
రాష్ట్ర సరిహద్దు కొడికొండ చెక్పోస్టు వద్ద మురళీ నాయక్ భౌతికకాయాన్ని చూసేందుకు తరలివచ్చిన జనం
వీరజవాన్ మురళీ నాయక్ భౌతికకాయానికి దారి పొడవునా ప్రజల నివాళి
కల్లి తండాకు పోటెత్తిన ప్రజలు, ప్రముఖులు.. మురళీ త్యాగాన్ని వేనోళ్ల కొనియాడిన వైనం
నేడు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
గోరంట్ల: జమ్మూ కాశ్మీర్లో పాక్తో పోరాటంలో మరణించిన వీరజవాన్ మురళీ నాయక్ భౌతికకాయం శనివారం రాత్రి శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలో ఆయన స్వగ్రామమైన కల్లి తండాకు చేరుకుంది. నాయక్ భౌతికకాయం శనివారం కాశ్మీరు నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఎయిర్పోర్టులో సైనిక అధికారులు, సిబ్బంది ఘన నివాళులరి్పంచారు. రాష్ట్ర మంత్రి సవిత ప్రభుత్వం తరఫున నివాళులరి్పంచారు. అక్కడి నుంచి ఆర్మీ కాన్వాయ్లో రోడ్డు మార్గాన స్వగ్రామానికి తీసుకొచ్చారు.
దారి పొడవునా వేలాదిగా ప్రజలు తరలివచ్చి అమర వీరుడికి జోహార్లు అరి్పంచారు. దీంతో 44వ నంబరు జాతీయ రహదారి జనసంద్రంగా మారింది. కర్ణాటకలోని బాగేపల్లి, చిక్కబళ్లాపురం, బాగేపల్లి టోల్ప్లాజా తదితర ప్రాంతాల్లోనూ ప్రజలు వేలాదిగా జాతీయ రహదారిపైకి చేరుకుని వీరజవాన్కు ఘన నివాళులరి్పంచారు. వందేమాతరం, జై జవాన్ నినాదాలు మిన్నంటాయి. భారీ జనం రావడంతో కాన్వాయ్ ముందుకు సాగడానికి చాలా సమయం పట్టింది. కర్ణాటక సరిహద్దు దాటి జిల్లాలోకి ప్రవేశించగానే.. చిలమత్తూరు మండలం కొడికొండ చెక్పోస్టు వద్ద జవాన్ భౌతికకాయం ఉన్న వాహనంపైకి పూలవర్షం కురిపించారు. మురళి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ జనం కంటతడి పెట్టారు. కోడూరు థామస్ మన్రో తోపు, గుమ్మయ్యగారిపల్లి క్రాస్ మీదుగా స్వగ్రామం కల్లి తండాకు భౌతిక కాయం చేరుకుంది.
స్వగ్రామంలో ఉద్వేగభరిత వాతావరణం
మురళీ నాయక్ భౌతిక కాయం చేరుకోవడంతో స్వగ్రామం కల్లితండాలో ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు సహా అక్కడ ఉన్న ప్రజలు జవాన్ భౌతికకాయానికి కన్నీటితో స్వాగతం పలికారు. వీరజవాన్కు నివాళులరి్పంచడానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు, అధికారులు, నాయకులు భారీగా ఇంటి వద్దకు చేరుకున్నారు. మురళి అమర్ రహే అంటూ నినదించారు. వీరజవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సమంత్, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు శంకరనారాయణ, ఎమ్మెల్సీ మంగమ్మ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పరామర్శించారు.
నేడు అంత్యక్రియలు
వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు ఆదివారం సైనిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్, పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.