అమరావతి: అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమీక్ష నిర్వహించారు. సమావేశాల నిర్వహణకు సంబంధించిన అంశాలు, భద్రత, వసతుల ఏర్పాట్లపై 'విప్'లతో చర్చించారు. ఈ నెల 21వ తేదీ నుంచి శాసనసభ, శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
అసెంబ్లీలోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏఏ అంశాలపై చర్చ జరగాలనే అంశాలపై చర్చించారు. చీఫ్ విప్లు ముదునూరి నాగరాజ వర ప్రసాద రాజు, జంగా కృష్ణమూర్తి, కాపు రామచంద్రారెడ్డి, ఇతర అధికారులు హాజరయ్యారు.
సమావేశాల్లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి బుగ్గన తెలిపారు. సమావేశాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని సూచించారు. అసెంబ్లీ సమావేశాలను ఫలవంతం చేయాలని, అభివృద్ధిపై చర్చించాలని చెప్పారు. వ్యక్తిగత విమర్శలకు స్థానం కాదని విపక్ష నేతలకు సూచించారు.