయింది. తిరువెంగళాపురం ఎస్సీ కాలనీకి చెందిన నాగిపోగు బాలకృష్ణ కొన్నేళ్లుగా తన కుటుంబ సభ్యులతో కలిసి ఓ మట్టి మిద్దెలో నివసిస్తున్నాడు. అయితే శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇంటిలోని ఓ గది పైకప్పు అకస్మాత్తుగా కూలిపోయింది. ఆ సమయంలో బాలకృష్ణతో పాటు కుటుంబ సభ్యులు వేరే గదిలో నిద్రిస్తుండటంతో పెనుప్రమాదం తప్పింది. ఘట నా స్థలాన్ని రెవెన్యూ అధికారులు పరిశీలించారు.
చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడి అరెస్టు
పోరుమామిళ్ల : కలసపాడు మండలం గంగాయపల్లెలో ఈనెల 7న నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ముట్టే నరేంద్ర( 20) అలియాస్ జగన్ను ఆదివారం మార్కాపురం వద్ద అదుపులోకి తీసుకున్నట్లు మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ నరేంద్ర జులాయిగా తిరిగేవాడన్నారు. మద్యానికి బానిసయ్యాడని, తల్లిదండ్రులను కూ డా ఇబ్బంది పెట్టేవాడన్నారు. సెల్ఫోన్లో అసభ్య వీడియోల ప్రభావంతో పథకం ప్రకారం చిన్నారిని పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడన్నారు. నిందితుడిని సోమవారం కోర్టులో హాజరు పెడతామన్నారు. సమావేశంలో కలసపాడు, పోరుమా మిళ్ల ఎస్ఐలు తిమోతి, కొండారెడ్డి పాల్గొన్నారు.
పెన్నానదిలో చిక్కుకున్న వృద్ధ దంపతులు
ప్రొద్దుటూరు క్రైం : పెన్నానదిలో చిక్కుకున్న ఇరువురు వృద్ధులను పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. రేగుళ్లపల్లె గ్రామానికి చెందిన గండి చిన్న సుబ్బరాయుడు, ఆయన భార్య నారాయణమ్మలు ఆదివారం పెన్నానదిలోకి వెళ్లా రు. అయితే పెన్నా నదికి మైలవరం నీరు వదలడంతో నీటి ప్రవాహం ఒక్క సారిగా పెరిగింది. దీంతో వృద్ధ దంపతులు నీళ్లలో చిక్కుకున్నారు. వారిని స్థా నికులు గుర్తించి డయల్ 100కు ఫోన్ చేశారు. రూ రల్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన పెన్నానదికి చేరుకున్నారు.

నలుగురిపై చీటింగ్ కేసు నమోదు