తండ్రి సూరిబాబుతో కలిసి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్న బాధితురాలు లావణ్య , సూర్యచంద్ర
నర్సీపట్నం జనసేన నియోజకవర్గ ఇన్చార్జి రాజాన సూర్యచంద్ర మోసం చేశాడని మహిళ ఆరోపణ
ఇంటికి వచ్చి కొట్టాడని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితురాలు
నాతవరం: అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ జనసేన ఇన్చార్జి రాజాన సూర్యచంద్ర తనపై దాడి చేసి తనను, తన తండ్రిని కొట్టారని ఓ మహిళ నాతవరం పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేసింది. బాధితురాలు నాతవరం గ్రామానికి చెందిన పోలుపర్తి లావణ్య తన తండ్రి పోలుపర్తి సూరిబాబుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. వారు మాట్లాడుతూ లావణ్యకు గతంలో ఓ వ్యక్తితో వివాహం జరగ్గా.. తాను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, భర్తతో విడాకులు తీసుకునేలా జనసేన నేత సూర్యచంద్ర నమ్మించాడు. 12 ఏళ్లుగా వివాహం చేసుకోవాలని ఎన్నిసార్లు అడుగుతున్నా సూర్యచంద్ర పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నాడు.
ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో సూర్యచంద్ర.. లావణ్య ఇంటికి వెళ్లి, గతంలో తాను ఇచ్చిన సెల్ఫోన్ ఇవ్వాలని అడిగాడు. సెల్ఫోన్ను ఉదయం ఇస్తామని లావణ్య తండ్రి చెప్పడంతో సూర్యచంద్ర కోపంతో ఊగిపోయి లావణ్య, ఆమె తండ్రి సూరిబాబును తీవ్రంగా కొట్టి గొడవ చేశాడు. దీంతో సూరిబాబుకు గాయమైంది. ఈ సంఘటనపై నాతవరం పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు లావణ్య తెలిపింది.
ఈ విషయంపై నాతవరం ఎస్ఐ వై.తారకేశ్వరరావును సంప్రదించగా.. సూర్యచంద్రపై లావణ్య ఫిర్యాదు చేసిన విషయం వాస్తవమేనని చెప్పారు. తాము చాలాకాలంగా కలిసి ఉంటున్నామని శనివారం రాత్రి సూర్యచంద్ర మద్యం తాగి గొడవకు దిగినట్టు ఫిర్యాదులో పేర్కొన్నట్టు చెప్పారు. కేసు నమోదు చేయకుండా కౌన్సెలింగ్ ఇవ్వాలని కోరినట్టు ఎస్ఐ చెప్పారు. కేసు నమోదు చేసేందుకు సంతకం చేయమంటే ఆమె నిరాకరించినట్టు తెలిపారు. ఫిర్యాదురాలి అభీష్టం మేరకు కేసు నమోదు చేస్తామన్నారు.


