సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లాలో గణేష్ నిమజ్జన ఊరేగింపులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గణేషుడి విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్తున్న భక్తులపైకి ఐషర్ వ్యాన్ దూసుకెళ్లడంతో ఇద్దరు భక్తులు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా.. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన వి.కోట మండలం నాయకనేరి టోల్ ప్లాజా వద్ద జరిగింది.
వివరాల మేరకు.. గందోడిపాల్య గ్రామానికి చెందిన భక్తులు గణేష్ విగ్రహాన్ని గురువాయం ఉదయం నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు. ఇదే సమయంలో చిత్తూరు నుంచి హాసన్ వైపు వెళ్తున్న ఐషర్ వాహనం అదుపుతప్పి నిమజ్జన ఊరేగింపుపైకి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన మరో ఆరుగురిని చికిత్స కోసం కుప్పం పీఎస్ ఆస్పత్రికి తరలించారు.
ఇక, ఈ ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: ఏపీలో ప్రైవేటుకు పవర్!


