ఏపీ స్థూల ఉత్పత్తిపై ‘ఎస్‌బీఐ రీసెర్చ్‌’ నివేదిక.. నాలుగేళ్లలో రెట్టింపు | SBI Research On Andhra Pradesh Gross Production | Sakshi
Sakshi News home page

ఏపీ స్థూల ఉత్పత్తిపై ‘ఎస్‌బీఐ రీసెర్చ్‌’ నివేదిక.. నాలుగేళ్లలో రెట్టింపు

Aug 7 2023 3:13 AM | Updated on Aug 7 2023 8:21 AM

SBI Research On Andhra Pradesh Gross Production - Sakshi

ఏపీ జీఎస్‌డీపీ 2022–23లో 16 శాతం వృద్ధితో రూ.13 లక్షల కోట్లకు చేరింది. 2027 నాటికి  రూ.20 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. అంటే నాలుగేళ్లలో ఏపీ స్థూల ఉత్పత్తి దాదాపు రెట్టింపు కానుంది.

సాక్షి, అమరావతి: వచ్చే నాలుగేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రెట్టింపు కానుంది. ఆంధ్రప్రదేశ్‌ జీఎస్‌డీపీ ఏకంగా రూ.20 లక్షల కోట్లకు చేరుకోనున్నట్లు ‘ఎస్‌బీఐ రీసెర్చ్‌’ నివేదిక వెల్లడించింది. 2022 సంవత్సరం నుంచి ఏపీ వేగవంతమైన వృద్ధి నమోదు చేస్తున్నట్లు నివేదిక తెలిపింది. 2027 నాటికి దేశ ఆర్థిక పరిస్థితితోపాటు ఏపీ సహా 15 రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థల తీరు తెన్నులపై ‘ఎస్‌బీఐ రీసెర్చ్‌’ నివేదికను విడుదల చేసింది. 2027 నాటికి తెలంగాణను అధిగమించి ఆంధ్రప్రదేశ్‌ స్థూల ఉత్పత్తి పెరుగుతుందని నివేదిక స్పష్టం చేసింది. 

‘ఎస్‌బీఐ రీసెర్చ్‌’ ముఖ్యాంశాలివీ..
► దేశంలో 2022 నుంచి వృద్ధి వేగం పుంజుకుంది. 2027 నాటికి భారత్‌ ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. 
► దేశ ప్రస్తుత వృద్ధి రేటును పరిగణలోకి తీసు కుంటే 2027 నాటికి జపాన్, జర్మనీలను అధిగమిస్తుంది. ప్రపంచ జీడీపీలో భారత్‌ వాటా నాలుగు శాతాన్ని దాటుతుంది. ప్రపంచ దేశాల జీడీపీలో భారత్‌ 2014లో పదో ర్యాంకులో ఉండగా 2015లో 7వ ర్యాంకులో నిలిచింది. 2019లో ఆరో ర్యాంకులో ఉంది. 2022లో ఐదో ర్యాంకులో ఉండగా 2027 నాటికి మూడో ర్యాంకులో నిలిచే అవకాశం ఉంది. 
► 2027 నాటికి భారత్‌ జీడీపీ రూ.420.24 లక్షల కోట్లకు చేరుతుంది. ఇందులో 15 రాష్ట్రాల నుంచే దేశ జీడీపీకి రూ.358.40 లక్షల కోట్లు సమకూరనుండటం గమనార్హం. దీనికి సంబంధించి అత్యధికంగా 13 శాతం వాటాతో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలవనుంది. ఉత్తర్‌ప్రదేశ్‌ 10 శాతం వాటాతో రెండో స్థానంలో, ఐదు శాతం వాటాతో ఆంధ్రప్రదేశ్‌ ఏడో స్థానంలో నిలవనున్నాయి.
► 2027 నాటికి భారత్‌లో కొన్ని రాష్ట్రాలు ఏకంగా కొన్ని దేశాలకు మించి వృద్ధి నమోదు చేస్తాయి. 
► ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రూ.11 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నమోదు కాగా 2027 నాటికి రూ.20 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. అంటే నాలుగేళ్లలో ఏపీ స్థూల ఉత్పత్తి దాదాపు రెట్టింపు కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement