వేధించి చంపేశారు | YS Jagan Visit Kranti Kumar House At Vijayawada | Sakshi
Sakshi News home page

వేధించి చంపేశారు

Jul 3 2026 5:56 AM | Updated on Jul 3 2026 5:56 AM

YS Jagan Visit Kranti Kumar House At Vijayawada

క్రాంతికుమార్‌ కుమారుడు రవిచంద్ర ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని చలించిపోయి బాలుడి కాలు పట్టుకుని గాయాన్ని పరిశీలిస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

మా బిడ్డ ప్రాణం తీసుకునేలా చేశారు

ఈ పోలీసులపై కేసులు కట్టి న్యాయంచేయండి 

వైఎస్‌ జగన్‌కు క్రాంతికుమార్‌ కుటుంబం విజ్ఞప్తి 

పోలీసుల వేధింపుల గురించి వివరించిన తల్లిదండ్రులు 

సొంత పనులకు వాడుకునేవారు 

గంజాయి అమ్మించారు.. బాత్రూంలు కడిగించారు 

బూట్లు పాలిష్‌ చేయించుకునేవారు.. 

సీఐ నాగరాజు వల్లే మా కొడుకు చనిపోయాడు 

కొట్టడమే కాదు.. కులం పేరుతో దూషించేవాడు 

కోడిని వేలాడదీసినట్టు వేలాడదీసి కొట్టేవారు 

అనాథలమైపోయామని క్రాంతికుమార్‌ భార్య కన్నీటిపర్యంతం 

క్రాంతికుమార్‌ కుమారుడికి దీర్ఘకాలంగా అనారోగ్య సమస్య  

వివరాలు తెలుసుకుని చలించిపోయిన జగన్‌ 

పూర్తి వైద్య సహాయం అందించేందుకు హామీ 

కుటుంబానికి అండగా ఉంటామని వైఎస్‌ జగన్‌ భరోసా

సాక్షి ప్రతినిధి, విజయవాడ: ‘‘పోలీసుల వేధింపుల వల్లే నా కొడుకు అన్యాయంగా చనిపోయాడు. ఆరోజు పోలీసులు ఇంటికి వచ్చి బెదిరించడంతో తలుపులు వేసుకుని భయంతో పురుగుల మందు గుళికలు తిని ప్రాణాలు తీసుకున్నాడు’’ అని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట క్రాంతికుమార్‌ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు.

గురువారం కృష్ణలంకలోని క్రాంతికుమార్‌ ఇంటికి వెళ్లిన వైఎస్‌ జగన్‌ ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తన కొడుకు వీడియో వాంగ్మూలంలో చెప్పినట్టుగా సీఐ నాగరాజు వేధింపుల వల్లే చనిపోయాడని, తనను కులం పేరుతో సీఐ దూషించాడని, ఈ రెండు విషయాలపై కేసులు కట్టి సీబీఐతో విచారణ జరిపించి తమ కుటుంబానికి న్యాయం చేయాలని క్రాంతికుమార్‌ తల్లిదండ్రులు జగన్‌కు విజ్ఞప్తి చేశారు.  

ఆ రోజు ఏం జరిగిందంటే... 
క్రాంతికుమార్‌ ఆత్మహత్య ఘటన ఏరోజు జరిగిందని వైఎస్‌ జగన్‌ అడగ్గా మే 21న జరిగిందని వెంకటేశ్వరరావు వివరించారు. ‘‘ మే 21న మా ఇంటికి పోలీసులు వచ్చారు. వారిని చూసి నా కుమారుడు భయంతో లోపలికి వెళ్లి తలుపువేసుకున్నాడు. తలుపు తీయాలని వాళ్ల అమ్మ పిలిస్తే.. తలుపు తీస్తే పోలీసులు తనను చంపేస్తారంటూ పురుగుమందుల గుళికలు తినేశాడు. వాళ్ల అమ్మ దుఖంతో కేకలు వేస్తే తలుపు తీసాడు. హడావుడిగా హెల్ప్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాం. అయినా ప్రాణం దక్కలేదు’’ అని వెంకటేశ్వరరావు జగన్‌కు చెప్పారు.

సాయికృష్ణ తరహాలోనే తనను కూడా పోలీసులు కొట్టి చంపేస్తారన్న భయంతో ప్రాణం తీసుకున్నాడని తెలిపారు. క్రాంతి కుమార్‌పై 12 ఏళ్ల క్రితం కేసులు ఉండేవని, ఇప్పుడు లేవని ఆయన వివరించాడు. ఎనిమిదేళ్లుగా ట్యాక్సీ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడని తెలిపారు. గత నెల ఎనిమిదో తేదీన దళిత సంఘాలను తీçసుకొని సీపీ వద్దకు వెళ్లానన్నారు. ఇంత వరకు న్యాయం జరగలేదన్నారు. పోలీసు అధికారులు, ప్రభుత్వం తమకు న్యాయం చేస్తాయన్న నమ్మకం లేదని, దేవుడిలా వచి్చన మీరే మా కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన జగన్‌కు విజ్ఞప్తి చేశారు.  

బాత్రూంలు కడిగించి.. బూట్లు పాలిష్‌ చేయించేవారు.. 
తన కొడుకును పోలీసులు ఎన్ని రకాలుగా వేధించారో క్రాంతి కుమార్‌ తండ్రి పేరుపోగు వెంకటేశ్వరరావు వైఎస్‌ జగన్‌కు వివరించారు. ‘‘పోలీసులు ఇష్టం లేని పనులు చేయించేవారు. సొంత పనులకు వాడుకునేవారు. బూట్లు పాలిష్‌ చేయించేవారు. బాత్రూంలు కడిగించేవారు. రౌడీషీటర్లను పట్టుకురమ్మనేవారు. కులం పేరుతో దూషించేవారు. పోలీసులు చెప్పిన పనులు చేయక పోతే ఆదివారం సంతకం పేరుతో పిలిచి, ముగ్గురు కానిస్టేబుళ్లు టైరు బెల్ట్‌ తీసుకొని కొట్టేవారు. ముఖ్యంగా సీఐ నాగరాజు వేధింపుల వల్లే నా కొడుకు చనిపోయాడు’’ అని క్రాంతికుమార్‌ తండ్రి జగన్‌కు వివరించారు.  

క్రాంతికుమార్‌ కుమారుడికి వైద్యం.. కుటుంబానికి సాయం.. 
‘క్రాంతి మరణంతో నా ముగ్గురు పిల్లలు, నేను దిక్కులేనివారమయ్యాం’ అంటూ క్రాంతి భార్య ప్రభావతి కన్నీటి పర్యంతమయ్యారు. పాప లిఖిత పదోతరగతి, కుమారులు రవిచంద్ర ఏడు, వెంకటేశ్వరరావు ఐదు చదువుతున్నారని పొంగుకొస్తున్న దుఖాన్ని ఆపుకుంటూ ఆమె జగన్‌కు వివరించారు. క్రాంతి కుమారుడు రవిచంద్ర ఆరోగ్య పరిస్థితి చూసి వైఎస్‌ జగన్‌ చలించిపోయారు. కాలికి కట్టు కట్టి ఉండటాన్ని గమనించిన జగన్‌ దాని గురించి అడిగారు.

పుట్టుకతోనే పోలియో వల్ల రెండు వేళ్లు పోయాయని, తర్వాత వెన్నుముకపై కణితి వచ్చిందని, అది తీస్తే బతకడని వైద్యులు చెప్పారని క్రాంతి భార్య వివరించారు. చాలా ఆస్పత్రులలో చూపించామని, కొంత వయసు వచి్చన తర్వాత ఆపరేషన్‌ చేస్తామని వైద్యులు చెప్పారని ఆమె తెలిపారు. పోలియో వల్ల వేళ్లు పోయిన కాలికే గాయం కావడంతో కట్టుకట్టామని చెప్పారు. ఏ ఆస్పత్రిలో వైద్యం చేయిస్తున్నారో అడిగి తెలుసుకున్న జగన్‌ నరాలకు సంబంధించిన ఆస్పత్రిలో చూపించాలని సూచించి అన్నీ తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు.

అక్కడే ఉన్న  వైఎస్సార్‌సీపీ నేత దేవినేని అవినాష్ కు ఆ బాధ్యతలు అప్పజెప్పారు. బాబుకు పింఛనూ రావటం లేదని తల్లి జగన్‌ దృష్టి తీసుకెళ్లగా తాను చూసుకొంటానని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం నుంచి  రావలసిన ఐదు సెంట్ల స్థలం, పొలం, చట్టబద్ధంగా రావలసిన బెనిఫిట్స్, హక్కు గా రావల్సినవన్నీ, మన ప్రభు­త్వం వచి్చన నెలలోపే తాను చేస్తానని భరోసా ఇచ్చారు. బాబుకూ సమస్య లేకుండా చూస్తానని పేర్కొన్నారు. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే డైరెక్టుగా తనకు మెసేజ్‌ పంపితే తాను చూసుకుంటానన్నారు.  

కోడిని వేలాడదీసినట్లు వేలాడదీసి కొట్టారు..
ఆరోజు తలుపు తీయమంటే పోలీసులకు నన్ను అప్పజెప్పవద్దమ్మా అంటూ తన కుమారుడు గట్టిగా ఏడ్చాడని క్రాంతికుమార్‌ తల్లి మరియమ్మ జగన్‌కు వివరిస్తూ భోరున విలపించారు. తన కొడుకును పోలీసులు అన్యాయంగా పొట్టనపెట్టుకున్నారని ఆమె అన్నారు. పాత కేసులు ఉన్నాయని పిలవడం, గంజాయి అమ్మించడం వంటి పనులు చేయించేవారని, భయపడి వెళ్లకపోతే బాగా కొట్టేవారని ఆమె చెప్పారు.

ఒక రోజు రాత్రి సీఐ నాగరాజు రమ్మంటున్నారని పోలీసులు వచ్చి తీసుకెళ్లారని ఉదయం మేము స్టేషన్‌కు వెళ్లే సరికి కోడిని వేలాడదీసినట్టు వేలాడదీసి కొట్టడం చూసి తట్టుకోలేకపోయామని మరియమ్మ విలపించారు. ఈ వయసులో మమ్మల్ని చూడాల్సిన కొడుకు మా కళ్ల ఎదుటే మరణించడం చూసి బాధతో మా ప్రాణం విలవిల్లాడుతోందని మరియమ్మ జగన్‌ను పట్టుకుని కన్నీటిపర్యంతమయ్యారు. తన కుమారుడు ఆత్మహత్మ చేసుకొనే సమయంలో తీసుకొన్న సెల్ఫీ వీడియోను జగన్‌కు చూపించారు. ఆ కుటుంబానికి అండగా ఉండి అన్ని విధాలుగా న్యాయం చేస్తానని వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement