రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు.. మధిర సహాన తల్లిదండ్రులు | Tdp Leader Naveen Attack On Young Women In Tenali | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు.. మధిర సహాన తల్లిదండ్రులు

Oct 20 2024 7:59 PM | Updated on Oct 20 2024 7:59 PM

Tdp Leader Naveen Attack On Young Women In Tenali

సాక్షి,అమరావతి : అధికార టీడీపీకి చెందిన నేత, రౌడీషీటర్ నవీన్ ఓ గుండె కోతను మిగిల్చాడు. నవీన్‌ చేతిలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మధిర సహాన ఆరోగ్యం విషమంగా మారింది. వెంటిలేటర్ తీసేస్తే మధిర సహన చనిపోతుందని డాక్టర్లు చెప్పడంతో బాధితురాలి తల్లిదండ్రులు దిక్కుదోచని స్థితిలో గుండెలవిసేలా రోదిస్తున్నారు.

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మధిర సహాన ఆస్పత్రిలో నర్సుగా విధులు నిర్వహిస్తుంది. ఈ తరుణంలో శనివారం సాయంత్రం కొల్లిపర మండలం వల్లభాపురానికి చెందిన టీడీపీ నేత,రౌడీ షీటర్‌ నవీన్..మధిర సహానను కారులో తీసుకెళ్లాడు. అనంతరం కొన్ని గంటల తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లిన సహానను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాడు. బాధితురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.

కుమార్తె ఆస్పత్రిలో ఉందనే సమాచారం కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. అప్పటికే బ్రెయిన్‌ డెడ్‌ అయ్యి ఉన్న కుమార్తెను బతికించుకునేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. నాలుగు ఆస్పత్రులు తిరిగినా లాభం లేకపోవడంతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలికి చికిత్స అందిస్తుండగా.. వెంటిలేటర్‌ తీస్తే ప్రాణాలు పోతుందని వైద్యులు చెప్పారు. దీంతో ఏం చేయాలో పాలుపోక కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనలో నిందితుడు నవీన్‌కు కఠిన శిక్ష విధించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ సందర్భంగా మధిర సహాన కుటుంబ సభ్యులు మాట్లాడుతూ..‘రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. మా కుమార్తె మధిర సహానాను దారుణంగా కొట్టారు. ఒంటినిండా గాయాలు ఉన్నాయి. నిందితులు దాడి చేయడంతో మా కుమార్తెకు బ్రెయిన్ డెడ్‌ అయ్యింది. వెంటిలేటర్ తీసేస్తే ఆమె చనిపోతుందని డాక్టర్లు చెప్తున్నారు. ఈ దారుణానికి కారణమైన రౌడీషీటర్ నవీన్‌ను కఠినంగా శిక్షించాలి. నవీన్‌తో పాటు మరో ఇద్దరు ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి’ రోదిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement