
వై.కోటలోని బంజరు భూములను పేదలకు పంచి పెట్టాలి
రాయచోటి అర్బన్ : ఓబులవారిపల్లె మండలం బాల్రెడ్డిగారిపల్లె పంచాయతీ వై.కోట గ్రామ పొలం సర్వే నంబరు 1150 లో గ్రామపెత్తందార్లు, కబ్జాదారుల ఆక్రమణలో ఉన్న సుమారు 150 ఎకరాల బంజరు భూములను ప్రభుత్వం వెంటనే పేదలకు పంచిపెట్టాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం (బీకేఎంయూ) జిల్లా అధ్యక్షుడు పండుగోల మణి, రైల్వేకోడూరు కార్యదర్శి జ్యోతిచిన్నయ్యలు జిల్లా కలెక్టర్ శ్రీధర్కు విన్నవించారు. రాయచోటి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వారు కలెక్టర్తో మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు అక్రమంగా ఇతరులకు కట్టబెట్టిన ప్రభుత్వ, బంజరు భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలన్నారు. వాటిని నిరుపేద గిరిజన కుటుంబాలకు రెండేసి ఎకరాల చొప్పున పంపిణీ చేయాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ ఓబులవారిపల్లె మండల కార్యదర్శి చంతలపూడి నాగమ్మ, బీకేఎంయూ నాయకులు జయరామయ్య, మల్లిక వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
మహిళ ఆత్మహత్య
ఒంటిమిట్ట: మండల పరిధిలోని పోలు బుచ్చయ్యగారిపల్లి గ్రామానికి చెందిన నల్లగొండ నరసింహారెడ్డి భార్య నల్లగొండ కృష్ణమ్మ (55) సోమవారం విష ద్రావణం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఒంటిమిట్ట ఎస్ఐ శివప్రసాద్ తెలిపారు. ఆయన కథనం మేరకు నల్లగొండ నరసింహారెడ్డి, కృష్ణమ్మలకు ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరందరికీ వివాహం కాగా కుమారులు బతుకుదెరువు నిమిత్తం కువైట్లో ఉన్నారు. వారి కోడళ్లు పిల్లల చదువుల నిమిత్తం కడపలో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం నరసింహారెడ్డి, కృష్ణమ్మలు పోలుబుచ్చయ్యగారిపల్లిలో వారి సొంత ఇంటిలో నివాసం ఉంటున్నారు. నరసింహారెడ్డి తనకున్న భూములను సాగు చేసుకునేవాడు. ఇది ఇలా ఉండగా ఐదేళ్ల క్రితం నుంచి కృష్ణమ్మకు కుడివైపున తుంటి వద్ద కీళ్లు అరిగి తీవ్రమైన నడుము నొప్పి ఉంది. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా నొప్పి తగ్గకపోవడంతో ఆమె తరచూ ఆత్మహత్య చేసుకుంటానని చెప్పేది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఎప్పటిలాగే పొలం పనికి వెళ్లిన నరసింహారెడ్డికి తన అన్న కోడలు నల్లగొండు దేవి ఫోన్ చేసి కృష్ణమ్మ విష ద్రావణం తాగిందని తెలిపారు. వెంటనే ఆయన ఇంటికి వచ్చి ఆమెను 108 వాహనంలో కడప రిమ్స్కు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం కడపలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని అక్కడి డాక్టర్లు చెప్పడంతో మళ్లీ కడప రిమ్స్కు తీసుకురాగా అక్కడి వైద్యులు పరీక్షించి ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలి భర్త నల్లగొండ నరసింహారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్ఐ శివప్రసాద్ తెలిపారు.

వై.కోటలోని బంజరు భూములను పేదలకు పంచి పెట్టాలి