రెండేళ్లుగా వ్యభిచార కూపంలోకి దించారు
హోం మంత్రి అనితని మూడు సార్లు కలిశా
పవన్ కళ్యాణ్ను కలవనివ్వడం లేదు
తిరుపతికి చెందిన మహిళ ఆవేదన
సాక్షి, అమరావతి: రెండేళ్లుగా తన కుమార్తెను వ్యభిచార కూపంలోకి దించారని తిరుపతికి చెందిన ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ సచివాలయంలో బుధవారం హోం మంత్రి అనితను కలిసి సమస్యలను వివరించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, పోలీసు అధికారులు, ఉన్నతాధికారులను ఎంత వేడుకున్నా స్పందన లేదని బాధిత మహిళ వాపోయారు. గురువారం మరోసారి తనను కలవాలని, దర్యాప్తు చేయిస్తామని హోం మంత్రి అనిత చెప్పి వెళ్లిపోయారు.
అనంతరం బాధిత మహిళ బోరున విలపిస్తూ తన కూతురిని నరకకూపం నుంచి ఎవరూ కాపాడటం లేదంటూ కన్నీరుమున్నీరయ్యారు. ఇప్పటికే హోం మంత్రిని మూడుసార్లు కలిశానని, ఎప్పుడు కలిసినా చూస్తాం.. చేస్తాం అనడమేగాని ఇంత వరకూ న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కలిసి తన కుమార్తెని ఇంటికి తీసుకురావాల్సిందిగా వేడుకోవాలని ప్రయత్నిస్తున్నా ఫలితం లేదన్నారు. ఎంతో కష్టపడి కూతురిని చదివించుకున్నానని, కానీ వ్యభిచార కూపంలోకి తోసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురిని అప్పగించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.


