
పిఠాపురం: కాకినాడ జిల్లా తాటిపర్తికి చెందిన టీడీపీ జన్మభూమి కమిటీ సభ్యుడు నున్న సత్యనారాయణకు చేనేత పింఛన్, ఆయన మనవరాలికి దివ్యాంగ పింఛన్ వచ్చింది. ఎమ్మెల్యే పెండెం దొరబాబు బుధవారం పింఛన్లు అందించారు. తొలిసారి పింఛన్ అందుకున్న సత్యనారాయణ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సీఎం వైఎస్ జగన్ దయ వల్లే తనకు పింఛన్ రావడంతో పాటు తన మనవరాలు వైకల్యాన్ని జయించిందన్నారు.
‘నా మనవరాలు లిఖితశ్రీ పుట్టుక నుంచే దివ్యాంగురాలు(మూగ, చెవుడు). మాది నిరుపేద కుటుంబం. ఆపరేషన్ చేయించాలంటే పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చవుతుందని చెప్పారు. పిల్లలకు ప్రభుత్వం ఉచితంగా ఆపరేషన్లు చేయించి ఆదుకుంటోందని తెలిసి.. అధికారులను కలిశాను. వారు ఒక చెవికి ఆపరేషన్ మాత్రమే చేస్తామని, సీఎం జగన్ను కలుసుకుంటే పూర్తిగా ఆపరేషన్ చేసే అవకాశం ఉందన్నారు.
తాను టీడీపీ జన్మభూమి కమిటీ సభ్యుడిని అయినందున తనకు సాయం చేస్తారో లేదోనని భయపడ్డాను. కానీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు చొరవతో సీఎం వైఎస్ జగన్ను కలిసి కష్టాలు చెప్పుకొన్నాం. విపక్ష పార్టీ వాడినని చూడకుండా ఆయన వెంటనే ఎంత ఖర్చయినా పాపకు వినికిడి, మాట వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మా మనవరాలికి చెవులకు ప్రభుత్వమే రూ.14 లక్షలు ఖర్చుపెట్టి ఆపరేషన్ చేయించడమే గాక, ఏడాదిన్నర పాటు ఉచితంగా మందులు కూడా ఇచ్చింది. ఇప్పుడు నా మనవరాలు కోలుకుంది. దానికి సీఎం వైఎస్ జగనే కారణం’ అంటూ కన్నీళ్ల పర్యంతమయ్యాడు.