ఇంకా రూ.5 కోట్లు ఇవ్వమంటున్నారు
మీడియా సమావేశంలో ఓ మహిళ ఆవేదన
లబ్బీపేట(విజయవాడతూర్పు): వ్యాపార అవసరాల కోసం 2017 నుంచి 2023 వరకూ విడతల వారీగా కాల్మనీ వ్యాపారి వద్ద రూ.5 కోట్లు అప్పు తీసుకున్నానని, అందుకు గాను రూ.21 కోట్లు తిరిగి చెల్లించినట్లు గాయత్రినగర్కు చెందిన చాగర్ల గాయత్రి చెప్పారు. ఇంకా రూ.5 కోట్లు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని, లేదంటే హామీగా పెట్టిన ఖాళీ చెక్లు, ప్రామిసరీ నోట్లు, ల్యాండ్ డాక్యుమెంట్లు ఇవ్వనని బెదిరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
గాయత్రినగర్లోని తన నివాసంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె వివరాలు తెలిపారు. తాను వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం చేస్తుంటానని, కాల్మనీ వ్యాపారి వద్ద నుంచి రూ.5 కోట్లు అప్పు తీసుకున్నట్లు తెలిపారు. అందుకు గాను ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు, స్టాంప్ పేపర్లు, ఆస్తుల ఒరిజనల్ డాక్యుమెంట్ ఇచ్చినట్లు తెలిపారు.
అప్పుకు గాను ఇప్పటికే వడ్డీతో కలిపి రూ.21 కోట్లు చెల్లించానని, ఇంకా రూ.5 కోట్లు బాకీ ఉందని వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. అతని వద్ద ఉన్న పత్రాలు కావాలంటే అదనంగా డబ్బులు చెల్లించాలని, లేదంటే కోర్టు కేసులతో ఇబ్బందులు పెడతామంటున్నారని గాయత్రి వాపోయారు. తన చిన్న కుమార్తెతో పాటు తన వ్యాపార భాగస్వామి నుంచి కూడా ఖాళీ చెక్కులు, పత్రాలు తీసుకున్నట్లు తెలిపారు.
చదవండి: మహిళలకు మరో షాక్ ఇచ్చిన చంద్రబాబు!
ఈ వివాదం కొనసాగుతుండగానే మే 27న ఇంటికి వచ్చి తనపై, తన కుమార్తెలపై దాడికి పాల్పడ్డారని చెప్పారు. తనకు సంబంధించిన ఆస్తి పత్రాలను వేరొకరికి బదలాయించే ప్రయత్నాలు కూడా జరిగాయని, అక్రమ రిజిస్ట్రేషన్ను వెంటనే నిలుపుదల చేయాలని అధికారులను వేడుకున్నారు. పోలీసులు తమకు న్యాయం చేయాలని కోరారు.


