
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రజలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గాలికొదిలి.. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి.. అన్ని రంగాల్లోనూ ఘోరంగా విఫలమైందని ఆరోపిస్తూ ‘వెన్నుపోటు దినం’పేరిట నిరసన తెలపాలని వైఎస్సార్ సీపీ ఇచ్చిన పిలుపునకు అన్ని వర్గాల నుంచి స్పందన లభించింది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లింది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతమైంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు ఆధ్వర్యంలో తూర్పు, ఉత్తర, దక్షిణ నియోజకవర్గాల నుంచి వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు బుధవారం ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు.
జెడ్పీ జంక్షన్ వద్ద ప్రారంభమైన వెన్నుపోటు నిరసన ర్యాలీ కలెక్టరేట్ వరకు సాగింది. ‘వెన్నుపోటు చంద్రబాబు.. మోసగాడు చంద్రబాబు’అంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణే‹Ùకుమార్, విశాఖ తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్, కోలా గురువులు, రవిరెడ్డి తదితరులు కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేయడం తప్ప మరేమీ చేయలేదని, వారి వైఫల్యాలకు నిరసనగా చేపట్టిన ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమం కూటమి ప్రభుత్వ పతనానికి నాంది పలుకుతుందని నేతలు హెచ్చరించారు.
కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కె.సతీష్ పార్టీ కార్యాలయం పర్య వేక్షకుడు రవిరెడ్డి, రాష్ట్ర అనుబంధ సంఘ అధ్యక్షుడు విజయచంద్ర, కార్పొరేటర్లు బానాల శ్రీనివాసరావు, అల్లు శంకరరావు, రెయ్యి వెంకటరమణ, కోరుకొండ వెంకట స్వాతి, కె.అనిల్ కుమార్రాజు, మొల్లి లక్ష్మి, మువ్వలలక్ష్మి, సాడి పద్మారెడ్డి, చెన్నా జానకీ రామ్, కోడిగుడ్ల పూర్ణిమ, వావిలపల్లి ప్రసాద్, శశికళ, ఉత్తరాంధ్ర యువజన విభాగం రీజనల్ ప్రెసిడెంట్ అంబటి శైలేష్, పార్టీ ముఖ్య నాయుకులు కోలా గురువులు, రొంగలి జగన్నాథం, ఎండీ ఫరూఖీ, వుడా రవి, గొలగాని శ్రీనివాస్, రవి రాజు, సతీష్ వర్మ, తాడి జగన్నాథ్రెడ్డి, శ్రీని వాసరెడ్డి, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు పేడాడ రమణి కుమారి, బోని శివరామకృష్ణ, సనపల రవీంద్ర భరత్, బర్కత్ అలీ, ఎస్.ప్రసాదరావు, రామిరెడ్డి, బొండా ఉమా మహేశ్వరరావు, దేవరకొండ మార్కండేయులు, కాళిదాస్ రెడ్డి, అల్లంపల్లి రాజాబాబు, రామన్నపాత్రుడు, కిరణ్ రాజు, పల్లా దుర్గారావు, డా.మంచా నాగ మల్లీశ్వరి, మనలత జాబ్దాస్(చిన్ని), నీలి రవి, కొట్యాడ సూర్య, మహేష్బాబు, వార్డు నాయకులు పాల్గొన్నారు.
కొత్తగా ఒక్క పింఛన్ ఇచ్చిందా?
తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు మాట్లాడుతూ.. ‘సూపర్ సిక్స్ సహా 143 హామీలిచ్చి అధికారంలోకి వచ్చి.. ఇప్పుడు మోసం చేసినందుకే ఇది వెన్నుపోటు ప్రభుత్వం. మూడు లక్షల పింఛన్లు తొలగించి, కొత్తగా ఒక్క పింఛను అయినా ఇచ్చిందా? రాష్ట్రవ్యాప్తంగా విజయవంతమైన ఈ కార్యక్రమం కూటమి ప్రభుత్వ పతనానికి తొలి అడుగు’ అని అన్నారు.
విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో
మాజీ ఎమ్మెల్యే, సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది. గాజువాక పాత చెక్పోస్టు ప్రాంతం నుంచి ప్రారంభమై శాంతిగిరి కాలనీ, ములగాడ హౌసింగ్ కాలనీ మీదుగా ములగాడ తహసీల్దార్ కార్యాలయం వరకూ ఈ ర్యాలీ సాగింది. అక్కడ ఆర్ఐ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి దొడ్డి కిరణ్, నియోజకవర్గ మహిళా విభాగం ఇన్చార్జి పేడాడ జ్యోత్స్న, జిల్లా అధికార ప్రతినిధి ఆల్ఫా కృష్ణ, ఎస్సీ సెల్ నాయకులు మల్లేశ్వరరావు, రాష్ట్ర మహిళా కార్యదర్శి చుక్కా వరలక్ష్మి, కార్పొరేటర్లు పి.వి.సురేష్ బల్లా లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
గాజువాక నియోజకవర్గంలో
గాజువాక సమన్వయకర్త దేవన్రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పాతగాజువాక జంక్షన్ నుంచి నేషనల్ హైవే మీదుగా చినగంట్యాడ 100 అడుగుల రోడ్డులోని తహసీల్దార్ కార్యాలయం వరకూ ఈ ర్యాలీ సాగింది. తహసీల్దార్ తోట శ్రీవల్లికి వినతిపత్రం అందజేశారు. మాజీ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, చింతలపూడి వెంకట్రామయ్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఉరుకూటి అప్పారావు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఉరుకూటి చందు, కార్పొరేటర్లు ఇమ్రాన్, భూపతిరాజు సుజాత తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు.
పెందుర్తి నియోజకవర్గంలో
పెందుర్తి మాజీ ఎమ్మెల్యే, సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్రాజ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాంపురం నుంచి పెందుర్తి జూనియర్ కళాశాల వరకూ బైక్లు, కార్లతో ర్యాలీగా తరలివచ్చారు. అక్కడ నుంచి వేంకటేశ్వరస్వామి ఆలయ రోడ్డు, బీఆర్టీఎస్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకూ ర్యాలీ గా సాగారు. ముఖ్య నేతలు బి.భగవాన్ జైరాం, పైలా శ్రీనివాసరావు, కొటాన రాము, జెడ్పీటీసీ సభ్యుడు పి.ఎస్.రాజు, ఎంపీపీలు. నేతలు హాజరయ్యారు.
సంపద సృష్టి పేరుతో మోసం
రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు మాట్లాడుతూ.. ‘వెన్నుపోటు దినం’.. రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వా న్ని గద్దె దించేందుకు ఒక మలుపు అవుతుంది. కూటమి ఏడాది పాలనలో మోసాలు, దౌర్జన్యా లు, అవినీతి, దోపిడీలు తప్ప మరేమీ లేవు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకూ ప్రతిపక్షంగా పోరాడుతూనే ఉంటాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా చంద్రబాబు అమలుకాని హామీలిచ్చారు. సంపద సృష్టిస్తానంటూ ప్రజలను మోసం చేశారు’ అని విమర్శించారు. బాబూ మీ కుమారుడు లోకేష్కు సంపద సృష్టిస్తున్నావా? అని ప్రశ్నించారు.
విశాఖ నగరంపై చిన్నచూపు
పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు మాట్లాడుతూ.. ‘అన్ని వర్గాలను దగా చేసిన చంద్రబాబు, మంత్రి లోకే‹Ù, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పుడేమి సమాధానం చెబుతారు. యువగళంలో లోకేష్ ఇచ్చిన యువతకు జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి హామీలు ఏమయ్యాయి. వెనుకబడిన ఉత్తరాంధ్రను కూటమి నేతలు దోచుకుంటున్నారు. విశాఖ నగరంపై చిన్నచూపు చూస్తున్నారు. అమరావతి భ్రమలో ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారు. సొంత మామనే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు ప్రజలను వెన్నుపోటు పొడవడం పెద్ద లెక్క కాదు! గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రతీ హామీని అమలు చేసింది. ఈ ప్రభుత్వం వలంటీర్ వ్యవస్థను నిరీ్వర్యం చేసింది. రైతులను అప్పుల పాల్జేసింది. వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమానికి వచ్చిన స్పందన.. కూటమి ప్రభుత్వ పతనానికి నాందిగా మారుతుంది’ అని అన్నారు.
చంద్రబాబు ఫెయిల్యూర్ సీఎం
మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ.. ‘సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు హయాంలో రాష్ట్ర జీడీపీ 3.8 శాతానికి పడిపోయింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇది 8.9 శాతంగా ఉండేది. ఇది చాలదా చంద్రబాబు ఫెయిల్యూర్ సీఎం అని చెప్పడానికి.? గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.2.75 లక్షల కోట్లను సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు అందించింది. ప్రస్తుతం చంద్రబాబు కూటమి నేతల జేబులు నింపుతున్నారు. పవన్ కల్యాణ్ సిని మా ప్రపంచం నుంచి ఇంకా బయటకు వచ్చినట్లు లేరు. ఏడాది పాలనలో మోసాలు, దౌర్జన్యాలు జరిగితే.. అట్టర్ ప్లాప్ సిని మా(ఏడాది పాలన)కు బాణసంచా కాల్చి పండగ చేసుకోవా లని పిలుపునివ్వడం ఆశ్చర్యంగా ఉంది’ అని ఎద్దేవా చేశారు.
ప్రజలే చీపుర్లతో పండగ చేస్తారు
పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురా లు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ.. ‘కూటమి ఏడాది పాలనలో మోసా లు, మహిళలపై దాడులు పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో పండగలు నిర్వహిస్తారా? మ్యానిఫెస్టో పట్టుకుని ప్రజల ముందుకు వెళితే వారే చీపుర్లు, గరిటెలతో మీకు అన్ని పండగలు చేస్తారు. మహిళల భద్రతను గాలికొదిలేశారు. రైతులను అప్పుల ఊబిలోకి నెట్టారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు’ అని ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించిన సుపరిపాలన కాదని.. ప్రజలు తప్పుడు హామీలకు మోసపోయారని కల్యాణి ఆవేదన వ్యక్తం చేశారు.
భీమిలి నియోజకవర్గంలో
భీమిలి సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది. భీమిలి వుడా మినీ స్టేడియం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పోలీస్స్టేషన్, మెయిన్ రోడ్డు, గంట స్తంభం మీదుగా నూకాలమ్మ ఆలయం వరకు ర్యాలీ సాగింది. అక్కడ వేదిక వద్ద శ్రీనివాసరావు ప్రసంగించారు. అనంతరం భీమిలిలోని ఆర్డీవో కార్యాలయంలో ఏవో మనోరంజినికి వినతిపత్రం సమర్పించారు. ఈ నిరసన ర్యాలీకి నియోజకవర్గం నలుమూలల నుంచి వందలాది ఆటోలు, 100 కార్లు, 1000 బైక్లతో భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివచ్చారు. జెడ్పీ వైస్ చైర్మన్ సుంకరి గిరిబాబు, ముఖ్య నేతలు దాట్ల పెదబాబు, చెన్నాదాస్, ఎంపీపీలు దంతులూరి వాసురాజు, కె.రాంబాబు, మజ్జి వెంకట్రావ్, పోతిన హనుమంతురావు, అక్కరమాని రామునాయుడు, గండిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.