నోటిఫికేషన్ జారీ చేసిన ఏజీఐసీఎల్
బిడ్ల దాఖలుకు జాయింట్ వెంచర్లకు అవకాశం లేదని నిబంధన
పనులు ఎవరికి దక్కుతాయన్నది ఇప్పటికే నిర్ణయమైపోయిందంటోన్న నిపుణులు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో నేలపాడు సమీపంలో నిర్మిస్తున్న శాశ్వత సచివాలయం టవర్లలో ఎంఈపీ(మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్) పనులకు మూడు ప్యాకేజీల కింద అమరావతి గ్రోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏజీఐసీఎల్) టెండర్లు పిలిచింది. బీ+జీ+39 అంతస్తులతో నిరి్మస్తున్న 1, 2 టవర్లలో ఎంఈపీ పనుల కాంట్రాక్టు విలువను రూ.743.02 కోట్లు.. 2, 3 టవర్లలో ఎంఈపీ పనుల కాంట్రాక్టు విలువను రూ.681.47 కోట్లు, ముఖ్యమంత్రి కార్యాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం బీ+జీ+49 అంతస్తులతో నిరి్మస్తున్న జీఏడీ టవర్లో ఎంఈపీ పనుల కాంట్రాక్టు విలువను రూ.431.59 కోట్లుగా నిర్ణయించింది.
ఇక ఏడు అంతస్తుల(బీ+జీ+7)తో నిర్మిస్తున్న హైకోర్టు భవనం ఎంఈపీ పనుల కాంట్రాక్టు విలువను రూ.365.15 కోట్లు.. మూడు అంతస్తులతో(బీ+జీ+3) నిర్మిస్తున్న అసెంబ్లీ భవనం ఎంఈపీ పనుల కాంట్రాక్టు విలువను రూ.244.26 కోట్లుగా నిర్ణయించింది. విద్యుత్ సౌకర్యం, లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, శానిటరీ పనుల కోసం ఈ టెండర్లు పిలిచింది. బిడ్ల దాఖలుకు మే 5ను తుది గడువుగా నిర్ణయించింది.
మే 11న ఆర్థిక బిడ్ తెరిచి.. ఎల్–1గా నిలిచిన కాంట్రాక్టర్కు మే 18న పనులు అప్పగించేలా షెడ్యూలు రూపొందించింది. జాయింట్ వెంచర్లు(ఒకరు కంటే ఎక్కువ కాంట్రాక్టు సంస్థలు సంయుక్తంగా) టెండర్లలో బిడ్ల దాఖలుకు అర్హత లేదని నిబంధన పెట్టింది. దీన్ని బట్టి చూస్తే.. ఈ పనులను ఎవరికి అప్పగించాలన్నది ఇప్పటికే ఖరారైందని.. టెండర్లు నామమాత్రమేనని ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.


