చండీగఢ్ నుంచి కులు వరకు మూడ్రోజుల రైడ్
విభిన్న వాతావరణ పరిస్థితుల నడుమ డ్రీమ్ డెస్టినేషన్
సాహస యాత్రలో బైకర్లకు ప్రతి మలుపూ ఓ సవాలే
సాక్షి, అమరావతి: రయ్ రయ్ మంటూ దూసుకెళ్లే బుల్లెట్ ధగ్.. ధగ్ మంటూ వచ్చే శబ్దం.. ఒళ్ళు గగుర్పొడిచే హిమాలయ ఘాట్ రోడ్లు.. ఒకవైపు కురుస్తున్న వర్షం, మరోవైపు పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. వీటన్నింటినీ తట్టుకుంటూ అంతర్జాతీయ బైకర్ల దినోత్సవం (జూన్ 21) సందర్భంగా ‘రాయల్ ఎన్ఫీల్డ్’ నిర్వహించిన ప్రత్యేక బుల్లెట్ రైడ్ సాహసోపేతంగా సాగింది. ఎంపిక చేసిన 25 మంది బైకర్లతో ఈ నెల 18న చండీగఢ్లో ప్రారంభమైన ఈ యాత్ర.. ప్రకృతి సవాళ్లను అధిగమిస్తూ మూడు రోజుల పాటు సాగి కులు వద్దకు విజయవంతంగా చేరుకుంది.
ఈ రైడ్ సిమ్లా మీదుగా, అత్యంత ప్రమాదకరమైన ‘థియాంగ్’ ఘాట్ రోడ్ల గుండా మొత్తం మూడు రోజుల్లో ఈ బైకర్లు సుమారు 650 కిలోమీటర్ల మేర ప్రయాణించారు. ఈ ప్రయాణంలో ప్రతి కిలోమీటరు ఒక కొత్త సవాలును విసిరింది. అకస్మాత్తుగా కురిసిన వర్షం, క్షణక్షణానికీ పడిపోతున్న ఉష్ణోగ్రతల వల్ల వణుకు పుట్టించే చలి ఎదురైనా, బైకర్లు వెనకడుగు వేయకుండా ముందుకు సాగారు. థియాంగ్ పట్టణానికి 35 కిలోమీటర్ల దూరంలో అత్యంత ప్రమాదకరమైన హిమాలయ ఘాట్ రోడ్ల చివరన ఉండే ‘ఘనియల్’ అనే లోయల్లో ఉన్న గ్రామానికి బైకర్లు ప్రత్యేక రైడ్ నిర్వహించారు.
ఈ గ్రామంలో రాయల్ ఎన్ఫీల్డ్ తన సోషల్ మిషన్ ద్వారా పశ్చిమ హిమాలయ రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, లద్దాఖ్, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్కు చెందిన యువతకు అద్భుతమైన ఉచిత శిక్షణ ఇస్తోంది. ఫిల్మ్ మేకింగ్, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులపై అవగాహన, సుస్థిర జీవనోపాధి వంటి అంశాలలో స్థానిక యువతకు ఉపాధి శిక్షణ ఇస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ఈ కేంద్రాన్ని సందర్శించిన బైకర్లు, అక్కడి నుంచి 90 కి.మీ దూరం తోటల మధ్య ప్రయాణిస్తూ తిరిగి థియాంగ్ పట్టణానికి, అక్కడి నుంచి 205వ నంబర్ జాతీయ రహదారిపై కులు చేరుకున్నారు.
బైకర్ల స్వర్గధామం హిమాచల్ప్రదేశ్కు ఎందుకింత క్రేజ్?
అంతర్జాతీయ బైకర్ల దినోత్సవాన (సంవత్సరంలోనే అత్యంత పొడవైన పగటి సమయం ఉన్న రోజు) జరుపుకుంటారు. లాంగ్ రైడ్స్ ఇష్టపడేవారికి ఈ రోజు ఎంతో ప్రత్యేకం. మరి అలాంటి బైకర్లందరికీ హిమాచల్ప్రదేశ్ ‘డ్రీమ్ డెస్టినేషన్’. దేశంలో అత్యధిక బైకర్స్ వెళ్లే లద్దాఖ్ తరవాత హిమాచల్ప్రదేశ్కే వస్తారు. అధికారికంగా పర్యాటకుల సంఖ్య కోట్లలో ఉన్నప్పటికీ, కేవలం సాహసయాత్రలు, బైక్ రైడింగ్ కోసమే దేశ విదేశాల నుంచి ఏటా సుమారు 2.5 లక్షల మంది బైకర్లు హిమాచల్ మీదుగా లద్దాఖ్, స్పితి వ్యాలీలకు క్యూ కడతారు.
ఇక్కడి రోడ్లు మామూలు డ్రైవర్లకు నరకం.. బైకర్లకు స్వర్గం! స్కై–హై పాస్లు (ఎత్తైన పర్వత మార్గాలు), అంధకార ముసుగు లాంటి మలుపులు, రోడ్లపై ప్రవహించే నీరు, కొండచరియలు విరిగిపడే ప్రమాదాలు.. ఇలా ప్రతి మలుపులోనూ అడ్రినలిన్ రష్ ఇచ్చే రోడ్లు ఇక్కడ ఉంటాయి. ఇక్కడి కఠినమైన భౌగోళిక పరిస్థితుల్లో బైక్ నడపడం ప్రతి బైకర్ తన జీవితకాల సాధనగా భావిస్తారు. ఇక్కడి ప్రకృతి అందాలు, కఠినమైన సవాళ్లు ట్రాఫిక్ పెద్ద సవాళ్లు. హిమాచల్ రోడ్లపై వాహనం విజయవంతంగా నడిపితే వారు సూపర్ డ్రైవర్ అనడంలో ఆశ్చర్యం లేదు.


