నేటి నుంచి సీఎస్‌ఏబీ ‘స్పెషల్‌’ కౌన్సెలింగ్ | Special Round Of Counseling From 16th November For CSAB | Sakshi
Sakshi News home page

నేటి నుంచి సీఎస్‌ఏబీ ‘స్పెషల్‌’ కౌన్సెలింగ్

Nov 16 2020 2:55 AM | Updated on Nov 16 2020 2:55 AM

Special Round Of Counseling From 16th November For CSAB - Sakshi

సాక్షి, అమరావతి: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (ఐఐఈఎస్‌టీ), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐఐఐటీ), గవర్నమెంట్‌ ఫండెడ్‌ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌ (జీఎఫ్‌టీఐ)ల్లో ఖాళీ సీట్ల భర్తీకి సెంట్రల్‌ సీట్‌ అలొకేషన్‌ బోర్డ్‌ (సీఎస్‌ఏబీ) నిర్వహించే స్పెషల్‌ రౌండ్‌ కౌన్సెలింగ్‌ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన అభ్యర్థులందరూ ఈ రెండు విడతల స్పెషల్‌ రౌండ్‌ కౌన్సెలింగ్‌కు అర్హులు. అయితే ఈ కౌన్సెలింగ్‌లో సీటు పొందిన అభ్యర్థి ఇంతకు ముందు సీటును పొంది ఉంటే దాన్ని కోల్పోతాడు. ఈ మేరకు ఇంతకు ముందు కేటాయించిన సీటును కోరబోమని కౌన్సెలింగ్‌లో పాల్గొనే అభ్యర్థులందరి నుంచి అఫిడవిట్‌ తీసుకోనున్నారు. ఈ ప్రత్యేక రౌండ్‌ కౌన్సెలింగ్‌కు సీట్ల ఖాళీలను సోమవారం ప్రకటించనున్నారు. జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్‌కు నమోదు చేసుకున్నవారు, సీట్లు పొంది రద్దు చేసుకున్నవారు, మధ్యలో విత్‌డ్రా అయినవారు, జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించి జోసా కౌన్సెలింగ్‌కు రిజిస్టర్‌ చేసుకోనివారంతా కొత్తగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 


అభ్యర్థులకు సూచనలు.. 
– అభ్యర్థులు ‘హెచ్‌టీటీపీఎస్‌://సీఎస్‌ఏబీ.ఎన్‌ఐసీ.ఐఎన్‌’ వెబ్‌ పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.
– రిజిస్ట్రేషన్‌ సమయంలో అభ్యర్థులు తమ అర్హతలు, జాతీయత, జెండర్, కేటగిరీ తదితర అంశాలను నమోదు చేయాలి.
– అభ్యర్థులు చాయిస్‌లను ఫిల్‌ చేస్తూ ఎప్పటికప్పుడు సేవ్‌ చేస్తూ ఉండాలి. సేవ్‌ చేయకపోతే అవి సర్వర్‌ నుంచి కనిపించకుండా పోయే ప్రమాదముంది.
– నిర్ణీత సమయంలో అభ్యర్థులు తాము సేవ్‌ చేసిన వాటిని లాక్‌ చేయాలి. 
– చాయిస్‌ ఫిల్లింగ్‌ అనంతరం వాటిని సేవ్‌ చేయకపోతే సమయం ముగిశాక ఆ అభ్యర్థులకు సీట్ల కేటాయింపు జరగదు.
– చాయిస్‌ ఫిల్లింగ్‌ సేవ్, లాక్‌ చేశాక ప్రింటవుట్‌ను తీసుకోవాలి.
– జోసా నిర్వహించిన కౌన్సెలింగ్‌లో పాల్గొని సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 9 నుంచి 13 లోపు పాక్షిక ఫీజు చెల్లించి ఉండకపోతే వారి సీటు రద్దు అవుతుంది. వారు స్పెషల్‌ రౌండ్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది.
– జోసా కౌన్సెలింగ్‌లో సీటు వచ్చి పాక్షిక ఫీజు చెల్లించిన అభ్యర్థులు స్పెషల్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొనని పక్షంలో ఈ నెల 16 నుంచి 21లోపు తమకు కేటాయించిన సంస్థల్లో చేరాల్సి ఉంటుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement