Russia Ukraine War: Stranded Indian Students In Ukraine Setup To Reach India - Sakshi
Sakshi News home page

Telugu Students In Ukraine: ఇప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నా.. వచ్చేస్తున్నా..నాన్నా..

Mar 3 2022 5:05 PM | Updated on Mar 3 2022 9:58 PM

Russia Ukraine War: Stranded Indian Students Ukraine Setup To Reach India - Sakshi

భోగాపురం రూరల్‌(విజయనగరం): నాన్నా...  ఉక్రెయిన్‌ నుంచి బయలుదేరి లివీవ్‌ అనే స్టాప్‌లో ట్రైన్‌లోంచి ఇప్పుడే దిగాను. ఇక్కడ నుంచి బోర్డర్‌కి బస్‌ లేదా ట్రైన్‌గాని ఎక్కాలంట.. ఇక్కడ తినడానికి ఫుడ్‌ ఇస్తున్నారు.. లైన్‌లో ఉన్నా కంగారుపడవద్దు నాన్నా అని కుమార్తె మైలపల్లి యమున తన తండ్రి ఎల్లాజీకి ఫోన్‌ ద్వారా బుధవారం సాయంత్రం 5 గంటలకు తెలిపింది. ఈ సమాచారంతో నాలుగు రోజులుగా ఆందోళనతో ఉన్న యమున  తల్లిదండ్రులు ఎల్లాజీ, పైడితల్లి హృదయాల్లో ఆనందం వెల్లివిరిసింది. వెంటనే ఇంట్లో నుంచి బయటకు వచ్చి వీధిలో ఉన్న వారందరికీ విషయాన్ని సంతోషంగా తెలియజేశారు.

దీంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. యుద్ధ వాతావరణంలో తమ కుమార్తె ఉండడంతో ఇంటికి క్షేమంగా తిరిగి వస్తుందా? లేక వినకూడని వార్త ఏదైనా వింటామా? అని ఆందోళనతో ఉన్న తల్లిదండ్రులు ఈ సమాచారంతో ఒక్కసారిగా ఉబ్బితబ్బిబ్బయ్యారు. వెంటనే తమ ఇలవేల్పుకు నమస్కారాలు చేసుకుని దీపాలు వెలిగించుకున్నారు. తిరిగి కుమార్తెను ఫొన్‌లో వివరాలు అడిగారు. అక్కడ బస్‌ ఎక్కితే ఎన్ని గంటలు జర్నీ ఉంటుంది అని తండ్రి అడిగాడు. బస్‌ ఎక్కిన తరువాత 5 లేదా 6 గంటలు పడుతుంది నాన్నా..  అని సమాధానం ఇచ్చింది కుమార్తె.

ఇంకా ట్రైన్‌ ఎక్కి బోర్డర్‌కి వెళ్లలేదు నాన్నా, మధ్యలో ఉన్నాం, బోర్డర్‌కి వెళ్లిన తరువాత ఫ్లైట్‌ ఏ రోజు అని చెబుతారు.. వెంటనే ఫ్లైట్‌ ఎక్కించే పరిస్థితి ఉండదు. కొన్ని రోజులు అక్కడ ఉంచి, వీసా ఇచ్చిన తరువాత ఫ్లైట్‌ ఎప్పుడని చెప్తారు నాన్నా.  నీకు ఎçప్పటికప్పుడు ఫోన్‌లో మాట్లాడాతా.. అమ్మకు చెప్పు భయపడొద్దని అని ఫోన్‌ కట్‌ చేసింది.   


 

Advertisement
 
Advertisement
Advertisement