తాడేపల్లి: ప్రముఖ అభ్యుదయ రచయిత, సాహితీ విమర్శకుడు, విశాలాంధ్ర మాజీ ఎడిటర్, విమర్శకుడిగా తెలుగు సాహిత్యంలో లబ్ధప్రతిష్ఠులైన డాక్టర్ ఏటుకూరి ప్రసాద్ మరణం పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.
తెలుగు సాహిత్య రంగంలో అభ్యుదయ భావజాలాన్ని విస్తృతంగా వ్యాప్తి చేసిన రచయితగా డాక్టర్ ఏటుకూరి ప్రసాద్ విశిష్ట స్థానం సంపాదించారని జగన్ పేర్కొన్నారు. రచయితగా, విమర్శకుడిగా, సంపాదకుడిగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు.
అభ్యుదయ రచయితల సంఘం పునర్నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారని, అనేక రచనల ద్వారా సమాజంలో చైతన్యం నింపారని కొనియాడారు. ప్రముఖ సామాజిక సంస్కర్త తాపి ధర్మారావు జీవితంపై ఆయన చేసిన పరిశోధనలు, వెలువరించిన గ్రంథాలు తెలుగు సాహిత్యానికి విలువైన ఆస్తిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.
విశాలాంధ్ర పత్రిక సంపాదకుడిగా ఆయన జర్నలిజం రంగానికి అందించిన సేవలు కూడా విశేషమని వైఎస్ జగన్ గుర్తుచేశారు. డాక్టర్ ఏటుకూరి ప్రసాద్ మరణం తెలుగు సాహిత్య రంగానికి, అభ్యుదయ ఉద్యమాలకు తీరని లోటని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, హైదరాబాద్ నారాయణగూడలోని స్వగృహంలో వృద్దాప్య సమస్యలతో డాక్టర్ ఏటుకూరి ప్రసాద్ మరణించిన సంగతి తెలిసిందే.


