
ప్రాథమిక, ఎగువ ప్రాథమిక విభాగాల్లో పురుషుల కంటే మహిళా టీచర్లే అధికం
ప్రాథమిక విద్యలో వంద మంది పురుషులకు 136 మంది మహిళలు
ఎగువ ప్రాథమికలో 104 మంది
ప్రాథమిక విద్యలో గత ఆరేళ్లుగా అగ్రస్థానం ఉపాధ్యాయినులదే
మహిళలు–పురుషులు–2024 నివేదిక వెల్లడి
కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల
దేశంలో ప్రాథమిక, ఎగువ ప్రాథమిక విద్యా విభాగాల్లో మహిళా టీచర్లే అధికంగా ఉన్నారు. ప్రాథమిక విభాగంలో గత ఆరేళ్లలో ఈ ఒరవడి మరింత పెరగగా..ఎగువ ప్రాథమిక విద్యా బోధనలో రెండేళ్ల కాలంలో వీరి సంఖ్య పెరిగింది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మహిళలు, పురుషులు–2024 నివేదికలో ఈ విషయం వెల్లడైంది. – సాక్షి, అమరావతి
నాడు 120.. నేడు 136
దేశంలో ప్రాథమిక (1 నుంచి 5వ తరగతి) విద్యా బోధనలో 2018–19లో ప్రతి వంద మంది పురుషులకు 120 మంది మహిళా టీచర్లుండగా 2023–24 నాటికి ఆ నిష్పత్తి 136కు పెరిగింది. ఎగువ ప్రాథమిక (6 నుంచి 8వ తరగతి) విద్యా బోధనలో ప్రతి వంద మంది ఉపాధ్యాయులకు 2018–19లో 93 మంది ఉపాధ్యాయినులుండగా 2023–24 నాటికి ఆ నిష్పత్తి 104కు పెరిగింది. సెకండరీ (9 నుంచి 10 తరగతి)విద్యా బోధనలోనూ గత ఆరేళ్లుగా మహిళా టీచర్ల సంఖ్య పెరుగుతోంది.

2018–19లో సెకండరీ విద్యా బోధనలో వందమంది ఉపాధ్యాయులకు 77 మంది ఉపాధ్యాయినులుండగా, 2023–24 నాటికి ఆ సంఖ్య 87కు పెరిగింది. ఉన్నత సెకండరీ (11,12వ తరగతి) బోధనలో 2018–19లో వంద మంది అధ్యాపకులకు 79 మంది మహిళా అధ్యాపకులుండగా, 2023–24 నాటికి ఆ సంఖ్య 81కు పెరిగింది. దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ బోధనా రంగంలో మహిళల శాతం పెరుగుతోంది. 2018–19లో మొత్తం టీచర్లలో మహిళలు 32.13 శాతం ఉండగా 2019–20లో 33.39 శాతానికి పెరిగింది. అలాగే 2020–21లో 34.49 శాతం మహిళా టీచర్లుండగా 2021–22 నాటికి 35.42 శాతం పెరిగింది.