
తెనాలిలో బాధిత యువకుల కుటుంబసభ్యులను పరామర్శిస్తున్న వైఎస్ జగన్
నడిరోడ్డుపై కొట్టే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు?
వీళ్లే కేసులు పెట్టి.. వీళ్లే తీర్పులిచ్చేస్తే కోర్టులెందుకు?
తెనాలి ఘటనపై నిప్పులు చెరిగిన మాజీ సీఎం వైఎస్ జగన్
బహిరంగంగా రోడ్డుపై కూర్చోబెట్టి చితక బాదడం న్యాయమా?
కేసుల విషయం కోర్టులు చూసుకుంటాయి
ఏకంగా 24 కేసులున్నాయని చంద్రబాబును కూడా నడిరోడ్డుపై కొడతారా?
పోలీసులే చట్టాన్ని ఉల్లంఘించడం ధర్మమా?
బాధితులంతా చదువుకున్న వారే..
పెళ్లి కావాల్సిన చెల్లెళ్లు ఉన్నారు
పోలీసుల చర్య వల్ల ఆ కుటుంబాలకు అప్రతిష్ట
ఇప్పుడు ఆ కుటుంబాల పరువు ఎవరు తీసుకొస్తారు?
ఈ ఘటన తర్వాతే వారిపై రౌడీïÙట్ ఓపెన్ చేశారు
మంగళగిరికి చెందిన వారిని తెనాలికి తీసుకొచ్చి ఎందుకు కొట్టారు?
అంటే పోలీసులు చెప్పేవన్నీ అబద్ధాలే కదా
రాష్ట్రంలో పోలీసులు తెలుగుదేశం పార్టీకి చెందిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వారు సాక్షాత్తు కొందరు డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలను కలెక్షన్ ఏజెంట్లుగా వాడుకుంటున్నారు. మద్యం విక్రయాలు మొదలు, ఇసుక, మట్టి, పేకాట క్లబ్బుల వరకు ఎమ్మెల్యేలు దగ్గరుండి నడిపిస్తున్నారు. పోలీసులు వాటికి రక్షణ కల్పిస్తున్నారు. పోలీసులు మామూళ్లు వసూలు చేసి, పోలీసులకింత, ఎమ్మెల్యేకు ఇంత, చంద్రబాబుకు ఇంత, లోకేశ్కు ఇంత అని పంపకాలు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే జరుగుతోంది.
ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు కనిపిస్తున్నాయి. ప్రతి మందు షాపు దగ్గర డబ్బులు తీసుకుని అనధికారికంగా పర్మిట్ రూములకు అనుమతిస్తున్నారు. ప్రతి పర్మిట్ రూమ్, ప్రతి బెల్ట్ షాపు నుంచి పోలీసులు మామూళ్లు తీసుకుంటున్నారు. ఇసుక, పేకాట, మట్టి, సిలికా, క్వార్ట్జ్ , ల్యాటరైట్.. ఇలా ఏ వనరునూ వదలకుండా అన్ని చోట్లా యథేచ్ఛగా వసూళ్ల కార్యక్రమం జరుగుతోంది. పోలీసులను దొంగల ముఠాలో భాగస్తులుగా చేసి వారిని వాడుకుంటున్నారు. అసలు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది ఉందా?
గొడవల వల్ల కేసులుండొచ్చు. ఆ కేసుల్లో ఎవరిది తప్పు.. ఏది న్యాయం.. అనేది నాకు తెలియదు. నేను వాటిని వెనకేసుకు రావడం లేదు. కానీ పద్ధతి అనేది ఒకటి ఉంటుంది. ఆరోపణలు చేసే వ్యక్తులే జడ్జిలుగా మారిపోకూడదని మాత్రం గట్టిగా చెబుతున్నా. మీరు ఆరోపణలు చేసినప్పుడు కోర్టు ఇరువైపులా వాదనలు విన్న తర్వాత ఎవరిది న్యాయం, ఎవరిది అన్యాయం అనేది చూసి తీర్పు ఇస్తుంది. అప్పటి వరకు కేసులున్న ప్రతి ఒక్కరూ ముద్దాయిలు కారు. కేసులున్నాయనే కారణంతో వారిని నడిరోడ్డు మీదకు తీసుకొచ్చి, దారుణంగా కొట్టి, వారి కుటుంబాన్ని, వారి పరువు ప్రతిష్టలను మంటగలిపే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు? అలాగైతే ముఖ్యమంత్రి చంద్రబాబుపై కూడా 24 కేసులున్నాయని నడిరోడ్డుపైకి తీసుకొచ్చి కొడతారా? అలా చేస్తే అది ధర్మమేనా?
-వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ‘ఎవరి మీదైనా కేసులు ఉంటే కోర్టులు చూసుకుంటాయని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని నడిరోడ్డు మీద హింసించే అధికారం పోలీసులకు ఎక్కడిదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో యథేచ్ఛగా రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం ఎవరైనా ప్రశ్నిస్తే నేరంగా పరిగణిస్తోందని, పోలీసు వ్యవస్థను సీఎం చంద్రబాబు దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా దిగజారుతోందని, ఆ వ్యవస్థ వికృత రూపానికి తెనాలి ఘటన సాక్ష్యంగా నిలుస్తుందని అన్నారు. ఇటీవల తెనాలిలో పోలీసులు నడిరోడ్డుపై ముగ్గురు యువకులను అరికాళ్లపై కొడుతూ హింసించిన ఘటనకు సంబంధించి బాధిత యువకుల కుటుంబ సభ్యులను మంగళవారం ఆయన పరామర్శించి ఘటన పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో జరుగుతున్న అనేక సంఘటనల్లో చంద్రబాబు, ఆయన పార్టీ రెడ్బుక్ రాజ్యాంగం తీసుకొచ్చి పోలీసు వ్యవస్థను ఏ రకంగా దుర్వినియోగం చేస్తోందో కనిపిస్తోందన్నారు. ఆయనకు వ్యతిరేకంగా గొంతు వినిపిస్తే, ఆ గొంతు నొక్కేందుకు చంద్రబాబు దగ్గరుండి వైఎస్సార్సీపీకి చెందిన మాజీ మంత్రులు, నాయకులు, కార్యకర్తలతో పాటు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై తప్పుడు కేసులు నమోదు చేయిస్తున్నారని నిప్పులు చెరిగారు. ఇంకా వారిని జైళ్లకు పంపడంతో పాటు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం పరిపాటిగా మారిందని చెప్పారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
అసలేం జరిగిందంటే..
⇒ పోలీసుల చేతిలో దారుణంగా దెబ్బలు తిన్న రాకేష్, చేబ్రోలు జాన్ విక్టర్, కరిముల్లాలు దళితులు, మైనారిటీ వర్గానికి చెందిన వారు. రాకేష్ తెనాలిలో ఉండడు. పాలిటెక్నిక్ చదివిన అతను హైదరాబాద్లో జొమాటో కంపెనీలో పని చేస్తున్నాడు. వీళ్లంతా యువకులు. చిన్నతనంలో ఏదో పాత కేసు వాయిదా కోసం రాకేష్ తెనాలి వచ్చాడు. అతన్ని చూడటానికి అతని స్నేహితుడు జాన్ విక్టర్ మంగళగిరి నుంచి వచ్చాడు. అతను జూనియర్ అడ్వకేట్, బార్ కౌన్సిల్లో కూడా రిజిస్టర్ అయ్యాడు. విక్టర్ వెంట అతని స్నేహితుడు మెకానిక్ అయిన కరీముల్లా కూడా వచ్చాడు.
⇒ ఈ ముగ్గురూ కలిసే సమయానికి ఇదే ఐతా నగర్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద సివిల్ డ్రెస్లో ఉన్న ఒక కానిస్టేబుల్ ఎవరితోనో గొడవ పడుతున్నాడు. దీంతో వారు ఆ గొడవను ఆపే ప్రయత్నం చేశారు. అదే వారు చేసిన తప్పు. ఆ ప్రయత్నంలో చిన్న వాగ్వాదం జరగ్గా, జాన్విక్టర్ బైక్తో పాటు, అతడి మొబైల్ను సివిల్ డ్రెస్లో ఉన్న కానిస్టేబుల్ లాక్కునే ప్రయత్నం చేశాడు. వాటినెందుకు తీసుకుంటున్నారంటూ ప్రశ్నించి ఆ కానిస్టేబుల్ నుంచి బైక్ కీ, మొబైల్ వెనక్కు తీసుకుని, ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. రాకేష్ తన ఇంటికి వెళ్లిపోగా, మిత్రుడు కరీముల్లాతో కలిసి జాన్ విక్టర్ మంగళగిరి వెళ్లారు.
ఇది జరిగింది ఏప్రిల్ 24న.
⇒ ఆ మర్నాడు.. అంటే ఏప్రిల్ 25న తన సహచరులైన కొందరు పోలీసులతో కలిసి మంగళగిరి వెళ్లిన ఆ కానిస్టేబుల్.. జూనియర్ అడ్వకేట్ అయిన జాన్విక్టర్తో పాటు, అతడి స్నేహితుడు కరీముల్లాను కొట్టుకుంటూ తెనాలి తీసుకొచ్చారు. రాకేష్ను కూడా తీసుకొచ్చి ఆ రాత్రంతా తెనాలి టూ టౌన్ పీఎస్లో ఉంచి తీవ్రంగా కొట్టారు. ఆ మరుసటి రోజు, అంటే ఏప్రిల్ 26న ముగ్గురినీ స్టేషన్కు దగ్గరలో ఉన్న రోడ్డుపైకి తీసుకొచ్చి బహిరంగంగా అరికాళ్లపై దారుణంగా కొట్టారు. రోడ్డు మీద షేమింగ్ చేస్తూ, వారి పరువు, ప్రతిష్టతో ఆడుకుంటూ తెనాలి టూ టౌన్సీఐతో పాటు, మరో సీఐ వారిని లాఠీలతో అరికాళ్లపై చితకబాదారు. (ఇందుకు సంబంధించిన ఫొటోలు మీడియాకు చూపారు)
⇒ అంతటితో ఊర్కోక, ఆ మర్నాడు.. అంటే ఏప్రిల్ 27న కూడా మరో రోడ్ సెంటర్కు తీసుకెళ్లి కిరాతకంగా కొట్టారు. అలా మూడు రోజులు చట్టవిరుద్ధంగా వారిని అదుపులో ఉంచుకోవడమే కాకుండా, విక్టర్ జేబులో ఒక కత్తి పెట్టి ఇద్దరు వీఆర్వోలను పిలిపించి.. అతడి జేబులో మారణాయుధం ఉన్నట్లు పంచనామా రాయించారు. ఆ మర్నాడు, ఏప్రిల్ 28న వారిని కోర్టులో హాజరు పర్చారు. పోలీసుల దెబ్బలకు వారి కాళ్లు బొబ్బలెక్కినా, వారి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని, డాక్టర్ సర్టిఫికెట్ తీసుకోవడమే కాకుండా, న్యాయమూర్తి ఎదుట నోరు విప్పితే, ఆ తర్వాత స్టేషషన్కు తీసుకెళ్లి, ప్రైవేట్ పార్టులకు కరెంట్ షాక్ ఇస్తామని బెదిరించారు.
ఈ ప్రశ్నలకు బదులేది?
⇒ ఇంత దారుణంగా చట్ట ఉల్లంఘన జరుగుతుంటే అసలు మనం ఏ సమాజంలో ఉన్నాం? పోలీసులు తమను దారుణంగా హింసించారని, తమ ఒంటిపై గాయాలున్నాయని ఆ ముగ్గురూ వాటిని చూపినా, ఆస్పత్రిలో వైద్యుడు ఎందుకు పట్టించుకోలేదు? వాటిని ఎందుకు నోట్ చేయలేదు? ఎందుకంటే అది మెడికో లీగల్ కేసు అవుతుందన్న భయం. అలాగే పోలీసులు డాక్టర్ను బెదిరించి అయినా ఉండాలి. లేదా ప్రలోభాలకు గురి చేసైనా ఉండాలి.
⇒ ఏప్రిల్ 26న ముగ్గురు యువకులను నడిరోడ్డుపై చితకబాదితే, నెల రోజుల తర్వాత ఈ వీడియో బయటకొచ్చింది. నిజానికి ఆ వీడియోను రికార్డు చేసింది కూడా పోలీసులే. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను జీరి్ణంచుకోలేక మంచి వారైన కొందరు పోలీసులు ఈ వీడియోను బయటపెట్టారు. ముగ్గురు యువకులను అంత దారుణంగా హింసించిన పోలీసులు, తమ చర్యలను సమర్థించుకోవడం కోసం వారిని సంఘ విద్రోహ శక్తులుగా, నేరస్తులుగా, గంజాయి బ్యాచ్గా, రౌడీలుగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు.
అన్ని వ్యవస్థలూ నాశనం
⇒ లా అండ్ ఆర్డర్ కుప్పకూలిన పరిస్థితుల మధ్య.. చంద్రబాబు ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థ నీరు గారిన పరిస్థితుల మధ్య.. స్కూళ్లు దిగజారిపోయాయి. పిల్లలకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వడం లేదు. ఏడాది గడిచిపోయింది. స్కూళ్లను పట్టించుకోవడం లేదు. విద్యా రంగం పూర్తిగా నాశనమైపోయింది. వైద్య రంగం పూర్తిగా దివాలా తీసింది. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు నెలకు రూ.300 కోట్ల బిల్లు అవుతుంది. ఏడాదిగా ఆ మొత్తం ఇవ్వక పోవడంతో రూ.3,600 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. దీంతో పేదలు ఆరోగ్యశ్రీ కింద ఆ ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సేవలు అందుకునే పరిస్థితి లేదు.
⇒ మరోవైపు వ్యవసాయం కూడా దిగజారిపోయింది. ఏ పంటకూ గిట్టుబాటు ధర రాని పరిస్థితి. రైతులకు పెట్టుబడి సాయం లేదు. ఉచిత పంటల బీమా లేదు. ఈ–క్రాప్ నాశనం అయింది. ఆర్బీకేలు నిర్వీర్యం అయ్యాయి. సమయానికి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ రాని పరిస్థితి. రైతుల పరిస్థితి ఇంత దారుణంగా ఉంది.
అందుకే ‘వెన్నుపోటు దినం’
⇒ అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాలికి ఎగిరిపోయిన పరిస్థితి. వీటన్నింటి మధ్య మా ప్రభుత్వం గతంలో అమలు చేసిన పథకాలన్నీ రద్దు చేశారు. మరోవైపు వీళ్లు చేస్తామని మాటిచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ను గాలికొదిలేశారు. మేనిఫెస్టోలో ప్రకటించిన 143 హామీలను పట్టించుకున్న పాపాన పోలేదు. ఇలాంటి పాలనకు వ్యతిరేకంగా బుధవారం (నేడు) రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినంగా ప్రకటించి ప్రతి నియోజకవర్గంలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలంతా గళం విప్పాలని మరోసారి పిలుపునిస్తున్నా.
⇒ ఇలాంటి ప్రభుత్వం కొనసాగడం ఏ ఒక్కరికీ మంచిది కాదు. ఎంత త్వరగా ఈ ప్రభుత్వాన్ని సాగనంపితే ప్రజలు అంత సస్యశ్యామలంగా బతికే పరిస్థితి ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో కలిసి రావాలని కోరుకుంటున్నా.
⇒ ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, విడదల రజిని, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, పార్టీ నాయకులు అన్నాబత్తుని శివకుమార్, మోదుగుల వేణుగోపాలరెడ్డి, జూపూడి ప్రభాకర్, వరికూటి అశోక్బాబు, నూరీ ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.
పలకరించిన వారే లేరు.. జగన్ భరోసా ఇచ్చారు
మా అబ్బాయి బాబులాల్ అలియాస్ కరిముల్లా మంగళగిరిలో బైక్ మెకానిక్గా పని చేస్తున్నాడు. తన స్నేహితుడితో కలసి తెనాలి వచ్చాడు. మర్నాడు తెల్లవారుజామున పోలీసులు వచ్చి తీసుకెళ్లారు. ఈ విధంగా కొట్టారని తెలిసినప్పటి నుంచి ఎంతో బాధపడ్డాం. మమ్మల్ని ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు పలకరించ లేదు. వైఎస్ జగన్ ఒక్కరే పలకరించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
– షేక్ అమీర్బాషా, రాంతున్ (బాబులాల్ తల్లిదండ్రులు)
బాధలో ఉన్న మాకు ధైర్యం చెప్పారు
మా అబ్బాయి రాకేష్కు ప్రమాదంలో కాలు విరిగితే డాక్టర్లు రాడ్ వేశారు. కాలులో రాడ్ ఉందని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. వీడియో చూసినప్పటి నుంచి ఎంతో బాధపడ్డాం. కాలుకు ఏమైనా అయితే ఎవరిది బాధ్యత? బాధలో ఉన్న మాకు జగన్ ధైర్యం చెప్పారు. భవిష్యత్తులోనూ కుటుంబానికి అండగా ఉంటామన్నారు.
– దోమ వాసు, మాధవి (రాకేష్ తల్లిదండ్రులు)
పాత కేసులకూ, ఆ ఘటనకూ ఏం సంబంధం?
⇒ ఆ ముగ్గురు యువకులపై పాత కేసులున్నాయేమో నాకు తెలియదు. ఒకవేళ ఉన్నా, ఆ కేసులకూ, ఈ ఘటనకూ ఏం సంబంధం? అంత దారుణంగా వారిని నడిరోడ్డు మీద హింసించాలా? నేను ఆ ముగ్గురు యువకులను వెనకేసుకు రావడం లేదు. అలా వారిని అందరూ చూస్తుండగా, నడిరోడ్డుపై అంతలా హింసించడం ఎంత వరకు సబబు? కేసులుంటే కోర్టు చూసుకుంటుంది. కానీ, శిక్షించడానికి పోలీసులకు ఏం అధికారం, హక్కు ఉన్నాయి? అసలు శిక్షించడానికి పోలీసులు ఎవరు?
⇒ జరిగిన సంఘటనలను ఇలా వక్రీకరించి వ్యక్తిత్వ హననం చేస్తున్న పోలీసులను నేను ఒకటే అడుగుతున్నా. జాన్విక్టర్ జూనియర్ అడ్వకేట్ కాదా? రాకేష్ చెల్లెలు ఇంజనీర్ (ఆమెను చూపుతూ). రాకేష్ పాలిటెక్నిక్లో మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సు చదివాడు. అంటే వారిది చదువుకున్న కుటుంబం.
అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వారిని ఇలా రోడ్డు మీదకి తీసుకొచ్చి, కొట్టి పరువు తీయడం ధర్మమేనా? ఒకవేళ పోలీసులు చెబుతున్నట్లు వారికి అంత దారుణమైన బ్యాక్ గ్రౌండ్ ఉంటే, పోలీసులు చెబుతున్న మాటలు వాస్తవమే అయితే.. మంగళగిరికి చెందిన వారిని, తెనాలికి తీసుకొచ్చి ఎందుకు కొట్టారు? దాని అర్థం ఏమిటి? అంటే పోలీసులు చెప్పేవన్నీ అబద్ధాలే అని కదా? అలాగే వారిపై నమోదైన కేసులు పెద్దవి కాదనే కదా అర్థం?
ఉద్దేశపూర్వకంగా రౌడీ షీట్స్
⇒ కరీముల్లాపై కూడా గతంలో ఎలాంటి కేసులు లేవు. కానీ అతడని కూడా దారుణంగా కొట్టారు. మరోవైపు ఈ ఇష్యూ పెద్దదవుతుందని తెలిసిన తర్వాత జాన్విక్టర్, రాకేష్ మీద రౌడీ షీటర్లుగా కేసు ఓపెన్ చేశారు. అంటే ఇక్కడ పోలీసులు దుర్మార్గానికి పాల్పడ్డారన్నది స్పష్టంగా కనిపిస్తోంది.
వారిని పరామర్శించి, జరుగుతున్న అన్యాయాలను నిలదీస్తూ, వారికి సంఘీభావం చెప్పడానికి ఎవరొచ్చినా.. సీఎం చంద్రబాబు, ఆయన అనుకూల ఎల్లో మీడియా, వారి సోషల్ మీడియా ఇష్టానుసారం దు్రష్పచారం చేస్తోంది. వారిది గంజాయి బ్యాచ్ అని, వారంతా రౌడీ షీటర్లు అంటూ ఆ కుటుంబాల పరువు తీస్తున్నారు.
⇒ కేసుల మీద అంతిమంగా తేల్చాల్సింది కోర్టులు. కోర్టులకున్న అధికారాన్ని పోలీసులు తీసుకోవడం ధర్మమేనా అని అడుగుతున్నా.. పోలీసులే అభాండాలు వేస్తారు. పోలీసులే జడ్జిమెంట్లు ఇస్తారు. ఇలా చేయగలిగే నైతికత పోలీసులకు ఉందా? అని ప్రశ్నిస్తున్నా.
తెలుగుదేశం పార్టీ వారు సోషల్ మీడియాలో దొంగ పోస్టులు పెట్టే తీరు అయితేనేం.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి ఎల్లో మీడియాలో వస్తున్న కథనాలు అయితేనేం.. వాటి మీదా కేసులున్నాయి. చంద్రబాబు మీద ఏకంగా 24 కేసులున్నాయి. అలా అని ఆయన్ను కూడా నడి రోడ్డు మీదకు తీసుకొచ్చి కొడతారా? అదే చేస్తే అది ధర్మమేనా అని అడుగుతున్నా.అభిమానులు, పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి
కుటుంబాల పరువు తీస్తారా?
⇒ పాత కేసులు ఉన్నాయని తీసుకొచ్చి కొట్టడం పోలీసులు చేసిన పనికి సమర్థింపు కానే కాదు. కేసులుంటే వాటిని తేల్చాల్సింది కోర్టులు. మీరు ఆరోపణలు చేశారు. అది న్యాయం కాదని అవతలి వారు కోర్టుల్లో వాదిస్తారు. న్యాయమూర్తులు ఇరుపక్షాల వాదనలు వింటారు. ఆ తర్వాత తీర్పునిస్తారు. అంతే కానీ, గతంలో వారిపై కేసులు ఉన్నాయి కదా అని, పోలీసులు వారిని తీసుకొచ్చి నడి రోడ్డు మీద నిలబెట్టి కొట్టి, బాడీ షేమింగ్ చేస్తూ వారి కుటుంబ పరువు తీయడం భావ్యమేనా?
⇒ ఇది రాకేష్ అనే యువకుడి కాలికి తీసిన ఎక్స్రే. అతడి కాలు విరిగితే ఆపరేషషన్ చేసి లోపల రాడ్ వేశారు. ఆ విషయం మొర పెట్టుకున్నా పోలీసులు పట్టించుకోలేదు. పైగా, ఒక సీఐ తన బూటుకాలితో రాకేష్ కాలును అదిమిపడితే, మరో సీఐ అతడి అరికాళ్లపై లాఠీతో చితకబాదారు. ఇది ఏ మాత్రమైనా ధర్మమేనా?
⇒ ఈ పాప రాకేష్ చెల్లెలు. పెళ్లి కావాల్సిన పాప. వీరి పరువు తీశారు. హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుని బతికే రాకేష్ను ఇలా హింసించి, కేసులు పెట్టి వేధించి, ఆ కుటుంబంతో ఆడుకోవడం ధర్మమేనా? విక్టర్ జూనియర్ అడ్వకేట్. విక్టర్ చెల్లెలు కూడా ఇంజనీరే. విక్టర్ వాళ్ల నాన్న ప్రజాశక్తి అనే పేపర్లో మాజీ రిపోర్టర్. ఒక మాజీ జర్నలిస్ట్ కొడుకు పరిస్థితి ఇది. ఇది ధర్మమేనా అని ప్రతిఒక్కరూ ఆలోచించాలి.
పోలీస్ రాజ్యం.. హింసాకాండ
⇒ ఈ మధ్య కాలంలోనే దాచేపల్లిలో హరికృష్ణ అనే యువకుడిపై తప్పుడు కేసు పెట్టి సీఐ దారుణంగా కొట్టి క్వార్టర్లో పడేస్తే వారి తల్లిదండ్రులు, గ్రామçÜ్తులు వచ్చి ఆందోళన చేసి అతడిని కాపాడుకున్నారు. ఈ కేసులో కూడా హరికృష్ణ మీద ఎలాంటి గాయాలు లేవని డాక్టర్లతో దొంగ సర్టిఫికెట్ ఇప్పించుకున్నారు. కానీ హరికృష్ణ ఇప్పటికీ నడవలేని స్థితిలోనే ఉన్నాడు.
⇒ రాజమండ్రిలో పులిసాగర్ అనే సోషల్ మీడియా యాక్టివిస్ట్, దళిత యువకుడిని పోలీస్ స్టేషన్లో రాత్రంతా చిత్రహింసలకు గురి చేశారు. వీరు పోలీసులా.. రాక్షసులా? అని సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు అతడిని హింసించారు. చివరకు మహిళలు అని కూడా చూడకుండా వైఎస్సార్సీపీకి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్లు సుధారాణి, కృష్ణవేణి మీద పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసి నెలల తరబడి తిప్పుతూ వేధించారు. ఇవన్నీ చూశాక మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అని ప్రజలంతా ఆలోచన చేయాలి.
జగన్ పర్యటనలో భద్రత లోపాలు
చింతలపూడి చెక్పోస్టు నుంచే ఆటంకాలు
ట్రాఫిక్ నియంత్రించకుండా పోలీసుల నిర్లక్ష్యం
టీడీపీ శ్రేణులు నల్ల బెలూన్లతో వచ్చినా అడ్డుకోని వైనం
కనీసం వాహనం కూడా దిగని కాన్వాయ్ పోలీసులు
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. మంగళవారం వైఎస్ జగన్ తెనాలి పర్యటనలో పోలీసులు పూర్తి ఉదాశీనంగా వ్యవహరించారు. జగన్ పర్యటనకు భారీగా జనం వస్తారని తెలిసినా సరైన భద్రతా చర్యలు చేపట్టలేదు. కొంత మంది పోలీసులను కేటాయించినా, వారు ప్రేక్షక పాత్రకే పరిమితం అయ్యారు.
తెనాలి వచ్చేటప్పుడు చింతలపూడి చెక్పోస్టు నుంచి జగన్ కాన్వాయ్కి ఆటంకాలు మొదలయ్యాయి. జగన్ కాన్వాయ్ వస్తుందని తెలిసినా, ఎదురుగా వచ్చే వాహనాలను ఏ మాత్రం దారి మళ్లించలేదు. దీంతో కాన్వాయ్ ముందుకు సాగడానికి ఆలస్యం అయ్యింది. పట్టణంలోకి అడుగు పెట్టాక కూడా కనీసం రోప్ పార్టీని ఏర్పాటు చేయలేదు. టీడీపీ నాయకులు జగన్ పర్యటనను అడ్డుకుంటామని ముందు రోజే ప్రకటించినా, వారిని నిలువరించే ప్రయత్నం చేయలేదు. జగన్ వస్తున్న మార్గంలో వారు నల్ల బెలూన్లతో వచ్చినా అదుపు చేయకుండా చోద్యం చూశారు.
వైఎస్ జగన్ వాహనాన్ని చుట్టుముట్టిన జనం.. కానరాని పోలీసులు
ఓ దశలో వారు జగన్ కాన్వాయ్కి అడ్డం పడే ప్రయత్నం చేశారు. తమ చేతిలో హింసకు గురైన వారిని పరామర్శించడానికి వస్తున్నారన్న కారణంతోనే పోలీసులు ఉదాశీనంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఐతా నగర్లో దోమా రాకేష్ ఇంటి వద్ద కూడా కనీస ఏర్పాట్లు చేయలేదు. రోడ్డుపై నుంచి ఇరుకు సందులో ఉన్న రాకేష్ ఇంటికి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. కార్యకర్తలు, జగన్ పర్సనల్ సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ను లోపలికి తీసుకువెళ్లారు.
అక్కడ ఒకరిద్దరు అధికారులు తప్ప పోలీసు సిబ్బంది కనపడలేదు. జగన్ కాన్వాయ్లో వచ్చిన పోలీసులు కనీసం వ్యాన్ కూడా దిగలేదు. దీన్ని బట్టి కావాలనే జగన్ భద్రత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని వైఎస్సార్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జగన్ పర్యటన సమాచారం ముందుగానే జిల్లా ఎస్పీకి అందించినా, ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటని వారు నిలదీస్తున్నారు.