విజయనగరం: కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం బోల్తా పడిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలకలం రేపింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది కార్మికులు గాయపడగా, అందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం తుమ్మనవలస గ్రామం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా జామి మండలం చింతాడ గ్రామానికి చెందిన కార్మికులు రైల్వే కాంట్రాక్టర్ కూలి పనులు చేయడానికి అరకు ప్రాంతానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
వారు ప్రయాణిస్తున్న బొలెరో వాహనం తుమ్మనవలస గ్రామం వద్ద అకస్మాత్తుగా అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో వాహనంలో ఉన్న కార్మికులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి (కేజీహెచ్)కు మెరుగైన చికిత్స కోసం తరలించారు.


