
612 గ్రామాల్లో రెవెన్యూ రికార్డులు గల్లంతు
2.27 లక్షల మంది రైతులకు ఐడీలు మిస్సింగ్
ముందుకు సాగని ఫార్మర్ రిజిస్ట్రీ
సాక్షి, అమరావతి:ఆంధ్రప్రదేశ్ ఫార్మర్ రిజిస్ట్రీ (ఏపీఎఫ్ఆర్) ముందుకు సాగడం లేదు. రెవెన్యూ, వ్యవసాయ శాఖల మధ్య సమన్వయ లోపం ఫార్మర్ రిజిస్ట్రీ నమోదులో ప్రతిబంధకంగా మారింది. ఫార్మర్ రిజిస్ట్రీలో అవకతవకలను మార్చి నెలాఖరు నాటికి చక్కదిద్దాలని తొలుత భావించినప్పటికీ.. సాంకేతిక సమస్యల కారణంగా ఏప్రిల్ 15లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయినా ఈ ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో ఈ నెలాఖరు లోగా పూర్తి చేయాలని భావిస్తున్నారు.
రికార్డుల గల్లంతే ప్రధాన సమస్య
రాష్ట్రంలో 612 గ్రామాల్లో ల్యాండ్ రికార్డ్స్ గల్లంతైనట్టు గుర్తించారు. మరోవైపు స్టేట్ ఫ్యామిలీ డేటా బేస్ (ఎస్ఎఫ్డీబీ)లో 6 వేలకు పైగా గ్రామాల్లో 2.27 లక్షల రైతుల ఖాతాల వివరాలు దొరకడం లేదు. ఎస్ఎఫ్డీబీ డేటా ప్రకారం డీ పట్టా, జిరాయితీ, అసైన్డ్, ఇనామ్, ఇతర భూ వివరాలు కూడా కనిపించడం లేదు. యాజమాన్య హక్కు బదలాయింపు (ల్యాండ్ మ్యుటేషన్) 2024 నవంబర్ నుంచి అప్డేట్ కాలేదు.
సర్వే పూర్తయిన గ్రామాలు, ల్యాండ్ పార్సిల్ మ్యాప్స్ (ఎల్పీఎం) రికార్డ్స్ డేటాతో పాటు ఆర్ఓఎఫ్ఆర్ వెబ్సైట్లోని అటవీ భూ సాగుదారుల వివరాలు కూడా ఫార్మర్ రిజిస్ట్రీతో అనుసంధానం కాకపోవడం ఫార్మర్ రిజిస్ట్రీ ముందుకు సాగకపోవడానికి కారణాలుగా చెబుతున్నారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, రాయలసీమ జిల్లాల్లో ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు.
ఈ కారణంగానే ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసిన రైతులకు విశిష్ట సంఖ్య జారీలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. వీటిని యుద్ధప్రాతిపదికన పరిష్కరించి పూర్తిస్థాయిలో డేటాను అందజేయాలని వ్యవసాయ శాఖ పలుమార్లు అభ్యర్థించినా రెవెన్యూ శాఖ నుంచి కనీస స్పందన కరువైంది. ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు వెబ్ అప్లికేషన్ స్థానంలో మొబైల్ అప్లికేషన్ తీసుకు రావాలని, తద్వారా వెరిఫికేషన్, అప్రూవల్ మరింత వేగవంతం చేయాలని భావించారు. కానీ సాంకేతిక సమస్యలు వెబ్ అప్లికేషన్కు ఇబ్బందికరంగా మారాయి.
ఐదో స్థానానికి దిగజారిన ఏపీ
దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమానికి గతేడాది అక్టోబర్లో శ్రీకారం చుట్టగా, మన రాష్ట్రంలో ఈ ఏడాది ఫిబ్రవరి 11న ప్రారంభించారు. తొలి దశలో పీఎం కిసాన్ లబ్ధిదారులు, మలి దశలో భూమిలేని కౌలుదారులను గుర్తించి విశిష్ట సంఖ్యను జారీ చేయాల్సి ఉంది. వెబ్ల్యాండ్ డేటా ప్రకారం రాష్ట్రంలో పీఎం కిసాన్ లబ్ధిదారులు 60 లక్షల మంది ఉండగా.. మార్చి 22 నాటికే 40 లక్షల మంది రైతుల వివరాలను ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదుతో జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాత ఒక్కో స్థానం దిగజారిపోతూ వస్తోంది.
గడచిన నెల రోజుల్లో కేవలం 4 లక్షల మందిని మాత్రమే నమోదు చేయడంతో రాష్ట్రం ఐదో స్థానానికి పడిపోయింది. ఫార్మర్ రిజిస్ట్రీ డాష్బోర్డు ప్రకారం ఇప్పటివరకు 44.03 లక్షల మంది రైతుల వివరాలు నమోదు చేయగా.. 35 లక్షల మందికి ఫార్మర్ ఐడీ అప్రూవ్ అయినట్టుగా చెబుతున్నారు. సాంకేతిక సమస్యలను పరిష్కరించడంలో రెవెన్యూ శాఖ నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లేకపోవడంతో ఫార్మర్ రిజిస్ట్రీలో వెనుకబడిపోయామని.. లేదంటే ఇప్పటికే లక్ష్యాన్ని అధిగవిుంచే వారమని వ్యవసాయ శాఖ చెబుతోంది.