సబ్‌ కాంట్రాక్టు పద్ధతిపై ఆంక్షలు

Restrictions on the subcontract method - Sakshi

కాంట్రాక్టు ఒప్పంద విలువలో 25 శాతంలోపు పనులు మాత్రమే సబ్‌ కాంట్రాక్టుకు 

రాష్ట్రస్థాయి కమిటీ అనుమతి లేకుండా సబ్‌ కాంట్రాక్టుకు పనులివ్వకూడదు

సకాలంలో నాణ్యతతో పనులు పూర్తి చేయించే బాధ్యత ప్రధాన కాంట్రాక్టర్‌దే.. లేదంటే చర్యలు

సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో అవినీతిని నిర్మూలించడానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టెండర్‌లో పనులు దక్కించుకున్న ప్రధాన కాంట్రాక్టర్‌ సబ్‌ కాంట్రాక్టు కింద ఇచ్చే పనులకు పరిమితి విధించింది. పనుల కాంట్రాక్టు అగ్రిమెంట్‌ (ఒప్పంద) విలువలో 25 శాతం కంటే ఎక్కువ విలువైన పనులను సబ్‌ కాంట్రాక్టు కింద ఇవ్వకూడదని నిబంధన పెట్టింది. సబ్‌ కాంట్రాక్టు కింద ఇచ్చే 25 శాతం పనులను ఎవరికి ఇస్తున్నారు? వారికి ఏమి అర్హతలున్నాయి? పనులు చేసిన అనుభవం ఉందా? అనే అంశాలను వివరిస్తూ రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ (ఎస్‌ఎ ల్‌టీసీ)కి ప్రతిపాదనలు పంపాలి. ఈ ప్రతిపా దనలపై ఎస్‌ఎల్‌టీసీ సంతృప్తి చెందితేనే సబ్‌ కాంట్రాక్టుకు పనులు ఇచ్చేందుకు అనుమతి ఇస్తుంది. ఎస్‌ఎల్‌టీసీ అనుమతి లేకుండా సబ్‌ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడాన్ని నిషేధించింది. 

సబ్‌ కాంట్రాక్టర్లను అడ్డుపెట్టుకుని చంద్రబాబు దోపిడీ
► ఈపీసీ (ఇంజనీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌), ఎల్‌ఎస్‌ (లంప్సమ్‌) పద్ధతుల్లో నిర్వహించిన టెండర్‌లో పనులు దక్కించుకున్న ప్రధాన కాంట్రాక్టర్‌ 50 శాతం పనిని సబ్‌ కాంట్రాక్టుకు ఇచ్చుకునే వెసులుబాటు ఉంది. కానీ.. సంబంధిత ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి.
► 2014 జూన్‌ 8 నుంచి 2019 మే 29 మధ్య ఈ నిబంధనను వక్రీకరించిన గత చంద్రబాబు సర్కార్‌.. ప్రధాన కాంట్రాక్టర్‌ను అడ్డుపెట్టుకుని పనులన్నీ సబ్‌ కాంట్రాక్టర్లకు అప్పగించేసి కమీషన్లు వసూలు చేసుకున్నారు. పోలవరం హెడ్‌ వర్క్స్‌లో ప్రధాన కాంట్రాక్టర్‌ ట్రాన్స్‌ట్రాయ్‌ని అడ్డుపెట్టుకుని పనులన్నీ సబ్‌ కాంట్రాక్టర్లకు అప్పగించారు. ప్రధాని మోదీ ఇదే అంశాన్ని రాజమహేంద్రవరం ఎన్నికల సభలో ఎత్తిచూపారు.
► హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకంలో భాగంగా రూ.200 కోట్లతో పూర్తయ్యే కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనుల అంచనా వ్యయాన్ని రూ.430 కోట్లకు పెంచేసిన టీడీపీ సర్కార్‌.. ‘సింగిల్‌’ షెడ్యూలు దాఖలు చేసిన కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డికి చెందిన ఆర్కే ఇన్‌ఫ్రాకు రూ.450.85 కోట్ల పనులు కట్టబెట్టింది. వీటిని చంద్రబాబు తన బినామీ సీఎం రమేష్‌ సబ్‌ కాంట్రాక్టు కింద అప్పగించేశారు. డిజైన్‌లు మారడం వల్ల పనుల పరిమాణం పెరిగిందని చూపి, అదనంగా రూ.129 కోట్లను దోచిపెట్టి కమీషన్లు వసూలు చేసుకున్నారు.
► సబ్‌ కాంట్రాక్టర్లు సులభంగా ఉండే మట్టి పనులు చేసి కాంక్రీట్‌ పనులు, ఎలక్ట్రో మెకానిక్‌ పనులను వదిలేయడం, ప్రధాన కాంట్రాక్టర్‌కు వారిపై నియంత్రణ లేకపోవడం వల్ల సాగునీటి ప్రాజెక్టుల పనులు అస్తవ్యస్తంగా మారాయి.

పారదర్శకతకు గీటురాయి
► టీడీపీ సర్కార్‌ నీరుగార్చిన టెండర్‌ వ్యవ స్థకు సంస్కరణల ద్వారా జీవం పోసిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం.. పనులను పారదర్శకంగా పూర్తి చేసే దిశగా సబ్‌ కాంట్రాక్టు విధానం పరిమితులు విధించింది.
► సబ్‌ కాంట్రాక్టుకు ఇచ్చిన పనులను పూర్తి చేయించాల్సిన బాధ్యత ప్రధాన కాంట్రాక్టర్‌దే. వాటి నాణ్యత బాధ్యత కూడా ప్రధాన కాంట్రాక్టర్‌దే. బిల్లుల చెల్లింపులో ప్రధాన కాంట్రాక్టరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. వీటిని ఉల్లంఘిస్తే ప్రధాన కాంట్రాక్టర్‌పై సర్కార్‌ చర్యలు తీసుకుంటుంది.
► దీని వల్ల అర్హత లేని వారికి సబ్‌ కాంట్రాక్టు కింద పనులు ఇచ్చే అవకాశం ఉండదు. అర్హత ఉన్న వారికే సబ్‌ కాంట్రాక్టు కింద పనులు ఇవ్వడం వల్ల పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేస్తారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top