
పల్లె వైద్యానికి తాళం
రాయచోటి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని వర్గాల సమస్యలను పరిష్కరిస్తామని, అభివృద్ధిని పరుగులు తీయిస్తామని చెప్పిన కూటమి నాయకుల మూటలు నేడు నీటి మూటలుగా మిగిలాయి. ప్రజల చెంతకు పాలనను సచివాలయం రూపంలో తెచ్చిన వ్యవస్థను నీరుగార్చే ప్రయత్నం చేశారు. ఇంకోవైపు అంగన్ వాడీ వర్కర్ల సమస్యలను గాలికి వదిలారు. ప్రస్తుతం గ్రామాల్లో నిర్మించిన హెల్త్ క్లినిక్లలో సేవలందిస్తున్న కమ్యూనిటీ హెల్త్ అధికారులు, సిబ్బంది సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైంది. వారి సమస్య పట్ల ఏమాత్రం శ్రద్ధ చూపకపోవడంతో సమ్మె చేపట్టారు. ఫలితంగా పల్లె ప్రజకు ప్రాథమిక వైద్యం అందకుండా పోయింది. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం చొరవచూపాలని నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం, ఉన్నతాధికారుల వైపు నుంచి ఎలాంటి ఊరట లభించకపోవడంతో నాలుగురోజుల నుంచి కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ఈపీఎఫ్ను పునరుద్ధరించాలని, ఇన్సెంటివ్ ఇవ్వాలని, వేతనాలు పెంచాలని కోరుతూ ఎంఎల్హెచ్పీలు ఏప్రిల్ 17వ తేదీ నుంచి ఆందోళన చేపట్టారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన హెల్త్ క్లినిక్ల తలుపులు మూతపడ్డాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మారుమూల ప్రాంతాలకు సైతం ప్రభుత్వం తరపు నుంచి మెరుగైన వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో హెల్త్ క్లినిక్లను నిర్మించారు. ప్రతి కేంద్రంలో రోజు 20 నుంచి 30 మంది ప్రాథమిక వైద్యాన్ని అందుకుంటున్నారు. గ్రామాల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు వ్యాధి నిరోధక టీకాలు, జ్వరం బారిన పడిన బాధితులు ఈ కేంద్రాల్లో చికిత్సలు అందుకుంటున్నారు. పల్లెల్లో వైద్య సేవలు ఆగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు నిరసనను కొనసాగిస్తామని ఎంపీ ఎంసీఏ జిల్లా నాయకులు శివకుమార్ తెలిపారు.
● సిబ్బంది సమ్మెలోకి వెళ్లడంతో 375 కేంద్రాలు మూతపడ్డాయి. వివిధ చికిత్సల నిమిత్తం ఇక్కడికి వచ్చే వారికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యామ్నాయాలు చేపట్టకపోవడంతో పల్లె ప్రజలకు వైద్య సేవలు దూరమయ్యాయి.
375 కేంద్రాలు, 14 రకాల సేవలు:
పల్లె ప్రజలకు వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చే క్రమంలో గతంలో కొన్ని గ్రామాలను కలుపుతూ ఉప కేంద్రాలను ఏర్పాటు చేశారు ఐదేళ్ల కిందట వైఎస్సార్సీపీ ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో జిల్లాలో 375 విలేజ్ హెల్త్ క్లినిక్లను నిర్మించింది. ఒక్కో కేంద్రంలో బీఎస్సీ నర్సింగ్ చదివిన వారిని మల్టీ లెవల్ హెల్త్ ప్రొవైడర్స్గా నియమించింది. వీరి సమక్షంలో ఒక్కో కేంద్రంలో 14 రకాల వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఏఎన్ఎం, ఆశా వర్కర్లు వీరికి సహాయం అందిస్తుంటారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో విఫలం
ఎంఎల్హెచ్పీల ధర్నా నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా సచివాలయ, ఏఎన్ఎంలు వారి స్థానంలో పనిచేయాలని జిల్లా వైద్య శాఖ ఆదేశించింది. అయితే ఇంతవరకు ఆదేశాలు విడుదల కాలేదు. దీంతో సచివాలయ ఏఎన్ఎంలు, విలేజ్ హెల్త్ క్లినిక్లతో సంబంధం లేన ట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లా అధికారులు కూడా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికై నా జిల్లా మంత్రి, కలెక్టర్ చొరవ చూపి ప్రత్యామ్నాయ ఏర్పాట్ల దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.
ఎంఎల్హెచ్పీల ఆందోళన
మూతపడిన హెల్త్ క్లినిక్లు