రెండేళ్లుగా రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలలో వింత పరిస్థితులు
భారీగా పెరుగుతున్న భక్తులు.. గతం కంటే తరిగిపోతున్న ఆదాయం
విజయవాడ దుర్గగుడి, అన్నవరం ఆలయాల ఆదాయం భారీగా తగ్గుదల
ఉచిత బస్సు లాంటి వాటిని లెక్కలోకి తీసుకున్నా భక్తులు పెరిగినప్పుడు ఆదాయం
పెరగాల్సిందిపోయి గతంలో కంటే కూడా తగ్గిపోవడం ఏమిటని సర్వత్రా విస్మయం
గత నెల రోజుల్లో దుర్గగుడిలో మూడుసార్లు బయటపడ్డ దర్శనం దొంగ టిక్కెట్ల దందా
సాక్షి, అమరావతి: రెండేళ్లుగా రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో ఏదో మాయ జరుగుతోంది! ఒకపక్క ఆలయాలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతున్నా విచిత్రంగా ఆదాయం మాత్రం గతం కంటే తగ్గిపోతోంది. దేవదాయశాఖ పరిధిలో ఉండే అతి పెద్ద ఆలయాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. 2023 –24లో 93.40 లక్షల మంది భక్తులు దర్శించుకున్న విజయవాడ దుర్గ గుడిలో అన్ని రకాల ఖర్చులు పోను రూ. 156.97 కోట్ల మిగులు ఆదాయం (అసెస్బుల్ ఇన్కం) వచ్చినట్లు దేవదాయ శాఖ గణాంకాలు పేర్కొంటున్నాయి. అదే 2025–26లో దుర్గగుడికి 1.19 కోట్ల మంది భక్తులు అమ్మవారి దర్శనానికి రాగా ఆదాయం కేవలం రూ.140.99 కోట్లేనని దేవదాయ శాఖ పేర్కొంటోంది.
రెండేళ్ల క్రితంతో పోల్చితే 25 లక్షల మందికిపైగా భక్తులు అధికంగా దర్శనాలకు వచ్చినప్పటికీ ఆదాయం మాత్రం పది శాతానికిపైగా తగ్గిపోవడం ఆశ్చర్య చకితులను చేస్తోంది. దేవదాయ శాఖ పరిధిలోని మరో ప్రధాన ఆలయం అన్నవరం శ్రీవీర వెంకటసత్యనారాయణస్వామి గుడిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 2023–24లో సత్యదేవుడి ఆలయానికి 45.50 లక్షల మంది భక్తులు దర్శనాలకు రాగా ఆ ఏడాది గుడికి రూ. 84.82 కోట్లు మిగులు ఆదాయం లభించినట్లు తేలింది. కానీ చిత్రంగా 2025–26లో అదే గుడికి ఏకంగా 57.87 లక్షల మంది భక్తులు దర్శనాలకు వచ్చినా ఆదాయం మాత్రం కేవలం రూ.82.80 కోట్లేనని దేవదాయ శాఖ చెబుతోంది.
ఇతర ఆలయాల్లోనూ..
దేవదాయశాఖ అధికారిక గణాంకాల ప్రకారమే పెనుగంచిప్రోలు, పెదకాకాని లాంటి ఆలయాల్లో సైతం ఇదే పరిస్థితి ఉంది. ఉచిత బస్సు లాంటి వాటిని పరిగణనలోకి తీసుకున్నా భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఆదాయం పెరగాల్సిందిపోయి తగ్గిపోవడం ఏమిటని సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. గతంలో ఉన్న ఆదాయం సైతం తగ్గిపోవడం ఇదేం చిత్రమనే చర్చ జరుగుతోంది. 
వాట్సాప్ సేవలంటూ..
దర్శన టిక్కెట్ల కొనుగోలు, భక్తులకు గదుల కేటాయింపు లాంటి వాటికి వాట్సాప్ సేవలు అంటూ టీడీపీ కూటమి ప్రభుత్వం దేవదాయ శాఖ పరిధిలోని ప్రధాన ఆలయాలలో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. వాట్సాప్ సేవల గురించే ఆర్భాటంగా ప్రచారం చేస్తూ కొద్ది నెలలుగా ఆలయాల వద్ద నేరుగా భక్తులకు దర్శన టిక్కెట్ అమ్మే కౌంటర్లను తగ్గించి వేసింది. గత నాలుగు నెలలుగా అన్నవరం ఆలయంలో అన్నింటికీ వంద శాతం డిజిటల్ సేవలంటూ ప్రత్యక్ష కౌంటర్లను మూసివేసింది. దీంతో భక్తుల అవస్థలను బ్రోకర్లు సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రెండేళ్లుగా విభ్రాంతికర ఘటనలు..
ఒకపక్కన భక్తులు పెరిగినప్పటికీ ఆలయాలకు వచ్చే ఆదాయం గతంతో పోల్చితే తగ్గిపోతుండగా మరోపక్క ఆలయాలలో విభ్రాంతి కలిగించే పలు ఘటనలు గత రెండేళ్లలో వెలుగులోకి రావడం గమనార్హం. కొద్ది నెలల క్రితం విజయవాడ దుర్గగుడిలో హుండీ లెక్కింపు సమయంలో ఓ ఉద్యోగి.. భక్తులు అమ్మవారికి సమర్పించిన బంగారు కానుకల్లో చిన్న సైజులో ఉండే బంగారు పూసలను విలువ లేని వస్తువుల్లో కలుపుతూ పట్టుబట్టాడు. అందరి సమక్షంలోనే ఈ విషయం బయటపడడంతో ఆ ఉద్యోగి సస్పెండ్ అంశాన్ని అధికారులు మరుగున పెట్టేశారు. విజయవాడ దుర్గగుడిలో గత నెల రోజుల వ్యవధిలో దర్శనం దొంగ టిక్కెట్ల బాగోతం మూడుసార్లు బయటపడింది.
టిక్కెట్లు కొన్న భక్తులు దర్శనానికి వెళ్లే సమయంలో ఇచ్చే రశీదులను చించకుండా తిరిగి విక్రయించేందుకు యత్నిస్తూ సెక్యూరిటీ సిబ్బంది, ఔట్సోర్సింగ్, హోంగార్డులు పట్టు్టబడ్డారు. విజయవాడ యనమలకుదురు ఆలయం హుండీ లెక్కింపులో ఆలయ అధికారులే అక్రమాల పాల్పడడంపై పోలీసు కేసు నమోదు తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఇలా ఒకటి రెండు అక్రమాలు బయటపడినప్పటికీ దేవుడి ఆదాయానికి భారీగా గండి కొట్టే కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగి ఉంటాయనే చర్చ సాగుతోంది. ఇక ఇటీవల కాలంలో ఆలయాల వద్ద భక్తులకు దర్శన టిక్కెట్లు ఖర్చు కంటే తక్కువ రేటుకే వీఐపీ దర్శనాలు చేయిస్తామనే బ్రోకర్ల సంఖ్య పెరిగిందనే విమర్శలున్నాయి.


