
పోలీసులు, కూటమి నేతల వేధింపులు తాళలేక వైఎస్సార్సీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య
ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు రేపు సత్తెనపల్లి మండలం రెంటపాళ్లకు మాజీ సీఎం వైఎస్ జగన్
భారీగా జనం తరలివస్తారని ఇంటెలిజెన్స్ నివేదికలు
పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వ కుట్రలు
భద్రత కల్పించలేని కారణంగా అనుమతి లేదంటున్న పోలీసులు
ఎన్నడూ లేనివిధంగా ప్రతిపక్ష నేత పర్యటనకు కొర్రీలు
సాక్షి, నరసరావుపేట: గతంలో ఏ ప్రతిపక్ష నేతకూ లేని నిబంధనలు తెరపైకి.. ఏదో ఒకవిధంగా పర్యటనను అడ్డుకునే ప్రయత్నాలు.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి పర్యటనను అడ్డుకునే కుట్రతో కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోంది. ఈ నెల 18న సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో వైఎస్ జగన్ పర్యటించనున్నారు. నిరుడు సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డ వైఎస్సార్సీపీ నేత, రెంటపాళ్ల గ్రామ ఉప సర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. పోలీసులు, కూటమి నేతల వేధింపులు తాళలేక నాగమల్లేశ్వరరావు పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు.
ఫలితాలు వెలువడిన జూన్ 4, మరుసటి రోజు పోలీసులు ఆయనను స్టేషన్లో కూర్చోబెట్టారు. ఫలితాలు వచ్చిన రోజు సాయంత్రం కూటమి పార్టీల కార్యకర్తలు.. నాగమల్లేశ్వరరావు ఇంటిపై రాళ్లు రువ్వారు. ఆ విషయం చెప్పడానికి కూతురుతో మాట్లాడుతుండగా సెల్ఫోన్ లాక్కున్నారు. రెంటపాళ్లలో అడుగుపెడితే కేసులు నమోదు చేస్తామని బెదిరించారు. ఓవైపు పోలీసులు, మరోవైపు కూటమి నేతల తీరుతో మనస్తాపం చెందిన నాగమల్లేశ్వరరావు జూన్ 6న ఆత్మహత్య చేసుకున్నారు.
ఆ కుటుంబాన్ని పరామర్శించి, వారు ఏర్పాటు చేసుకున్న విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఈ నెల 18న మాజీ సీఎం వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన ఖరారైంది. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా దీనికి అనుమతివ్వలేమని, తాము చెప్పిన ఆంక్షల మేరకైతేనే అనుమతిస్తామని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. భద్రతా కారణాలు చూపుతూ గతంలో ఏ ప్రతిపక్ష నేత పర్యటనకు లేని ఆంక్షలను పోలీసులు ప్రస్తుతం విధిస్తున్నారు.
ప్రజాభిమానాన్ని కొలిచేది ఎలా..?
ఈ నెల 18న రెంటపాళ్లలో వైఎస్ జగన్ పర్యటనకు అనుమతివ్వాలంటూ సత్తెనపల్లి వైఎస్సార్సీపీ ఇన్చార్జి డాక్టర్ గజ్జెల సు«దీర్ భార్గవ్రెడ్డి సత్తెనపల్లి డీఎస్పీకి దరఖాస్తు చేశారు. దీనిపై పోలీసులు ముప్పుతిప్పలు పెడుతున్నారు. భారీగా జనం తరలివస్తారని నివేదికలు ఉన్నాయని.. కార్యక్రమానికి ఎంతమంది హాజరవుతారు? పాల్గొనే వాహనాల సంఖ్య ఎంత? స్పష్టం చేయాలని అడుగుతున్నారు. వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించడానికి తప్ప.. ఈ కార్యక్రమానికి పార్టీ తరఫున జన సమీకరణ లేదు.
అయితే, వైఎస్ జగన్ వస్తున్నారంటే అభిమానులు భారీగా తరలివస్తారు. ఆ అభిమానాన్ని నిర్వాహకులు ఎలా లెక్కకట్టి చెప్పగలరు. కానీ, ఎన్నడూ లేని విధంగా పోలీసులు ఈ కారణాలతో వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల తెనాలి, రాప్తాడు, పొదిలిలో వైఎస్ జగన్ పర్యటనకు ప్రజల నుంచి విశేషణ స్పందన వచి్చంది. ఏడాదిలోనే ప్రభుత్వ వ్యతిరేకత తారస్థాయికి చేరిందని వీటి ద్వారా తేలింది. అందుకనే కూటమి నేతలు కుట్రలకు తెరతీస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
పోలీసులు చెబుతున్నట్లుగా మూడు కార్లు, వందమందితో పర్యటన ఎలాగని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు రాజధానిపై టీవీలో ప్రసారమైన వ్యతిరేక వ్యాఖ్యల నేపథ్యంలో పెద్దఎత్తున మహిళలు రోడ్ షోను అడ్డుకునే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. వారిని సాకుగా చూపుతూ పర్యటన అనుమతికి ముడిపెట్టారు. అనుమతుల విషయంలో గందరగోళం సృష్టించడం, పాల్గొంటే కేసులు పెడతారన్న భయం కలిగించి.. వచ్చే అభిమానుల సంఖ్యను తగ్గించే కుట్రలకు తెరలేపిందని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

18న వైఎస్ జగన్ పర్యటనకు అనుమతి లేదు
పల్నాడు జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు వెల్లడి
నరసరావుపేట రూరల్: మాజీ సీఎం వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటనకు అనుమతి నిరాకరించినట్టు పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. తన కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 18న వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన అనుమతి కోసం సత్తెనపల్లి వైఎస్సార్సీపీ ఇన్చార్జి డాక్టర్ గజ్జల సు«దీర్భార్గవ్రెడ్డి దరఖాస్తు చేశారని, అందులో పూర్తి వివరాలు లేకపోవడంతో అదనపు సమాచారం ఇవ్వాలని కోరినట్లు పేర్కొన్నారు. నిబంధనల వలన దరఖాస్తును తిరస్కరిస్తున్నట్లు తెలిపారు.
సుదీర్భార్గవ్రెడ్డి కోరిన విధంగా కార్యక్రమ నిర్వహణకు అనుమతివ్వడం లేదని తెలిపారు. కాగా, ఇటీవల వైఎస్ జగన్ పర్యటనలకు భారీ ఎత్తున ప్రజలు హాజరవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా పర్యటనకు కూడా వేలాది మంది తరలివస్తారని ఇంటెలిజెన్స్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఎలాగైన జగన్ పర్యటనను అడ్డుకోవాలనే కుట్రతోనే రకరకాల నిబంధనల పేరుతో ప్రభుత్వం అనుమతిని నిరాకరించిందని జనంలో చర్చ జరుగుతోంది.