‘డైట్‌ కాంట్రాక్టర్లకు అధికశాతం బిల్లులు చెల్లించేశాం’

We Have Paid Most Of The Bills To Diet Contractors - Sakshi

గ్రీన్‌ చానల్‌ ద్వారా ఆస్పత్రుల్లో డైట్‌ బిల్లులు ప్రభుత్వం చెల్లిస్తోంది

 గత నెల 26నే రూ.6 కోట్లు చెల్లించాం

ఇంకా చెల్లించాల్సింది రూ.94 లక్షలే.. ఇదీ త్వరలో చెల్లిస్తాం

అన్ని రాష్ట్రాలకంటే ఏపీలోనే వైద్య రంగానికి ఎక్కువ నిధులు

ప్రజలను తప్పుదోవ పట్టించడానికే ఈనాడు తప్పుడు కథనాలు

వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు

సాక్షి, అమరావతి: ప్రభుత్వాస్పత్రుల్లో డైట్‌ కాంట్రాక్టర్లకు గత నెలలోనే అత్యధిక శాతం బిల్లులు చెల్లించామని, ఈ విషయం తెలుసుకోకుండా రూ.లక్షల్లో బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయంటూ ఈనాడు తప్పుడు కథనాలు రాసిందని వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు మండిపడ్డారు. ఆయన సోమవారం విజయవాడలో విలే­కరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఆస్పత్రు­ల్లో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని తెలిపారు. అసత్య ప్రచారాలతో ప్రజల్లో ప్రభుత్వ ఆస్పత్రు­లపై నమ్మకం సన్నగిల్లి ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లి, ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.

డీఎంఈ, ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో షె­డ్యూ­ల్‌ ప్రకారం గతనెల 26నే రూ.6 కోట్ల మేర డైట్‌బిల్లులు చెల్లించామన్నారు. ఇంకా రూ.94 లక్ష­లు మాత్రమే చెల్లించాల్సి ఉందని, త్వర­లోనే చెల్లి­స్తామని అన్నారు. జనని సురక్ష యోజన కింద రూ.13.69 కోట్లు గత నెల 22నే కలెక్టర్లకు మంజూ­రు చేశామన్నారు. సాలూరు ఆస్పత్రిలో పెండింగు­లో ఉన్నది రూ.1.40 లక్షలు కాగా, రూ.12 లక్షలు పెం­డింగ్‌ ఉన్నాయంటూ రాశారన్నారు. పార్వతీ­పురం మన్యంలో రూ.12 లక్షలకు గాను రూ.9.70 లక్షలు డిసెంబర్‌ 26న చెల్లించామన్నారు. బాడంగి ఆస్పత్రిలో రూ.4.80 లక్షలు పెండింగ్‌లో ఉంద­న్నారు.

ఇవన్నీ తెలుసు­కోకుండా తప్పుడువార్తలు రాయడంవెనుక ఉద్దేశం ప్రజలను తప్పుదోవ పట్టించడం, ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చడ­మేనన్నారు. గ్రీన్‌ చానల్‌ ఏర్పాటుచేసి మరీ డైట్‌ బిల్లులను ప్రభు­త్వం చెల్లి­స్తోందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డైట్‌ చార్జీలను రోగికి రూ.40 నుంచి రూ.80­కు పెంచామన్నారు. పెంచిన చార్జీలకు అను­గుణంగా కొత్త కాంట్రాక్టర్ల ఎంపిక జరుగుతోంద­ని చెప్పారు.

వివిధ రాష్ట్రాల్లో బడ్జెట్‌లో 3.4 శాతం నుంచి 4 శాతం మేర మాత్రమే వైద్య రంగానికి ఖర్చు చేస్తుండగా, మన రాష్ట్రంలో 7.3 శాతం ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. 2018–19లో ఏపీవీవీపీలో రూ.కోటి మేర నెలకు ఆరోగ్యశ్రీ కింద బిల్లు చెల్లింపులు ఉండేవని, ప్రస్తుతం నెలకు రూ.12 కోట్లు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లిస్తున్నామని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడం కోసం ప్రభుత్వం రూ.16 వేల కోట్లకు పైగా నిధులతో నాడు–నేడు చేపట్టిందని, 47 వేలకుపైగా పోస్టుల భర్తీ చేపట్టిందని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మార్పును తెలుసు­కోవడానికి జనవరి 26 నుంచి ప్రజాప్రతినిధుల ద్వారా ఆస్పత్రుల్లో తనిఖీలు చేపట్టి ఆడిట్‌ చేయాలని ముఖ్యమంత్రి‡ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top