breaking news
Surya Chandra Rao
-
బల పరీక్ష
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్)ల రాజకీయాలు రసవత్తరంగా మారాయి. డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లపై డెరైక్టర్లు తిరుగుబావుటా ఎగురవేయడం, అవిశ్వాసానికి నోటీసులు జారీ చేయడంతో బలపరీక్ష అనివార్యంగా మారింది. ఈ మేరకు డీసీవో సూర్యచంద్రరావు అధ్యక్ష ఎన్నికపై చర్చ, బలపరీక్ష నిర్వహించనున్నారు. ఆగస్టు 7న డీసీసీబీ, 11న డీసీఎంఎస్ అవిశ్వాస తీర్మానాలపై ప్రత్యేక సమావేశాలు ఉంటాయి. డీసీసీబీలో 21 మంది డెరైక్టర్లు ఉండగా, 11 మంది సభ్యులు హాజరైతే కోరం సరిపోతోంది. 2/3 వంతు(14 మంది) మెజార్టీతో ఎన్నిక జరుగుతుంది. చెయ్యెత్తే విధానంతో ఓటింగ్ ఉంటుంది. డీసీఎంఎస్కు డెరైక్టర్లు 10 మంది, సభ్యులు 10 మంది ఉంటారు. కోరం ఆరుగురు, కాగా 2/3 వంతు (7 గురు) సభ్యులతో ఓటింగ్ విధానంతో ఎన్నికలు జరుగుతాయి. ఇందులో మెజార్టీ ఓట్లతో గెలుపోటములు ప్రకటిస్తారు. పీఏవైసీ(ప్రాథమిక) వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షుల మీద ఆ సంఘాల డెరైక్టర్లు ఆవిశ్వాసం ప్రవేశ పెట్టడంతో వాటికి కూడా ప్రత్యేక సమావేశాలు ప్రవేశపెట్టారు. ఆగస్టు 12న సారంగాపూర్ మండల కౌట్ల(బి), 13న మంజులాపూర్, బజార్హత్నూర్లలో ప్రత్యేక సమావేశాలు ఉంటాయి. వేడెక్కిన సహకార రాజకీయం అవిశ్వాస తీర్మానాల నేపథ్యంలో సహకార రాజకీయం వేడెక్కింది. ఎవరి నోట విన్న జిల్లాలో సహకార చర్చ జోరుగా సాగుతోంది. చైర్మన్ గిరిలను వశం చేసుకోవడానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా కేంద్రం సహకార బ్యాంకుల్లో 21 మంది డెరైక్టర్లు ఉండగా అందులో ఒకరు రాజీనామా చేశారు. మిగిలిన 20 మందిలో 11 మంది డెరైక్టర్ల సంతకాలతో జిల్లా సహకార అధికారి సూర్యచందర్కు అవిశ్వాస తీర్మానం అందించారు. ఈ అవిశ్వాస తీర్మాన పత్రాన్ని హైదరాబాద్లోని సహకార కమిషనర్ కార్యాయానికి పంపించారు. అవిశ్వాస తీర్మానం పై సంతకాలు చేసిన 11 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు. ఈ అవిశ్వాస తీర్మానం పెట్టడంలో కీలకపాత్ర పోషించిన డీసీసీబీ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి వైపు 11 మంది ఉన్నట్లు ఆ వర్గీయులు చెబుతున్నారు. ఈ ఓటింగ్లో విజయం సాధించాలంటే మరో ముగ్గురు సభ్యులు అవసరం ఉంది. వారికోసం ప్రయత్నాలు ముమ్మర ం చేస్తున్నారు. ప్రస్తుత డీసీసీబీ అధ్యక్షుడు తన పదవిని కాపడుకునెందుకు తన దైన శైలిలో పావులు కదుపుతున్నారు. పార్టీని వీడేందుకు కూడా డీసీసీబీ అధ్యక్షుడు దామోదర్రెడ్డి సిద్ధంగా ఉన్నారు. అనంతరం టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు, టీఆర్ఎస్లోని ముఖ్య నాయకులతో చర్చలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. -
సీమాంధ్రలో ఆర్టీసీకి రూ.1,100 కోట్ల నష్టం
ఒంగోలు, న్యూస్లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా సీమాంధ్రలోని 13 జిల్లాల్లో ఆర్టీసీకి 1,100 కోట్ల రూపాయలకుపైగా నష్టం వాటిల్లినట్లు ఆ సంస్థ నెల్లూరు జోన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ (ఈడీ) సూర్యచంద్రరావు వెల్లడించారు. శనివారం ఒంగోలు వచ్చిన ఆయన స్థానిక ఆర్ఎం కార్యాలయంలో ఆర్టీసీ రీజియన్ పరిధిలోని ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ సీమాంధ్ర జిల్లాల్లో సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల 650 కోట్ల రాబడిని ఆర్టీసీ కోల్పోయిందన్నారు. సమ్మె కాలంలో కాంట్రాక్టు ఉద్యోగులకు 15 వేలు, రెగ్యులర్ ఉద్యోగులకు 25 వేల రూపాయల చొప్పున అడ్వాన్స్లు చెల్లించామని, వాటితో పాటు పర్యవేక్షణ, ఇతర అంతర్గత నష్టం కలిపి 150 కోట్ల రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు. దీనికితోడు కార్మికులకు సమ్మె కాలాన్ని వారి సెలవుల్లో మినహాయించామని, దీనికోసం 300 కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వచ్చిందని తెలిపారు. అలా మొత్తం కలిపి 1,100 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఈడీ వివరించారు. ఇక నెల్లూరు జోన్ పరిధిలోని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 250 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు అంచనా వేశామన్నారు. అంతేగాకుండా ఈ జోన్ పరిధిలో 600 బస్సుల బ్యాటరీలు పాడైపోయాయని తెలిపారు. సుమారు రెండు నెలల పాటు బస్సులు తిరగకపోవడం వల్ల అలా జరిగిందన్నారు. ఒక్కో బ్యాటరీ ఖరీదు 5 వేల రూపాయలు ఉంటుందన్నారు. వాటివల్ల మొత్తం 30 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని తెలిపారు. బస్సులు ఎక్కువకాలం తిరగకపోవడం వల్ల వాటి టైర్ల మన్నికపై కూడా ఆ ప్రభావం పడుతుందన్నారు. ఈ నష్టాన్ని మొత్తం భర్తీ చేయడం సాధ్యంకానిపనని, చార్జీల పెంపు మాత్రం అనివార్యమని చెప్పారు. లక్ష్యాలు అధిగమించాలి... సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల ఆర్టీసీకి జరిగిన నష్టాన్ని ఎలాగో భర్తీ చేయలేమని, అధికారులు, కార్మికులు చిత్తశుద్ధితో పనిచేసి ఇకపై నెలవారీ లక్ష్యాలనైనా అధిగమిస్తే కొంత ఉపయోగం ఉంటుందని ఈడీ సూర్యచంద్రరావు సూచించారు. అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నష్టాన్ని కొంతమేరకైనా భర్తీ చేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. విద్యాసంస్థలకు సెలవులు రద్దుచేస్తూ విద్యాశాఖ తీసుకున్న నిర్ణయం కారణంగా సంక్రాంతి పండుగకు సైతం రద్దీ ఉండే అవకాశం లేదన్నారు. దానివల్ల ఆ సీజన్లో ఆర్టీసీకి వచ్చే 1.50 కోట్ల రూపాయల ఆదాయం ఈసారి వచ్చే అవకాశం లేదన్నారు. సమ్మె కాలంలో ప్రైవేటు వాహనాల నిలువుదోపిడీని ప్రత్యక్షంగా చూసిన ప్రయాణికులు తప్పనిసరిగా ఆర్టీసీని ఆదరిస్తారని తాము భావిస్తున్నామన్నారు. వచ్చే ఏడాది సిటీ సర్వీసులు... జేఎన్యూఆర్ఎం పథకం కింద 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఒంగోలుకు సిటీ సర్వీసులు ఏర్పాటు చేయనున్నట్లు ఈడీ పేర్కొన్నారు. మొత్తం 40 సర్వీసులు వస్తాయని, వాటిని 30 కిలోమీటర్ల పరిధిలో నడిపే అవకాశం ఉందని తెలిపారు. వాటివల్ల ఒంగోలు నగర, పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. మూడు నెలలుగా అద్దె కట్టకపోవడం వల్ల ఒంగోలు బస్టాండ్లో మూడు స్టాల్స్ను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. బకాయిలున్న వారు నవంబర్ 10వ తేదీలోగా పూర్తిగా చెల్లించాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. అద్దె బస్సుల యజమానులు కూడా నష్టపోయిన మాట వాస్తవమేనని, కాకుంటే బస్సులు రెండు నెలలపాటు నడపకపోవడం వల్ల వారితో ఉన్న ఒప్పందాన్ని మరో రెండునెలల పాటు పొడిగించే ప్రతిపాదన ఉందని తెలిపారు. రీజియన్ పరిధిలోని జిల్లాల్లో గల ఆర్టీసీ బస్టాండ్లలో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఈడీ పేర్కొన్నారు. సమావేశంలో రీజియన్ పరిధిలోని పలువురు ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.