సాక్షి,విజయవాడ: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరికలతో కూటమి ప్రభుత్వం దిగొచ్చింది. దళిత యువకుడు పేరుపోగు క్రాంతికుమార్ ఆత్మహత్య కేసులో పోలీసులు ఎట్టకేలకు సెక్షన్లు మార్చారు. క్రాంతికుమార్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించి, ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసిన తర్వాతే ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
మే 21న కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపులు తట్టుకోలేక క్రాంతికుమార్ సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే అప్పటివరకు కనీసం కేసును కూడా పట్టించుకోని పోలీసులు, మొదట దీనిని కేవలం అనుమానాస్పద మృతిగా మార్చేశారు. నగరంలో సాయికృష్ణ కస్టడీ మరణం తీవ్ర కలకలం రేపిన నేపథ్యంలో.. వైఎస్ జగన్ స్వయంగా రంగంలోకి దిగి క్రాంతికుమార్ కుటుంబానికి అండగా నిలిచారు. బాధితులకు న్యాయం జరగకపోతే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించిన వెంటనే ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది.
వైఎస్ జగన్ పర్యటన, డిమాండ్ల అనంతరం ఉన్నతాధికారులు ఈ కేసుపై సీరియస్గా దృష్టి పెట్టారు. విజయవాడ నార్త్ ఏసీపీ సత్యానంద సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా, సీఐ నాగరాజు వేధింపుల వల్లే క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని స్పష్టమవడంతో పోలీసులు కేసులో సెక్షన్లు మార్చారు. సీఐ నాగరాజుపై ఆత్మహత్యకు ప్రేరేపించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, ఆయనను నిందితుడిగా చేర్చారు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఇప్పటికే సస్పెండ్ అయి హత్య కేసు ఎదుర్కొంటున్న నాగరాజుకు వైఎస్ జగన్ పరామర్శతో ఈ కొత్త కేసు రూపంలో మరిన్ని చట్టపరమైన ఇబ్బందులు చుట్టుముట్టాయి.


