‘చలో పోతిరెడ్డిపాడు’ గ్రాండ్‌ సక్సెస్‌ | YSRCP Chalo Pothireddypadu grand success | Sakshi
Sakshi News home page

‘చలో పోతిరెడ్డిపాడు’ గ్రాండ్‌ సక్సెస్‌

Feb 6 2026 5:18 AM | Updated on Feb 6 2026 5:18 AM

YSRCP Chalo Pothireddypadu grand success

చలో పోతిరెడ్డిపాడు సభకు భారీగా తరలి వచ్చిన రైతులు

పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన నెల్లూరు, ప్రకాశం, సీమ జిల్లాల నేతలు, కార్యకర్తలు, రైతులు

సభ నిర్వహణకు అడ్డంకులు సృష్టించిన చంద్రబాబు ప్రభుత్వం

చివరి క్షణం వరకు అనుమతులు ఇవ్వకుండా అడ్డుపడిన వైనం

హైకోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చిన వైఎస్సార్‌సీపీ 

భారీగా తరలివచ్చిన అన్నదాతలు

ప్రాజెక్టు ఆవశ్యకతను గుర్తించిన ‘గ్రేటర్‌ రాయలసీమ’ నేతలు, ప్రజలు

సాక్షి ప్రతినిధి కర్నూలు: చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ వైఎస్సార్‌సీపీ చేపట్టిన ‘చలో పోతిరెడ్డిపాడు’ కార్యక్రమం గ్రాండ్‌ సక్సెస్‌ అయ్యింది. గురువారం ఉదయం సభ.. బుధవారం మధ్యాహ్నం వరకు పోలీసులు అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వ పెద్దలు అడ్డుపడ్డారు.. అనుమతి నిరాకరించి సభ జరగకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వ కుట్ర పసిగట్టిన వైఎస్సార్‌సీపీ హైకోర్టును ఆశ్రయించింది. పార్టీ నేత కాటసాని రాంభూపాల్‌రెడ్డితో పిటిషన్‌ వేయించింది. దీంతో సభకు కొన్ని గంటల ముందు అనుమతి లభించింది. ఈ క్రమంలో గోపాల్‌రెడ్డి పొలంలో సభ నిర్వహించుకునేందుదు ఆత్మకూరు డీఎస్పీ అనుమతిచ్చారు. దీంతో బుధవారం మధ్యాహ్నం తర్వాత నేతలు అక్కడికి చేరుకున్నారు.

కాటసాని రాంభూపాల్‌రెడ్డి, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ధారా సుధీర్‌ తదితరులు రాత్రంతా పనులు చేయించి తెల్లవారే సరికి వేదికను సిద్ధం చేశారు. నేతలంతా చేయి చేయి కలిపి సభను గ్రాండ్‌ సక్సెస్‌ చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్‌ను పూర్తి చేయిస్తామని శపథం చేశారు. అయినా చంద్రబాబు చలించకపోతే జగన్‌ అధికారంలోకి రాగానే తక్కిన పనులు పూర్తి చేస్తామని ప్రతినబూనారు. సభకు వచ్చిన వారే కాదు ‘గ్రేటర్‌ రాయలసీమ’ పరిధిలోని ప్రతి ఇంట్లో సభను లైవ్‌లో వీక్షించారు. గురువారం గ్రేటర్‌ రాయలసీమ పరిధిలో ఏ పల్లెలో, ఎక్కడ నలుగురు గుమికూడినా రాయలసీమ లిఫ్ట్‌పైనే చర్చ జరిగింది.

ఇంత తక్కువ వ్యవధిలో ‘సీమ’ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం నేతలు, కార్యకర్తలు, రైతులు సభకు వేలాదిగా తరలి రావడం గమనార్హం. ఉమ్మడి కర్నూలు, అనంతపురం, వైఎస్సార్‌ కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల అధ్యక్షులు, సమన్వయకర్తలు తరలివచ్చారు. పార్టీ రాష్ట్ర కో–ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. సీమకు చంద్రబాబు చేసిన ద్రోహాన్ని నేతలు వివరిస్తున్నప్పుడు రైతుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. 

స్వచ్ఛందంగా తరలి వచ్చిన రైతులు
‘చలో పోతిరెడ్డిపాడు’ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైఎస్సార్‌సీపీ నేతలతో పాటు రైతులు సైతం సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చారు. జనాలను తరలించేందుకు ఎవరూ కూడా ఒక బస్సు, లారీ ఏర్పాటు చేయలేదు. నందికొట్కూరు, పాణ్యం, ఆత్మకూరుతో పాటు నంద్యాల జిల్లాలోని నియోజకవర్గాలు, కడప, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి ఎవరికి వారు సొంత ఖర్చులతో తరలి రావడం విశేషం. గురువారం ఉదయం 10 గంటలకే రైతులు చేరుకున్నారు. నేషనల్‌ హైవే నుంచి పోతిరెడ్డిపాడు వరకు ట్రాఫిక్‌ జాం అయితే రైతులు పొలాల గట్ల వెంట నడుస్తూ వచ్చారు. మధ్యాహ్నం 2 గంటల వరకూ సభ పూర్తయ్యే వరకూ ఓపిగ్గా నేతల ప్రసంగాలను ఆలకించారు.

కుర్చీలు లేకపోతే వేదిక చుట్టూ వేల సంఖ్యలో నిల్చుని ఆద్యంతం నేతల ప్రసంగాలు విన్నారు. దీన్నిబట్టి ప్రభుత్వం ఎంతగా అణిచి వేయాలని చూసినా, రాయలసీమ లిఫ్ట్‌ ప్రాజెక్టు తమకు ఎంత విలువైందో చాటి చెప్పారు. ప్రాజెక్టు కోసం ఎందాకైనా ఉద్యమించాలనే కసి, పట్టుదల స్పష్టంగా కన్పించింది. సభ నిర్వాహకులను సజ్జల, పెద్దిరెడ్డి తదితర నేతలు అభినందించారు.

ఈ కార్యక్రమంలో కర్నూలు జెడ్పీ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మెల్సీలు ఇసాక్‌ బాషా, రమేష్‌ బాబు, రామసుబ్బారెడ్డి, కల్పలతా రెడ్డి, కర్నూలు పార్లమెంటు పరిశీలకులు గంగుల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్రకిషోర్‌ రెడ్డి, బ్రిజేంద్రా రెడ్డి, కాటసాని రామిరెడ్డి, కంగాటి శ్రీదేవి, కేతిరెడ్డి వెంకటరావిురెడ్డి, దుద్దేకుంట శ్రీధర్‌ రెడ్డి, మెట్టు గోవిందరెడ్డి, అంజద్‌ బాషా, రఘురామి రెడ్డి, అన్నా రాంబాబు, శ్రీకాంత్‌ రెడ్డి, విశ్వేశ్వర రెడ్డి, మాజీ ఎంపీలు పోచా బ్రహ్మానందరెడ్డి, తలారి రంగయ్య, కర్నూలు మేయర్‌ బీవై రామయ్య, కోడుమూరు ఇన్‌చార్జి ఆదిమూలపు సతీష్, కర్నూలు నగర అధ్యక్షుడు అహ్మద్‌ అలీఖాన్, తదితరులు పాల్గొన్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement