అన్ని రంగాల్లో ముందుండాలన్నదే స్వేరోయిజం | RS Praveenkumari Comments On Sweroism | Sakshi
Sakshi News home page

అన్ని రంగాల్లో ముందుండాలన్నదే స్వేరోయిజం

Oct 25 2021 5:45 AM | Updated on Oct 25 2021 5:45 AM

RS Praveenkumari Comments On Sweroism - Sakshi

పాత గుంటూరు: రాజకీయాలతో పాటు అన్ని రంగాల్లోనూ మనమే ముందుండాలన్నదే స్వేరోయిజమని ఐపీఎస్‌(వీఆర్‌ఎస్‌) అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ చెప్పారు. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఆదివారం అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం.. మార్పు కోసం స్వేరోయిజం అంశాలతో స్వేరోస్‌ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రవీణ్‌కుమార్, ఏపీ సీఐడీ చీఫ్‌ పీవీ సునీల్‌కుమార్, ఐఆర్‌టీఎస్‌ విశ్రాంత అధికారి డాక్టర్‌ భరత్‌భూషణ్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఎన్నో సవాళ్లున్నాయని, వాటిని ఎదుర్కోవాలంటే రాజకీయంగానే సాధ్యమవుతుందన్నారు. రానున్న కాలంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు దళితుల చుట్టే తిరుగుతాయన్నారు. ప్రజా సేవే లక్ష్యంగా మాయావతి ఆశీస్సులతో బీఎస్పీలో చేరానని, రానున్న ఎన్నికల్లో పార్టీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.

ఏపీలో స్వేరో నెట్‌వర్క్‌ కార్యాలయాన్ని ప్రారంభించాల్సిన అవసరముందన్నారు. సునీల్‌కుమార్‌ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కాన్షీరాం ప్రసంగాలపై రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. 

Advertisement
 
Advertisement
Advertisement