కోవిడ్‌ కట్టడికి త్రిముఖ వ్యూహం

A three-pronged strategy for Covid Prevention In AP - Sakshi

నిరంతర పర్యవేక్షణకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ కమిటీ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా నియంత్రణ, నివారణకు ఆది నుంచి పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్న ప్రభుత్వం ఈ ప్రక్రియలో మరో ముందడుగు వేసింది. కోవిడ్‌ ఆస్పత్రులు (ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రభుత్వం టేకోవర్‌ చేసిన ప్రై వేట్‌ ఆస్పత్రులు, కోవిడ్‌ చికిత్స చేస్తున్న ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు) వద్ద మంచి వైద్యం, ఆక్సిజన్, ఆహారం, మందులు, నీరు, పారిశుద్ధ్యం లాంటివి సక్రమంగా ఉన్నాయా? లేవా? అన్నవి చూడడం, కోవిడ్‌ రోగులకు పడకల కేటాయింపు, 104 కాల్‌సెంటర్‌ ద్వారా ఆశిస్తున్న సేవలు అందుతున్నాయా? లేదో పర్యవేక్షించడం, ఎక్కడా లోపాలు లేకుండా చేసేందుకు తాజాగా మూడంచెల వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. కోవిడ్‌ పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఉన్నతాధికారులతో సమీక్షించిన అనంతరం ఈ మేరకు రెండు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

మూడంచెల వ్యవస్థ..
జిల్లా స్థాయి మొదలు రాష్ట్ర స్థాయి వరకు పని చేసేలా మూడంచెల వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తద్వారా ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఎక్కడా నిర్దేశిత రుసుము కంటే అధికంగా వసూలు చేయకుండా కట్టడి చేయనున్నారు. వైద్య సేవలనూ నిరంతరం çపర్యవేక్షించనున్నారు.

క్లస్టర్లుగా కోవిడ్‌ ఆస్పత్రులు..
జిల్లాలో కోవిడ్‌ ఆస్పత్రులన్నింటినీ క్లస్టర్లుగా విభజిస్తారు. ప్రతి క్లస్టర్‌లో 5 నుంచి 8 ఆస్పత్రులుంటాయి. ఒక్కో క్లస్టర్‌కు జిల్లా స్థాయి అధికారిని ఇన్‌చార్జ్‌గా కలెక్టర్‌ నియమిస్తారు. సంబంధిత అధికారి తరచూ ఆ ఆస్పత్రులను సందర్శించి నిఘా ఉంచుతారు. ఏ ప్రైవేట్‌ ఆస్పత్రిలోనూ నిర్దేశించిన ఫీజుల కన్నా అధికంగా వసూలు చేయకుండా పర్యవేక్షిస్తారు. ఫిర్యాదులపై వేగంగా స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటారు. క్లస్టర్‌ పరిధిలో అనుమతి లేకుండా కోవిడ్‌ చికిత్స చేసే ఆస్పత్రులపైనా కన్నేసి ఉంచుతారు.    

ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌..
ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఎక్కువ ఫీజులు వసూలు చేయకుండా నియంత్రణ, తనిఖీల కోసం జిల్లా స్థాయిలో ఒక ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ను కలెక్టర్‌ ఏర్పాటు చేస్తారు. ఔషథ నియంత్రణ విభాగం అధికారితో పాటు విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం నుంచి ఒకరు, వైద్య ఆరోగ్య «శాఖ నుంచి మరొక అధికారి అందులో సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా వైద్య సేవలు అందించడంతో పాటు ఎక్కడా అధికంగా వసూలు చేయకుండా స్క్వాడ్‌ తరచూ తనిఖీలు నిర్వహిస్తుంది. క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌లు మరింత సమర్థంగా పనిచేసేలా ఈ స్క్వాడ్‌ సహాయ సహకారాలు అందిస్తుంది. ఈ నేపథ్యంలో వెంటనే క్లస్టర్లు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో నిర్దేశించింది.

రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్‌ కమిటీ..
క్లస్టర్లు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు రాష్ట్రస్థాయిలో సీనియర్‌ అధికారులతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఏర్పాటైంది. ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్‌ కమిటీలో రాష్ట్ర కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఔషధ నియంత్రణ విభాగం డైరెక్టర్‌ జనరల్‌ రవిశంకర్‌ సభ్యులుగా ఉన్నారు.

జేసీకి కోవిడ్‌ బాధ్యతలు.. 
జిల్లాలో జాయింట్‌ కలెక్టర్‌ (గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ద్ధి)కు కోవిడ్‌–19కి సంబంధించి పూర్తి బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆ జేసీ ఇప్పుడు పర్యవేక్షిస్తున్న బాధ్యతలను ఇతర జేసీలకు అప్పగించాలని ఆదేశించింది. కోవిడ్‌–19 బాధ్యతలు నిర్వర్తించే జేసీ విధులను కూడా నిర్దేశిస్తూ ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది

కోవిడ్‌–19 జేసీ విధులు ఇవీ.. 
అన్ని ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు కోవిడ్‌ చికిత్స అందించే ఆరోగ్యశ్రీ జాబితాలోని ఆస్పత్రుల్లో (కోవిడ్‌ ఆస్పత్రులు) శానిటేషన్, మంచి ఆహారం, వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బంది, హెల్ప్‌ డెస్క్‌లను పర్యవేక్షించాలి. సీసీ టీవీ కెమెరాల ద్వారా ఆరోగ్యమిత్రల పనితీరును గమనించాలి. కాల్‌సెంటర్‌తో సమన్వయంతో వ్యవహరిస్తూ ఎప్పటికప్పుడు అన్నీ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి. రోగులకు సంబంధించిన సమాచారాన్ని వారి కుటుంబ సభ్యులకు చేరవేసేలా చూడాలి. 104 కాల్‌ సెంటర్‌ (జిల్లా కంట్రోల్‌ రూమ్‌)కు సంబంధించిన పూర్తి బాధ్యతలు తీసుకోవాలి. ప్రతి కాల్‌కు జవాబుదారీగా ఉంటూ కాల్‌సెంటర్‌ మరింత సమర్థంగా పని చేసేలా చర్యలు చేపట్టాలి. వీటితోపాటు డేటా అప్‌డేషన్‌తో సహా ఆస్పత్రుల మేనేజ్‌మెంట్‌ బాధ్యతను కూడా జేసీకి అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకున్న చర్యలివీ..
కోవిడ్‌ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసదుపాయాల కల్పనతో పాటు కోవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయడం, హోం క్వారంటైన్, హోం ఐసొలేషన్‌లో ఉన్న వారికి కూడా ప్రభుత్వం వైద్య సదుపాయం కల్పిస్తోంది. అవసరమైన వారందరికీ కోవిడ్‌ కిట్‌లు అందజేస్తోంది. పాజిటివ్‌ వచ్చిన వారి ప్రైమరీ కాంటాక్ట్‌లను టెస్ట్‌ చేయడంతో పాటు పరీక్షలకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారందరికీ తప్పనిసరిగా నిర్వహించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. కోవిడ్‌ టెస్టు చేయించుకున్న 24 గంటలలోపే ఫలితాన్ని అందించడంతో పాటు టెస్టుల సంఖ్య పెంచాలని సీఎం ఆదేశించారు.

ఆస్పత్రుల్లో ప్రమాణాలు.. ఫీజులకు కళ్లెం..
విరివిగా పరీక్షలు (ఫోకస్డ్‌ టెస్టింగ్‌) చేయడం, కోవిడ్‌పై ప్రజల్లో మరింత అవగాహన కల్పించడం, కోవిడ్‌ ఆస్పత్రుల్లో సీసీ టీవీలు, హెల్ప్‌ డెస్క్‌ల ఏర్పాటుతో పాటు శానిటేషన్, నాణ్యమైన ఆహారం, వైద్యులు, మందులు, ఆక్సిజన్‌ సరఫరాను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సీఎం నిర్దేశించారు. అదనంగా ఆక్సిజన్‌ ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటుతో పాటు కోవిడ్‌ ఆసుపత్రుల్లో క్షణం కూడా కరెంట్‌ పోకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. సీటీ స్కాన్‌కు రూ.3 వేలకు మించి వసూలు చేయరాదని, ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌కు రూ.499కి మించి వసూలు చేయరాదని ఆదేశించి ఫీజుల ధరలకు కళ్లెం వేసింది. అంతకు మించి వసూలు చేస్తే ఆ డయాగ్నస్టిక్‌ సెంటర్లు, ల్యాబ్‌ల రిజిస్ట్రేషన్‌ రద్దు చేస్తామని హెచ్చరించింది.

శరవేగంగా వైద్యుల నియామకం...
కోవిడ్‌ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని 1,170 మంది స్పెషలిస్ట్‌ డాక్టర్లతో పాటు మరో 1,170 మంది జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్లు. 2 వేల మంది స్టాఫ్‌నర్సులు, 306 మంది అనస్థీషియా టెక్నీషియన్లు, 330 మంది ఎఫ్‌ఎన్‌వోలు, 300 మంది ఎంఎన్‌వోలు, 300 మంది స్వీపర్ల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top