అర్జీలకు సత్వరమే పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

అర్జీలకు సత్వరమే పరిష్కారం

May 4 2025 6:46 AM | Updated on May 4 2025 6:46 AM

అర్జీ

అర్జీలకు సత్వరమే పరిష్కారం

రామాపురం: ప్రజాసమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర, రవాణా, యువజన క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ వసతి గృహంలో మంత్రి ప్రజా దర్బార్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భం ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వీటిని పరిశీలించి, పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు.

నేడు విజయవాడ నుంచి కడపకు ప్రత్యేక బస్సు

కడప కోటిరెడ్డిసర్కిల్‌: నీట్‌ పరీక్షలు రాస్తున్న విద్యార్థుల సౌకర్యార్థం ఆదివారం రాత్రి 9.45 గంటలకు విజయవాడ నుంచి కడపకు ప్రత్యేక సూపర్‌ లగ్జరీ సర్వీసును నడపుతున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ బస్సు ఒంగోలు, కావలి, బద్వేలు మీదుగా కడపకు చేరుతుందన్నారు. ప్రయాణీకులు, విద్యార్థులు ఈ ప్రత్యేక సర్వీ సును సద్వినియోగం చేసుకోవాలన్నారు.

నియామకాలు

కడప కోటిరెడ్డిసర్కిల్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీలో అన్నమయ్య జిల్లా వాసులకు చోటు కల్పించారు. ఈ మేరకు శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. రాజంపేటకు చెందిన కొట్టిక రాజమోహన్‌ను రాష్ట్ర బీసీ సెల్‌ జనరల్‌ సెక్రటరీగా, షేక్‌ మహమ్మద్‌ జాహిద్‌ అలీని రాష్ట్ర మైనార్టీ సెల్‌ సెక్రటరీగా, జింకా ఓబయ్యను రాష్ట్ర వాణిజ్య విభాగం సెక్రటరీగా, మదనపల్లెకు చెందిన ఎం.భారతి జయకుమారిని రాష్ట్ర అంగన్వాడీ విభాగం సెక్రటరీగా, రాజంపేటకు చెందిన మడితాటి సురేంద్రారెడ్డిని రాష్ట్ర ఉద్యోగ, పెన్షనర్ల విభాగం సెక్రటరీగా, మదనపల్లెకు చెందిన ఎన్‌.జగన్నాథరెడ్డిని రాష్ట్ర ఉద్యోగ, పెన్షనర్ల విభాగం జాయింట్‌ సెక్రటరీగా నియమించారు.

గాలులతో విద్యుత్‌శాఖకు రూ. 30లక్షల నష్టం

సిద్దవటం: మండలంలో గురువారం సాయంత్రం అకాల వర్షం, గాలులకు విద్యుత్‌ శాఖకు దాదాపు రూ. 30 లక్షల మేర నష్టం వాటిల్లిందని ఏపీఎస్పీడీసీఎల్‌ కడప ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ హరిసేవ్యానాయక్‌ తెలిపారు. సిద్దవటం మండలం బొగ్గిడివారిపల్లెలో శనివారం ఆయన విద్యుత్‌ మరమ్మతు పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యం వల్ల పెద్ద వృక్షాలు విద్యుత్‌ లైన్లపై పడటంతో 100 విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయన్నారు. 10 ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయన్నారు. 4 కిలోమీటర్ల మేర విద్యుత్‌లైన్‌ దెబ్బతిందన్నారు. ఈమేరకు దాదాపు రూ. 30 లక్షలు మేర విద్యుత్‌ శాఖకు నష్టం వాటిల్లిందన్నారు. గృహ వినియోగ దారులకు, వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరా చేసేందుకు సిబ్బంది శ్రమిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఒంటిమిట్ట డీఈ సుబ్రమణ్యం, సిద్దవటం, ఒంటిమిట్ట ఏఈలు జయచంద్ర, ఉదయ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

లక్ష్యసాధనకు కష్టపడాలి

కురబలకోట: చదువు సంధ్యలనేవి జీవితాన్ని ఉన్నతంగా మలుచుకునేందుకు మహత్తరమైన అవకాశమని బెంగళూరు జర్సీ ల్యాబ్స్‌చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ శ్రీకాంత్‌ కె అరిమానిత్య అన్నారు.విద్యార్థులు లక్ష్యసాధనకు కష్టపడాలని సూఐచించారు. అంగళ్లులోని మిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాల 27వ వార్షికోత్సవ వేడుకలు శనివారం రాత్రి నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలు విద్యార్థుల కేరీర్‌ను మలుపు తిప్పుతాయన్నారు. డిజిటల్‌ పరివర్తన, ఏఐ, ఆటోమేషన్‌ తదితర టెక్నాలజీల గురించి అవగాహన పెంచుకోవాలన్నారు. విద్యార్థుల ఆలోచనలే వారి భవిష్యత్తును నిర్దేశిస్తాయన్నారు. పోటీ ప్రపంచంలో రాణించాలంటే క్రమ శిక్షణ, కష్టపడే తత్వం కలిగి ఉండాలన్నారు. కళాశాల కరస్పాండెంట్‌ డాక్టర్‌ ఎన్‌. విజయభాస్కర్‌ చౌదరి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు టెక్నాలజీనే ఆధారంగా నిలుస్తోందన్నారు. నేడు నేర్చుకునే ప్రతి పాఠం రేపటి భవిష్యత్తుకు పునాదిగా మారుతుందన్నారు. ఇన్నోవేటివ్‌గా ఆలోచిస్తే పైకి ఎదగవచ్చన్నారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ట్రిపుల్‌ ఆర్‌ ప్రెసిడెంట్‌ నాదెళ్ల ద్వారకనాఽథ్‌, ప్రిన్సిపాల్‌ యువరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

అర్జీలకు సత్వరమే పరిష్కారం 1
1/1

అర్జీలకు సత్వరమే పరిష్కారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement