ఇదీ అచ్చెన్నాయం! 

TDP MLA Acham Naidu Dictatorial Tendency - Sakshi

స్వగ్రామం నిమ్మాడలో అరాచకం

సామాజిక బహిష్కరణల పేరుతో ఆటవికం

ఏళ్ల తరబడి హద్దుల్లేకుండా సాగుతున్న అకృత్యం

తాజాగా కింజరాపు అప్పన్నకు తప్పని అన్యాయం 

తమ మాట కాదంటే కక్ష.. ఎదురుతిరిగినందుకు ఆంక్ష.. కట్టుబాట్లను ధిక్కరించారంటూ వెలి పేరుతో శిక్ష. ఏనాడో పెత్తందారీ రాజ్యంలో కొనసాగిన అకృత్యాలకు సాక్ష్యాలివి. అరాచకాలకు అద్దం పట్టే దారుణాలివి. ఆనాటి దురాగతాలకు తెరపడిందని లోకం భావిస్తూ ఉంటే.. కొన్ని చోట్ల మాత్రం ఇప్పటికీ ఈ పోకడలు కొనసాగుతున్న ఉదంతాలున్నాయి. మన మధ్యే ఉన్న కొందరు తమకెదురు నిలిచిన వారిపై సామాజిక బహిష్కరణ కొరడా ఝుళిపిస్తున్న పరిణామాలు నివ్వెరపరుస్తున్నాయి. కింజరాపు కుటుంబీకుల పిడికిల్లో ఉన్న నిమ్మాడలో ఇటువంటి సంఘటనలు గతంలో సమాజం దృష్టికి వచ్చాయి. తాజాగా.. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో ఎదురుతిరిగిన అప్పన్నకు ఇదే అనుభవాన్ని పెత్తందార్లు రుచి చూపిస్తూ ఉన్నట్లు వస్తున్న వార్తలు అచ్చంగా.. అకృత్యాలకు సాక్ష్యమవుతున్నాయి.   

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు స్వగ్రామంలో ఆటవిక పాలన అమలవుతోంది. తన కబంధ హస్తాల నుంచి గ్రామాలు చేజారిపోకుండా ఉండేందుకు నియంతృత్వ ధోరణిని అవలంబిస్తున్నారు. గ్రామంలో వారికి వ్యతిరేకంగా నిలిస్తే చాలు.. కనిపించకుండా చేయడం లేదంటే సామాజిక బహిష్కరణ చేయడం అలవాటుగా మారిపోయింది. అచ్చెన్న కుటుంబీకులను వ్యతిరేకించిన, ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తులెంతో మంది కనుమరుగయ్యారు. ఆకస్మికంగా మృత్యువాత పడ్డారు. పదుల సంఖ్యలో కుటుంబాలు సామాజిక బహిష్కరణకు గురయ్యాయి. రెండేళ్ల క్రితం వరకు గ్రామ బహిష్కరణల పర్వం నడిచిన నిమ్మాడలో తాజాగా సర్పంచ్‌ ఎన్నికల తర్వాత కూడా అదే సీన్‌ పునరావృతమైంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వారికి పోటీగా నిలిచిన కింజరాపు అప్పన్న ను కూడా సామాజిక బహిష్కరణ చేశారు. అప్పన్నతో ఎవరినీ మాట్లాడనివ్వడం లేదు. కుల వృత్తుల వారిని వెళ్లనివ్వడం లేదు.

దిక్కు లేని హక్కులు.. 
హక్కులకు ఇక్కడ దిక్కు లేకుండా పోతోంది. అచ్చెన్న కుటుంబానికి ఎదురు తిరిగి బహిష్కరణకు గురైన వారి ఇళ్లల్లో చావు పుట్టుకలకు ఎవరూ వెళ్లకూడదు. రజకులు, నాయిబ్రాహ్మణులు వారి పనులు చేయకూడదు. చివరకు వారి పంట పొలాల్లో పనులకు సైతం కూలీలు వెళ్లకుండా చేస్తున్నారు. గ్రామంలో ఉన్న బీడు భూములే అందుకు నిదర్శనం. పంట భూములు ఉన్నప్పటికీ బాధితులు మూడు పూటలా తిండి కోసం విలవిలలాడాల్సిన పరిస్థితులు ఉన్నా యి. సంవత్సరాల తరబడి సుమారు 26 కుటుంబాలపై ఇదే రకంగా కక్ష సాధింపుగా వ్యవహరించారు. తమపై ఎదురు తిరిగితే వారికి ఇదే గతి పడుతుందంటూ చేసి చూపిస్తున్నారు.

భార్య మేనమామతో మొదలై... 
అచ్చెన్నాయుడు భార్య మేనమామ కింజరాపు గణపతి తొలుత సామాజిక బహిష్కరణ ఎదుర్కొన్నా రు. మొదటి నుంచి కాంగ్రెస్‌ వాది అయిన గణపతి తమకు వ్యతిరేకంగా నిలిచారని సామాజిక బహిష్క రణ చేసిన అచ్చెన్న కుటుంబం ఆ తర్వాత వరుసగా 26 కుటుంబాలపై తమ దుశ్చర్యను ప్రదర్శించింది. తాజాగా ఆ జాబితాలో ఇటీవల సర్పంచ్‌ ఎన్నికల్లో అచ్చెన్న కుటుంబానికి వ్యతిరేకంగా పోటీ చేసిన కింజరాపు అప్పన్న చేరారు. ఇప్పటికే మెండ రామ్మూర్తి అనే రైతు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. తన 18 ఎకరాల భూములను అచ్చెన్నాయుడు అండతో సోదరుడు కింజరాపు హరిప్రసాద్‌ తన గుప్పెట్లో పెట్టుకున్నాడు.

తాను చెప్పిన ధరలకు భూములు అమ్మకాలు చేయాలనే జారీ చేసిన హుకుంను తిరస్కరించాడనే కక్షతో సుమారు 12 ఏళ్లుగా రామ్మూర్తి కి చెందిన భూములను కొర్నుగా మార్చేశారు. రా మ్మూర్తి చిన్న కుమారుడు మెండ హరిని తన గుప్పె ట్లో పెట్టుకుని రామ్మూర్తిని చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. మరో కుమారుడు గ్రామాన్ని వదిలి పో యే విధంగా అతనిపై దౌర్జన్యాలకు పాల్పడ్డాడు. తాజాగా కింజరాపు అప్పన్నకు అదే పరిస్థితిని తీసుకొచ్చారు. నాయీ బ్రాహ్మణులు, రజకులెవరూ వారికి ఇంటికి వెళ్లొద్దని, పొలం పనులు చేయవద్దని కూలీలకు కూడా వార్నింగ్‌ ఇచ్చారు. దీంతో రెండెకరాల మినప చేనును పొలంలో వదిలేసిన దుస్థితి చోటు చేసుకుంది. పొలంలోకి ట్రాక్టర్‌ను కూడా వెళ్లనివ్వకుండా తనకు ముందున్న పొలాల రైతులకు హకుం జారీ చేశారు. అప్పన్న పొలానికి ముందు కంచె వేసేయాలని రైతులను ఆదేశించారు.
చదవండి:
అచ్చెన్న ‘రాజ్యం’లో అరాచకం 
కుప్పం పర్యటన: చంద్రబాబుకు ఊహించని దెబ్బ..

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top