AP: మూడు విడతల్లో రూ.19,178.17 కోట్లు 

Today is the third tranche of YSR Asara - Sakshi

78.94 లక్షల మంది ‘వైఎస్సార్‌ ఆసరా’ లబ్ది దారులకు సీఎం జగన్‌ లేఖలు 

నేడు వైఎస్సార్‌ ఆసరా మూడో విడత సాయం 

చంద్రబాబు రుణమాఫీ మోసంతో డ్వాక్రా మహిళల కష్టాలు కళ్లారా చూశా 

ఇది మాటల ప్రభుత్వం కాదు.. చేతల్లో చూపిస్తున్నాం 

మూడున్నరేళ్లలో 98.5 శాతం హామీలు అమలు చేశాం 

సాక్షి, అమరావతి: మూడున్నరేళ్లలోనే 98.5 శాతం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఏకైక  ప్రభుత్వం తమదని ముఖ్యమంత్రి       వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. చంద్రబాబు మాదిరిగా తమది మాటల ప్రభుత్వం కాదని, చెప్పింది చేసి చూపించే చేతల ప్రభుత్వమన్నారు. 2019 ఎన్నికల నాటికి అక్కచెల్లెమ్మలకు పొదుపు సంఘాల పేరిట ఉండే రుణాల మొత్తాన్ని నాలుగు దఫాల్లో నేరుగా వారి చేతికే అందిస్తానని మాట ఇచ్చి అమలు చేస్తున్నామని గుర్తుచేశారు.

‘వైఎస్సార్‌ ఆసరా’ పథకం ద్వారా మూడో విడత సాయాన్ని శనివారం విడుదల చేయనున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 78.94 లక్షల మంది మహిళా లబ్ధిదారులకు ముఖ్యమంత్రి జగన్‌ లేఖలు రాశారు. పది రోజుల పాటు జరిగే ‘ఆసరా’ పంపిణీ ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని లబ్ది దారులకు సీఎం లేఖలను నేరుగా అందజేస్తారని అధికారులు తెలిపారు. పొదుపు మహిళలకు ముఖ్యమంత్రి జగన్‌ వ్యక్తిగతంగా రాసిన లేఖ సారాంశం ఇదీ...  

వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా మూడో సంవత్సరం కూడా పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని ఎంతో సంతోషంగా తెలియచేస్తూ అక్క చెల్లెమ్మలందరికి హృదయపూర్వక అభినందనలతో ఈ లేఖ రాస్తున్నా. మేనిఫెస్టో అంటే అంకెల గారడీ కాదు. మేనిఫెస్టోను పవిత్రమైన భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లా భావించి హామీల అమలుకు క్యాలెండర్‌ను ముందే ప్రకటించి 98.5 శాతం నెరవేర్చిన ఏకైక  ప్రభుత్వం మనది.  

♦ డ్వాక్రా రుణాల మాఫీ పేరుతో గత చంద్రబాబు సర్కారు మోసగించడంతో రుణభారం తడిసి మోపెడై అక్కచెల్లెమ్మలు దయనీయమైన పరిస్థితుల్లో కూరుకుపోయారు. మహిళా సంఘాలు ఛిన్నాభిన్నమై ‘ఏ’ గ్రేడ్‌లో ఉన్న సంఘాలు కూడా ‘సి’, ‘డి’ గ్రేడ్‌లోకి పడిపోయాయి.         

♦   స్వయం సహాయక సంఘాల మహిళల ఆ ర్థిక ఇబ్బందులను నా 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో చూసి చలించిపోయా. ఎస్‌ఎల్‌బీసీ తుది జాబితా ప్రకారం ఎన్నికల రోజు వరకు 7.98 లక్షల మహిళా సంఘాలలోని 78.94 లక్షల మంది పొదుపు అక్కచెల్లెమ్మలకు ఉన్న అప్పు నిల్వ రూ.25,571 కోట్లను నాలుగు దఫాలుగా నేరుగా చెల్లించాలని నిర్ణయించి నవరత్నాల పథకంలో చేర్చాం. 2016లో రద్దయిన సున్నావడ్డీ పథకాన్ని కూడా పునరుద్ధరించాం. 

 మీ జీవితాల్లో మరిన్ని కాంతులు తీసుకొచ్చి సుస్థిర ఆదాయం, వ్యాపారం, జీవనోపాధి అవకాశాలకు ఈ డబ్బును వినియోగించుకుని ఆర్థికంగా ఎదిగి అక్కచెల్లెమ్మలు లక్షాధికారులు కావాలనే మంచి ఆలోచనతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం. 

♦  అక్కచెల్లెమ్మలను సొంత కాళ్లపై నిలదొక్కుకునేలా ప్రోత్సహిస్తూ జీవనోపాధి మెరుగుపరచుకునేలా గతేడాది అమూల్, హిందూస్తాన్‌ యూనిలీవర్, ఐటీసీ, ప్రాక్టర్‌ అండ్‌ గ్యాంబల్, అలానా లాంటి వ్యాపార దిగ్గజాలతో ఒప్పందాలు చేసుకుని బ్యాంకుల నుంచి తోడ్పాటు అందిస్తున్నాం. ఈ ఏడాది అజియో–రిలయన్స్, గ్రామీణ వికాసకేంద్రం, టేనేజర్, మహేంద్ర–ఖేతి లాంటి బహుళ జాతి సంస్థలతో ఒప్పందాల ద్వారా వ్యాపార మార్గాలు చూపించి ఆసరా, చేయూత, సున్నా వడ్డీ పథకాలతో సుస్థిర ఆ ర్థికాభివృద్ధికి బాటలు వేశాం.    

 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ సాధికారతతో ఆంధ్రప్రదేశ్‌లోనే ఆవిర్భవించేలా ప్రోత్స­హిస్తున్నాం. మహిళా పక్షపాత ప్రభుత్వంగా అక్క చెల్లెమ్మల జీవితాల్లో ఆ ర్థిక, సామాజిక, రాజకీయ చైతన్యానికి కృషి చేస్తున్న మన ప్రభుత్వానికి ఎల్లప్పుడూ మీ అండదండలు ఉండాలని.. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ దేవుడి చల్లని ఆశీస్సులు లభించాలని నిండు మనసుతో కోరుకుంటున్నా. 

నేడు ఏలూరు జిల్లాకు సీఎం జగన్‌
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఏలూరు జిల్లా దెందులూరులో పర్యటించనున్నారు. ఉదయం 10గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి 10.30 గంటలకు దెందులూరు చేరుకుంటారు. 10.50 నుంచి 12.35 గంటల మధ్య దెందులూరులో బహిరంగ సభలో పాల్గొని వైఎస్సార్‌ ఆసరా ఆర్థిక సాయాన్ని విడుదల చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 1.05 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1.35 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.  

ఎలాంటి షరతులు లేవు.. ఎలా ఉపయోగించుకున్నా సరే 
అక్కచెల్లెమ్మలకు అందచేస్తున్న ఈ మొత్తాన్ని ఎలా వినియోగించుకుంటారనే అంశంపై ఎ­లాం­టి షరతులు లేవు. మన ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ కుటుంబ ఆదాయాలను పెంచుకుని మీరు సంతోషంగా ఉండాలి. మీ కుటుంబ ఆదాయం పెరగటం వల్ల రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుతుంది. తద్వారా రాష్ట్రాభివృద్ధిలో మీరు భాగస్వాములు కాగలుగుతారు.

ప్రభుత్వానికి ఎన్ని సమస్యలున్నా భరిస్తూ ఇచ్చిన మాటమేరకు మీ తోబుట్టువుగా ఈ కార్యక్రమాలను అమలు చేస్తున్నా. జగనన్న పాలనలో రాజన్న రాజ్యం చూడాలన్న మీ కోరికను నెరవేర్చే దిశగా నా ప్రతి అడుగు  వేస్తున్నా. మీ అందరి ఆశీస్సులు నాతోపాటే ఉంటాయన్న ధైర్యంతో ముందుకు సాగుతున్నా.  

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అక్షరాలా పాటిస్తూ ఇప్పటికే మొదటి విడతగా రూ.6,318.76 కోట్లు చెల్లించాం. తద్వారా 78.76 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు లబ్ధి చేకూరింది. రెండో విడతగా 78.76 లక్షల మందికి మరో రూ.6,439.52 కోట్లు చెల్లించాం. ఇప్పుడు మళ్లీ అక్కచెల్లెమ్మలకు మరో రూ.6,419.89 కోట్లు మూడో విడతగా అందచేయనున్నాం. తద్వారా మూడు విడతలలో మొత్తం రూ.19,178.17 కోట్ల మేర 78.94 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ప్రయోజనం చేకూరుతోంది. 

అమ్మ కడుపులోని బిడ్డ నుంచి ఆప్యాయంగా ఆశీర్వదించే అవ్వ దాకా ప్రతి ఒక్కరి అవసరాలను గుర్తించి తగిన పథకాలను అమలు చేస్తూ మహిళాభివృద్ధి ద్వారానే మన కుటుంబాభివృద్ధి జరుగుతుందని గట్టిగా విశ్వసిస్తున్నాం. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, చేయూత, సున్నా వడ్డీ, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, కళ్యాణమస్తు, ఇళ్ల పట్టాలు అక్కచెల్లెమ్మల పేరుతో ఇస్తున్నాం. అన్ని నామినేషన్‌ పోస్టులు, నామినేటెడ్‌ పనుల్లో మహిళలకు 50 శాతం కేటాయిస్తూ చట్టం చేశాం. వృద్ధాప్య, వితంతు పింఛన్లు, మహిళల రక్షణ కోసం దిశ బిల్లు, దిశ యాప్, దిశ పోలీస్‌ స్టేషన్లు లాంటి ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top