కర్నూలు: జిల్లా ఆస్పరి పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేగింది. కేసు విచారణ పేరుతో పోలీసులు సాగించిన వేధింపులు ఒక వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చాయి. సీఐ టార్చర్ తట్టుకోలేక ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించడం స్థానికంగా చర్చాంశనీయంగా మారింది.
బాధితుల కథనం ప్రకారం.. ఒక కేసు విషయమై విచారణ కోసమంటూ హనుమంతు రెడ్డిని సీఐ శ్రీనివాస్ నాయక్ ఆస్పరి పోలీస్ స్టేషన్కు పిలిపించారు. అయితే విచారణ సమయంలో సీఐ శ్రీనివాస్ నాయక్ తనను తీవ్రంగా మానసిక, శారీరక వేధింపులకు గురిచేశాడని బాధితుడు ఆరోపించారు. సీఐ వేధింపులను భరించలేక, తీవ్ర మనస్తాపానికి గురైన హనుమంతు రెడ్డి అందరూ చూస్తుండగానే పోలీస్ స్టేషన్ లోపలే పురుగుల మందు తాగాడు.
దీంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైన పోలీసులు, అతని పరిస్థితి విషమించడంతో వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.


