
సాక్షి,విశాఖ: విశాఖ 7వ అదనపు జిల్లా కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ప్రభుత్వ న్యాయవాదికి గౌరవ వేతనం చెల్లించకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విశాఖ జిల్లా కలెక్టర్ కుర్చీ,కారు, ఫర్నిచర్ అటాచ్ చెయ్యండి అంటూ ఆదేశాలు జారీ చేసింది.
2015 ఏప్రిల్ నుంచి 2021 వరకు విశాఖ కోర్టులో రవి కుమార్ ప్రభుత్వ ప్లీడర్గా పని చేశారు. కానీ అతని వేతనాన్ని కలెక్టర్ కార్యాలయంలో విడుదల చేయలేదు. సుమారు రూ. 54 లక్షల రూపాయల వేతన బకాయిలు పెండింగ్లో ఉంది. ఇదే విషయంపై రవికుమార్ కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు కలెక్టర్ ఆఫీస్ సామాగ్రిని అటాచ్మెంట్ చేయాలని అదనపు జిల్లా జడ్జి శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. వడ్డీతో సహా న్యాయవాది రవికుమార్కు బకాయిలు చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు.
ఈ ఏడాది జనవరి 31వ తేదీన రవికుమార్కు చెల్లించాల్సిన 72 నెలల వేతన బకాయిలను 12 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలి కోర్టు స్పష్టం చేసింది. న్యాయమూర్తి ఆదేశాలతో కోర్టు వారెంట్ తీసుకుని కోర్టు అమీన్ కలెక్టర్ ఆఫీసుకు వచ్చింది. వారెంట్ ఎగ్జిక్యూటివ్ చేయడానికి వచ్చిన సిబ్బందికి కలెక్టరేట్ సిబ్బంది సహకరించలేదు. కలెక్టర్ కార్యాలయం వద్దకు వచ్చి కోర్టు సిబ్బందిని వెళ్ళిపోవాలని మహారాణిపేట సీఐ భాస్కర్ ఇబ్బంది పెట్టారు.